ETV Bharat / bharat

పాక్​కు రహస్యాల చేరవేత.. DRDO సైంటిస్ట్ అరెస్ట్.. 6నెలల్లో రిటైర్మెంట్ ఉండగా..

author img

By

Published : May 4, 2023, 9:25 PM IST

Updated : May 4, 2023, 10:33 PM IST

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో సంప్రదింపులు సాగిస్తున్న డీఆర్​డీఓకు చెందిన శాస్త్రవేత్తను మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

DRDO scientist pakistan espionage
DRDO scientist pakistan espionage

పాకిస్థాన్​కు కీలక రహస్యాలు చేరవేస్తున్న డీఆర్​డీఓ శాస్త్రవేత్తను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. పాకిస్థాన్​కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలతో నిందితుడు కాంటాక్ట్​లో ఉన్నాడని గుర్తించినట్లు ఏటీఎస్ తెలిపింది. వాట్సాప్​ మెసేజ్​లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్​ ద్వారా అతడు వారితో సంప్రదింపులు జరుపుతున్నాడని వెల్లడించింది. నిందితుడు హనీట్రాప్​లో పడ్డట్లు ఏటీఎస్ తెలిపింది. గత ఆరు నెలలుగా ఓ మహిళతో అతడు సన్నిహితంగా ఉంటున్నట్లు గుర్తించింది.

నిందితుడిని ప్రదీప్ కురుల్కర్​గా గుర్తించారు అధికారులు. పుణెలోని డీఆర్​డీఓ విభాగంలో నిందితుడు పనిచేస్తున్నాడని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి తన హోదాను దుర్వినియోగం చేశాడని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన రహస్యాల విషయంలో అతడు రాజీ పడ్డాడని తెలిపారు. ఈ రహస్య సమాచారం.. ప్రత్యర్థి దేశానికి చిక్కితే భారత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వెల్లడించారు. నిందితుడు మరో ఆరు నెలల్లో రిటైర్ కానున్నట్లు సమాచారం. ఈలోగా ప్రత్యర్థి దేశం వలలో చిక్కుకోవడం గమనార్హం.

drdo-scientist-arrested-
అరెస్ట్ అయిన సైంటిస్ట్

"నిందితుడు సీనియర్ హోదాలో ఉన్నాడు. దేశంలోని అత్యంత ఉన్నతమైన రక్షణ రంగ పరిశోధనలో పనిచేస్తున్నాడు. అతడు తన హోదాను దుర్వినియోగం చేశాడు. తనకు తెలిసిన రహస్యాలు ప్రత్యర్థి దేశాలకు చిక్కితే ప్రమాదం అని తెలిసినా.. ఈ పని చేశాడు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (పీఐఓ) ఏజెంట్​తో అతడు కాంటాక్ట్​లో ఉన్నాడు. వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా సంభాషించాడు. కీలకమైన సమాచారాన్ని ఆ ఏజెంట్​తో పంచుకున్నాడు. ఇది హనీట్రాప్ కేసు."
-ఏటీఎస్ అధికారులు

దీనిపై ముంబయి, కాలాచౌకీకి చెందిన ఏటీఎస్ విభాగం కేసు నమోదు చేసిందని అధికారులు వివరించారు. 1923 అధికారిక రహస్యాల చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఇటీవల బిహార్​లో ఇదే తరహా హనీట్రాప్​ ఘటన వెలుగుచూసింది. ముజఫర్​పుర్​ జిల్లా కాట్రా రిజిస్ట్రార్ కార్యాలయంలో క్లర్క్​గా పనిచేస్తున్న రవి చౌరాసియా అనే వ్యక్తి దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను పాకిస్థాన్​కు చెందిన గూఢాచారి సంస్థ ఐఎస్​ఐకు లీక్​ చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జాతీయ భద్రతా సంస్థ ఆదేశాల మేరకు క్లర్క్​ను అరెస్టు చేసినట్లు ముజఫర్​పుర్​ సీనియర్​ ఎస్​పీ జయంత్ కాంత్​ తెలిపారు. నిందితుడు.. ముంగర్​ జిల్లాకు చెందిన వ్యక్తి అని ఆయన తెలిపారు. పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐ గూఢాచారి సంస్థకు పనిచేసే ఓ మహిళా ఏజెంట్​.. నిందితుడిని ఫేస్​బుక్​ ద్వారా పరిచయం చేసుకుంది. అంతకుముందు నిందితుడు చెన్నై ఆవడీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్​గా పనిచేసేవాడు. అక్కడి నుంచి కూడా రహస్య సమాచారాన్ని గూఢాచారులకు పంపేవాడని తేలింది. ఈ వార్త పూర్తి వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : May 4, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.