మహిళా కానిస్టేబుల్​ కుటుంబంలో ముగ్గురు మృతి.. బయట డోర్​ లాక్​.. దుర్వాసనతో..!

author img

By

Published : Jul 22, 2022, 9:51 AM IST

Updated : Jul 22, 2022, 10:02 AM IST

women body found in Jamshedpur
అనుమానాస్పదంగా ముగ్గురు మృతి ()

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మృతుల్లో మహిళా కానిస్టేబుల్, ఆమె తల్లి, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాంత్రికుడు. ఆ దారుణం రాజస్థాన్​లో జరిగింది.

మహిళా కానిస్టేబుల్, ఆమె తల్లి, కూతురు పోలీసు క్వార్టర్స్​లోనే అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం రేపింది. ఈ ఘటన ఝూర్ఖండ్​ జంషెద్​పుర్​లో జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే: సవితా రాణి, ఆమె తల్లి లఖియా, పదేళ్ల కుమార్తె గోల్మురి పోలీస్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని క్వార్టర్స్​లో ఉంటున్నారు. ఎస్పీ ఆఫీసులో సవితా రాణి కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త నక్సల్ దాడిలో మరణించడం వల్ల ఆమెకు ఈ ఉద్యోగం కారుణ్య నియామకం కింద వచ్చింది. మంగళవారం నుంచి సవితా విధులకు హాజరుకావట్లేదు. రెండు రోజుల నుంచి ఇంటి బయట నుంచి తాళం వేసి ఉంది. సవితా ఇంటిలోపలి నుంచి దుర్వాసన రావడం వల్ల ఇరుగుపొరుగు వారు పోలీసులకు గురువారం సమాచారం అందించారు. పోలీసులు లోపలికి చేరుకుని మూడు మృతదేహాలను గుర్తించారు.

ఉద్యోగం ఇప్పిస్తానని: రాజస్థాన్​ బాడ్​మేర్​లో ఘోరం జరిగింది. మంత్ర విద్యతో ఉద్యోగం ఇప్పిస్తానని చెబుతూ 27 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ తాంత్రికుడు. అసభ్యకర వీడియోలను తీసి బాధితురాల్ని బ్లాక్​మెయిల్ చేసి గతేడాదిగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు నిందితుడు చంపాలాల్. బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ముక్కలుగా చేసి: హిమాచల్​ప్రదేశ్ శిమ్లాలోని​ బిలాస్​పుర్​లో దారుణం జరిగింది. అంకిత్​ కుమార్​ అనే పాలిటెక్నిక్ విద్యార్థిని హత్య చేసి రెండు ముక్కలుగా చేసి శరీర బాగాలను విడిగా గోనె సంచుల్లో పెట్టి పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతుడి ఇంటికి 500 మీటర్ల దూరంలోనే మృతదేహం లభ్యమైంది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి: అసోం హైలాకాండీలో మైనర్​పై ఇద్దరు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. అడవిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి: రూ.600 కోట్ల యావదాస్తి ప్రభుత్వానికి విరాళం.. ఒక్క ఇల్లు తప్ప!

ప్రథమ పీఠంపై గిరి పుత్రిక.. భారీ ఆధిక్యంతో ముర్ము ఘన విజయం

Last Updated :Jul 22, 2022, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.