ETV Bharat / bharat

వెబ్​ సిరీస్​ చూసి మర్డర్​ స్కెచ్​.. భార్య ఆత్మహత్యను షూట్​ చేసిన భర్త

author img

By

Published : Oct 27, 2022, 4:25 PM IST

man strangled to death by friend
man strangled to death by friend

తను ఇష్టపడిన అమ్మాయి ఫొటోలు స్నేహితుడి ఫోన్లో ఉన్నాయని ఆగ్రహించిన ఓ వ్యక్తి అతడ్ని హత్య చేశాడు. మరోవైపు భార్య ఆత్మహత్యకు యత్నిస్తుంటే ఆమెను కాపాడకుండా ఆ దృశ్యాన్ని వీడియో తీసి తన పైశాచికత్వాన్ని చూపించాడు ఓ భర్త.

దిల్లీలోని కరోల్‌బాఘ్​లోని ఓ కాలువలో మంగళవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి కాల్​ డేటా పరిశీలించిన పోలీసులు.. దాని ఆధారంగా రెండు నంబర్లను ట్రేస్​ చేశారు. దీంతో దర్యాప్తులో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అసలేం జరిగింది: దిల్లీలోని కరోల్​ కరోల్‌బాఘ్​కు చెందిన విష్ణు అనే వ్యక్తికి రాజ్‌హస్త్‌లోని చురు జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అదే యువతిని విష్ణు స్నేహితుడు సంజయ్​ కూడా ఇష్టపడ్డాడు. విష్ణుకు, ఆ యువతికి మధ్య సంబంధం ఉందన్న విషయం తెలుసుకున్న సంజయ్​.. దీపావళి రోజు సీతారాం అనే మరో స్నేహితుడితో పాటు విష్ణు ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో విష్ణు ఫోన్​లో ఆ యువతి ఫొటోలను చూసిన​ సంజయ్​ వాటిని డిలీట్​ చేయమని అడిగాడు. అందుకు నిరాకరించగా ఆగ్రహించిన సంజయ్ అతడ్ని గొంతు నులిమి హత్య చేశాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి మృతదేహాన్ని కారులో వేసుకుని దాదాపు రెండు గంటల పాటు నగరంలో తిరిగారు. పండుగ కారణంగా ఎవరికీ వారిపై అనుమానం రాలేదు. కాసేపటి తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశారు. స్థానికుల సమచారంతో మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. కాల్​ డేటాలోని రీసెంట్​ నంబర్లను ట్రేస్​ చేసి సంజయ్​తో పాటు సీతారాంను అదుపులోకి తీసుకున్నారు. ఓ వెబ్​ సిరీస్​లోని మర్డర్​ సీన్​ చూసి ఇలా చంపామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.

భార్య ఆత్మహత్యను చిత్రీకరించిన భర్త..
భార్య ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించకుండా ఆ దృశ్యాన్ని వీడియో తీసి తన పైశాచికత్వాన్ని చూపించాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని కాన్పుర్​లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. శోభిత గుప్తా అనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. మొదటి సారి ఆమె విఫలమవ్వగా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇది చూసిన ఆమె భర్త తనను రక్షించేందుకు బదులుగా ఆ దృశ్యాన్ని చిత్రీకరించడం ప్రారంభించాడు. ఆమె ఉరి వేసుకుని మృతి చెందిన తర్వాత మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చే సరికి ఆమె భర్త సీపీఆర్​ చేస్తున్నట్లు నటించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
పరీక్ష చేసిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. శోభిత కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కూతురు గోవాకు వెళ్లిందని..
తన కూతురిని గోవాకు తీసుకెళ్లి, సమాజంలో తమ ఇంటి పరువు పోయేందుకు కారణమైందంటూ ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. మృతురాలి ఇంట్లో దాక్కున్న ఆ వ్యక్తిని కనుగొన్న స్థానికులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్​రాజ్​లోని సంగం నగరంలో పురముఫ్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జగదీశ్​​ అనే వ్యక్తి ట్రక్​ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కూతురు అదే ప్రాంతంలో ఉన్న ఓ బొటిక్​లో కుట్టు మిషన్ నేర్చుకుంటోంది. అప్పుడే జగదీశ్ కుమార్తెకు, ఆ బొటిక్​ యజమానురాలికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. జూన్​లో బొటిక్​ నిర్వాహకురాలితో కలిసి ఆ యువతి గోవా వెళ్లింది. ఇది తెలిసి ఇరుగుపొరుగువారు గుసగుసలు మొదలుపెట్టారు. దీని వల్ల తమ ఇంటి పరువు పోయిందని భావించిన జగదీశ్​​ తన కుమార్తెను గోవాకు తీసుకెళ్లిన మహిళపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

దీపావళి రోజు రాత్రి మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో జగదీశ్​ ఆమె ఇంట్లోకి వెళ్లాడు. లోపలి నుంచి తలుపులు వేసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేకలు వేస్తోందని నోరు కట్టేసి హత్య చేశాడు. మృతి చెందాక ఆమె ప్రైవేట్ భాగాలను సైతం ఛిద్రం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే మృతురాలి కొడుకు ఇంటి తలుపు తట్టాడు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ఇంట్లోనే దాక్కున్నాడు జగదీశ్​​. తల్లి ఎంతకీ స్పందించకపోయేసరికి ఆందోళన చెందిన కొడుకు స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టించాడు. దీంతో దాక్కుని ఉన్న నిందితుడు దొరికిపోయాడు. స్థానికులు జగదీశ్​ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రాజకీయంగా మారిన గ్యాంగ్​ రేప్​ కేసు..
త్రిపురలో రాజకీయంగా దుమారం రేపుతున్న ఓ గ్యాంగ్​రేప్​ కేసులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నేతలు ఈ కేసులో ఓ భాజపా నేత తనయుడి పేరు లాగడం వల్ల ఇది మరింత వివాదాస్పదంగా మారింది. కుమార్​ఘాట్​లో జరిగిన ఈ అత్యాచారం కేసులో బుధవారం రాత్రి బాప్తు దాస్​, రాజేశ్ మలాకర్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పాపియా దేబ్​ అనే మహిళతో పాటు మరో ముగ్గురిని ఇదివరకే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. అక్టోబర్​ 20న ఫటీక్రాయ్​ పోలీసులకు కుమార్​ఘాట్​లో జరిగిన అత్యాచారం గురించి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి వద్ద వాంగ్మూలం తీసుకుని ఆమెను వైద్యపరీక్షలకు తరలించారు. బాధితురాలిని తన స్నేహితురాలు కుమార్‌ఘాట్‌లో జరుగుతున్న ఓ పార్టీకి తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి మద్యం తాగించారని, అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని యువతి తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే సామూహిక అత్యాచారం కేసులో మంత్రి కుమారుడి ప్రమేయం ఉందన్న ప్రతిపక్ష నేతల ఆరోపణల్ని భాజపా ఖండించింది. ఆ సమయంలో అతను అక్కడ లేడని, అందుకే పోలీసులు అతడ్ని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు ఆ పార్టీ నేతలు. అవాస్తవాలతో తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.

కిడ్నాపైన బిడ్డ సురక్షితంగా తల్లి వద్దకు చేరిక..
ముంబయిలోని ఓ స్కూల్​ వద్ద తల్లి పక్కన నిద్రిస్తున్న ఓ రెండు నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. బిడ్డ ఆచూకీ తెలియక ఆందోళన చెందిన తల్లి ఆజాద్​ మైదాన్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎనిమిది టీమ్స్​ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా గంటల వ్యవధిలోనే నిందితుడిని కనుగొన్నారు పోలీసులు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లికి సురక్షితంగా అప్పజెప్పారు.

ఇదీ చదవండి: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు లైవ్ వీడియో

గుజరాత్​లో త్రిముఖ పోరు.. దళిత ఓటర్ల దయ ఎటువైపో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.