ETV Bharat / bharat

'రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం'- ఎంపీల సస్పెన్షన్​పై ఖర్గే తీవ్ర విమర్శలు

author img

By PTI

Published : Dec 21, 2023, 6:09 PM IST

Updated : Dec 21, 2023, 7:00 PM IST

CWC Meeting Delhi Kharge Today
CWC Meeting Delhi Kharge Today

CWC Meeting Delhi Kharge Today : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎంపీ సస్పెన్షన్​ విషయమై లోక్​సభ స్పీకర్​, రాజ్యసభ ఛైర్మన్​పై పరోక్ష విమర్శలు గుప్పించారు ఖర్గే.

CWC Meeting Delhi Kharge Today : ఎంపీలను రక్షించే బాధ్యతల్లో ఉన్నవారే రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. పార్లమెంట్​ ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో స్పీకర్​, రాజ్యసభ ఛైర్మన్​పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. దిల్లీలో గురువారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. త్వరలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా, ఓటు షేర్​ పెరగడం లాంటివి కొన్ని సానుకూలంగా జరిగాయని తెలిపారు.

"ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఎలా ధ్వంసం చేస్తుందో దేశం మొత్తం చూస్తోంది. కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చలు లేకుండానే ఆమోదించుకుంటోంది. పార్లమెంట్​ను అధికార పార్టీ వేదికగా మార్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. రాజ్యాంగ పదవులు పొందిన వారు కుల, ప్రాంత రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. వాటిని విశ్లేషించుకుంటాం. మళ్లీ అవి జరగకుండా చూసుకుంటాం. లోక్​సభ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కార్యకర్తలు, నేతలందరూ కార్యాచరణ ప్రారంభించాలి. రాహుల్​ గాంధీ మరో విడత భారత్​ జోడో యాత్ర తూర్పు నుంచి పశ్చిమానికి చేయాలని అనేక మంది నేతలు కోరారు. దీనిపై అంతిమ నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉంది."

--మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

సీట్ల సర్దుబాటపై ఐదుగురు సభ్యులతో కమిటీ
సీట్ల సర్దుబాటుపై వెంటనే చర్చలు ప్రారంభించాలని విపక్ష కూటమి ఇండియా నాలుగో సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ఇందుకోసం కాంగ్రెస్​ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లోని పార్టీలను కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చిస్తుందని వివరించారు.

సార్వత్రిక ఎన్నికల వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చ
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) దిల్లీలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన AICC ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ, CWC సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

ఇటీవల వెలువడిన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు నిరాశ ఎదురుకావడం వల్ల అక్కడ తాము కీలక అస్త్రాలుగా భావించి ప్రచారానికి వెళ్లిన అంశాలపై CWC మరోసారి విశ్లేషించుకున్నారు. కుల గణన, అదానీ వ్యవహారం వంటి అంశాలతో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ అవి అంతగా పనిచేయలేదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టేందుకు కొత్త అజెండాతో కాంగ్రెస్ ముందుకు వెళ్లనుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

టార్గెట్​ 2024- ఈ నెల 21న CWC భేటీ- బీజేపీని ఓడించే వ్యూహాలపై చర్చ

ప్రధాని అభ్యర్థిగా ఖర్గే! జనవరిలో సీట్ల సర్దుబాటు- ఇండియా కూటమి భేటీలో నిర్ణయం

Last Updated :Dec 21, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.