ETV Bharat / bharat

'భారత్​లో డెల్టా ఉద్ధృతే ఎక్కువ.. మిగిలినవి తక్కువే'

author img

By

Published : Nov 11, 2021, 10:37 PM IST

భారత్​లో కొత్త వేరియంట్ల ప్రభావం తక్కువేనని, డెల్టా వేరియంట్​ ప్రభావం మాత్రం ఎక్కువగా ఉందని ఇండియన్​ సార్స్​-కోవ్​-2 జీనోమిక్స్​ కన్సార్టియం పేర్కొంది. దేశంలో ఏవై.4.2 వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని ఇన్సాకాగ్‌ వెల్లడించింది.

delta variant in India
డెల్టా

దేశంలో ప్రస్తుతం కొత్త వేరియంట్ల ప్రభావం నామమాత్రమేని.. కేవలం డెల్టా వేరియంట్‌ ప్రభావమే అధికంగా ఉన్నట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనపడుతోందని తాజా బులిటెన్‌లో పేర్కొంది. 'ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణకు డెల్టాకు చెందిన బీ.1.617.2 ఏవై, ఏవై ఉపరకాలు మాత్రమే ప్రధాన కారణంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ఇతర వేరియంట్లను డెల్టా రకం అధిగమించింది. అంతేకాకుండా ఇతర వేరియంట్ల ప్రభావం కూడా తగ్గుతున్నట్లు తెలుస్తోంది' అని భారత్‌లో జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది.

భారత్‌లో కేవలం డెల్టా దాని ఉపరకాల ప్రభావమే ఉధికంగా ఉందని.. ఇతర వేరియంట్‌ ఆఫ్‌ ఇంటెరెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ల ప్రభావం చాలా తక్కువేనని స్పష్టం చేసింది. ఇక దేశంలో ఏవై.4.2 వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని ఇన్సాకాగ్‌ వెల్లడించింది. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న వేరియంట్‌ ఆఫ్‌ ఇంటెరెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌లతో పోలిస్తే దీని ప్రభావం 0.1శాతం కంటే తక్కువగా ఉందని ఇదివరకే తెలిపింది. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌తో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో డెల్టా (బీ.1.617.2) మాత్రమే ఆందోళనకర వేరియంట్‌గా కొనసాగుతోందని, ఇవి కాకుండా దేశంలో కొత్తగా ఎటువంటి వేరియంట్‌లు వెలుగు చూడలేదని ఇన్సాకాగ్‌ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్‌ జన్యు మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా 28 ల్యాబ్‌లతో కూడిన కన్సార్టియం ఏర్పడింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కన్సార్టియంను డిసెంబర్‌ 2020లో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ జన్యుక్రమాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ.. కొత్త వేరియంట్లు, వాటి ప్రభావాలపై నివేదికలను ఇది అందిస్తుంది.

కేసులు ఇలా..

  • కేరళలో మరో మరో 7,224 కేసులు నమోదయ్యాయి. 419మంది వైరస్​కు బలయ్యారు. మొత్తం మీద కేరళలో 50.42లక్షలమందికి వైరస్​ సోకింది. 35,040మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో 997 కేసులు వెలుగుచూశాయి. 28మంది మరణించారు. కేసుల సంఖ్య 66,21,420కి చేరింది. మృతుల సంఖ్య 1,40,475కి పెరిగింది.
  • కర్ణాటకలో కొత్తగా 286 కేసులు బయటపడ్డాయి. ఏడుగురు మరణించారు.

ఇదీ చూడండి:- యూపీలో జికా విజృంభణ.. 100 దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.