ETV Bharat / bharat

నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి గ్యాంగ్​ రేప్.. కట్నం తేలేదని భార్య కాలివేళ్లు కట్

author img

By

Published : Sep 8, 2022, 4:59 PM IST

Updated : Sep 8, 2022, 5:53 PM IST

gangrape latest news
gangrape latest news

రైల్వే స్టేషన్​ బయట నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో జరిగింది. హరియాణాలో జరిగిన మరో ఘటనలో.. అదనపు కట్నం తేవడం లేదంటూ భార్య కాలివేళ్లను కట్టర్​​తో కత్తిరించాడు భర్త.

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్​ బయట నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మహారాజ్​గంజ్​ జిల్లాకు చెందిన 25 ఏళ్ల వివాహిత భర్తతో గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసింది. అనంతరం గోరఖ్​పుర్​కు చేరుకున్న మహిళ.. రైల్వేస్టేషన్​ బయట పడుకుంది. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో రైల్వే స్టేషన్​కు వచ్చిన ముగ్గురు దుండగులు ఆమెను వేధించారు. అనంతరం ఒంటరిగా ఉన్న ఆమెను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని విడుదల చేయగా.. సమీపంలోని జీఆర్పీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కట్నం తేలేదని కాలివేళ్లు కత్తిరించిన భర్త: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధిస్తున్నాడు ఓ భర్త. దీనికి భార్య ఒప్పుకోక పోవడం వల్ల ఆగ్రహించిన అతడు.. ఆమె కాలివేళ్లను కటింగ్​ ప్లేయర్​తో కత్తిరించాడు. ఈ దారుణ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్​లో జరిగింది.
నగరానికి చెందిన మహిళకు 13 ఏళ్ల క్రితం రాజేశ్​ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు బాగానే ఉన్న భర్త.. ఆ తర్వాత వరకట్నం తేవాలంటూ బాధితురాలిని వేధించడం మొదలుపెట్టాడు. రూ. 4లక్షలు అదనపు వరకట్నం తేవాలంటూ బాధితురాలి భర్త సహా అతడి తండ్రి, సోదరుడు తీవ్రంగా కొట్టేవారు. ఆమె ఒప్పుకోకపోవడం వల్ల ఆగ్రహించిన రాజేశ్​ కట్టర్​తో ఆమె కాలివేళ్లను కత్తిరించాడు.

బాధితురాలు గట్టిగా కేకలు వేయడం వల్ల చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆమెను రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త సహా అతడి తండ్రి, సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

కన్న కూతురిపైనే అత్యాచారం: కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. ఈ అమానవీయ ఘటన పంజాబ్​లోని గుర్​దాస్​పుర్​లో జరిగింది. దినానగర్​కు చెందిన మైనర్​పై అతడి తండ్రే రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. తాజాగా బాధితురాలు.. అతడి సోదరుడికి చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భర్త ప్రవర్తన నచ్చని భార్య.. పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో బాధితురాలు, తన సోదరుడితో కలిసి తండ్రి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే రోజూ మద్యం తాగి వచ్చి.. అత్యాచారానికి పాల్పడేవాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తండ్రి మరణాన్ని తట్టుకోలేక తనయుడి ఆత్మహత్య: హరియాణా సోనీపత్​లో హృదయ విదారక ఘటన జరిగింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక పోయిన తనయుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెప్టెంబర్​ 6న తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా.. మనస్తాపానికి గురైన కుమారుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మజ్రా గ్రామానికి చెందిన జగ్బిర్​ సోనీపత్​ డిపోలో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అతడిని దిల్లీ డిపోకు బదిలీ చేయడం వల్ల సెప్టెంబర్​ 6న అక్కడికి బయలు దేరేందుకు సిద్ధమయ్యాడు. బస్టాండ్​కు వస్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు అతడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగ్బీర్​ అక్కడిక్కడే మృతిచెందాడు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన సందీప్.. అంత్యక్రియలు ముగియగానే​ విషం తాగాడు. వెంటనే సందీప్​ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మరణించాడు.

నీట్​ పరీక్షల్లో ఫెయిల్​.. విషం తాగి ఆత్మహత్య: బుధవారం విడుదలైన నీట్​ యూజీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని ఆత్మహత్యకు పాల్పడింది ఓ విద్యార్థిని. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూర్​లో జరిగింది. చోళపురం గ్రామానికి చెందిన లక్షణ స్వేద నీట్​ పరీక్షల్లో పాస్​ కాకపోవడం వల్ల ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

భవనం పైనుంచి దూకి ఆత్మహత్య: నీట్​ యూజీ పరీక్షల్లో పాస్ కాకపోవడం వల్ల మనస్తాపానికి గురైన విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నొయిడాలోని నాలెడ్జ్​ పార్క్​ పోలీస్​ స్టేషన్​ ప్రాంతానికి చెందిన సంపద నీట్​ యూజీ పరీక్ష ఫెయిల్​ కావడం వల్ల భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సూసైడ్​ నోట్​ లభించలేదని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు.

పెట్రోల్​ పోసి నిప్పంటిస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్: ఝార్ఖండ్​ దుమ్కాలో యువతిపై పెట్రోల్​ పోసి నిప్పటించిన మాదిరిగానే చంపేస్తానంటూ యువతిని వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ ఉద్ధమ్​సింగ్​ నగర్​లోని​ రుద్రపుర్​లో జరిగింది. తనను వివాహం చేసుకోవాలంటూ యువతిని వేధిస్తున్నాడు యువకుడు. పెళ్లి చేసుకోకపోతే పెట్రోల్​ పోసి సజీవ దహనం చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు.

tiger cubs for sale
నిందితుడు పెట్టిన స్టేటస్​

అమ్మకానికి పులి పిల్లలు.. వాట్సాప్​లో స్టేటస్​ : తమిళనాడు చెన్నైలో పులి పిల్లల్ని అమ్మకానికి పెట్టారు. రూ. 25 లక్షలకు విక్రయిస్తామంటూ వాట్సాప్​లో స్టేటస్​ పెట్టాడు ఓ వ్యక్తి. డబ్బులు చెల్లిస్తే మూడు నెలల పులి పిల్లను పది రోజుల్లోగా డెలివరీ చేస్తానని ఆఫర్​ ఇచ్చాడు. దీనిపై విచారణ చేపట్టిన అటవీ అధికారులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. సంబంధిత ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. నిందితుడిని చరపన్నమేడు ప్రాంతానికి చెందిన పార్థీపన్​గా గుర్తించారు.

ఇవీ చదవండి: కొండ చిలువకు ప్లాస్టిక్ సర్జరీతో పునర్జన్మ

అమిత్​ షా టూర్​లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్​చల్.. చివరకు...

Last Updated :Sep 8, 2022, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.