తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే కూటమి సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ద్రవిడ మున్నేట ఖళగమ్(డీఎంకే)లో.. మిత్రపక్ష కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ)కు 6 సీట్లు దక్కాయి. అయితే.. మరో భాగస్వామియైన కాంగ్రెస్.. పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని కాపాడుకునేందుకు తర్జనభర్జన పడుతోంది.
'30 సీట్లు ఇవ్వకపోతే డీఎంకే ఓటమే'
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మణితనేయ మక్కల్ కచ్చీలకు ఈ ఏడాది కూడా మూడు, రెండు సీట్ల చొప్పున కేటాయించింది డీఎంకే. కూటమిలో భాగమైన వీసీకేకు ఆరు స్థానాలు ఇచ్చింది. అయితే.. డీఎంకే మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల కంటే.. ఈ సారి 7స్థానాల్లో పోటీని విరమించుకుంది. కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ సీట్ల పంపకం మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. డీఎంకే.. కాంగ్రెస్కు 22 స్థానాలను కేటాయించగా.. అందుకు విముఖత వ్యక్తం చేసింది హస్తం పార్టీ. తమకు కనీసం 30 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని హస్తం పార్టీ వర్గాలు తెలిపాయి. లేకపోతే డీఎంకే ఓటమి చవిచూస్తుందని పేర్కొన్నాయి.
అయితే.. డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా వీడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. త్వరలోనే ఈ విభేదాలను పరిష్కరించుకుంటామన్నారు. పార్టీ స్థైర్యాన్ని కాపాడుకునేందుకు గౌరవనీయమైన సీట్ల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
పీఎంకే వరాల జల్లు..
తమిళ రాష్ట్రంలో ఏప్రిల్ 6న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఏఐఏడీఎంకే మిత్ర పక్షమైన పట్టాలి మక్కల్ కచ్చీ(పీఎంకే) శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే.. ఉచిత ఆరోగ్య సదుపాయం కల్పించడం సహా 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి: అసోం ఎన్నికలు: 70 స్థానాల్లో భాజపా అభ్యర్థులు ఖరారు