Coronavirus Cases In IIT Kharagpur: ఖరగ్పుర్ ఐఐటీ క్యాంపస్లో కరోనా కలకలం సృష్టించింది. సుమారు 60 మందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరిలో 40 మంది విద్యార్థులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇరవై మందిలో క్యాంపస్లో నివసించే ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు.
వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందికి స్వల్పంగా లక్షణాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. లక్షణాలు కనిపించని వారు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు రిజిస్ట్రార్ తమల్ నాథ్ చెప్పారు. మిగిలిన వారు హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
క్యాంపస్లోనే ఆసుపత్రి ఉండడం కారణంగా పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపిన తమల్నాథ్.. వైద్యులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
"ఐఐటీ ఖరగ్పుర్కు చెందిన ప్రతీ ఒక్కరు జ్వరం లాంటి కొవిడ్ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటికి 60 కేసులు బయటపడ్డాయి. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు. అదే జరిగితే ఆంక్షలను విధించక తప్పదు. అందుకే మేము చెప్పిన సూచనలను పాటించాలని కోరుతున్నాం."
-తమల్ నాథ్, రిజిస్ట్రార్
డిసెంబర్ 18న ఐఐటీలో స్నాతకోత్సవం జరిగింది. విద్యార్థులను దశలవారీగా క్యాంపస్కు తీసుకురావాలని యాజమాన్యం అప్పుడు నిర్ణయించింది. తాజాగా.. వైరస్ వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ తమల్ నాథ్ తెలిపారు.
ఇదీ చూడండి: Covid Third wave: 'దేశంలో కేసుల పెరుగుదల.. మూడోదశకు సంకేతాలు'