ETV Bharat / bharat

కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

author img

By

Published : Jan 13, 2023, 6:22 AM IST

Updated : Jan 13, 2023, 7:01 AM IST

sharad yadav died
శరద్ యాదవ్ మృతి

Sharad Yadav Passes Away : కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.

Sharad Yadav Passes Away : కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్‌ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్‌ యాదవ్‌ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పల్స్‌ లేదు. మేము తొలుత సీపీఆర్‌ ప్రయత్నించి చూశాం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 10.19 గంటలకు ఆయన చనిపోయారు' అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్‌ యాదవ్‌ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్‌ యాదవ్‌ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్‌ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌(ఎల్‌జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఇది తొలి అడుగని శరద్‌ యాదవ్‌ పేర్కొన్నారు. శరద్‌ యాదవ్‌ మృతితో దేశవ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

ప్రధాని మోదీ సంతాపం
శరద్‌ యాదవ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌చేశారు. 'శరద్‌ యాదవ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. ప్రజాజీవితంలో సుధీర్ఘ కాలంపాటు మంత్రిగా, ఎంపీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డా.లోహియా ఆలోచనలతో ఎంతో స్ఫూర్తివంతంగా నిలిచారు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి' అని పేర్కొన్నారు.

కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్​ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. 'శరద్ యాదవ్ వినయం ఉన్న వ్యక్తి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను' అని ట్వీట్​ చేశారు. 'కేంద్ర మంత్రిగా, అత్యుత్తమ పార్లమెంటేరియన్​గా దశాబ్దాల పాటు దేశానికి శరద్ యాదవ్ సేవలందించారు' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా సంతాపం తెలిపారు.

Last Updated :Jan 13, 2023, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.