ETV Bharat / bharat

జీ23 వర్గంపై 'గాంధీ' విధేయుల మాటలదాడి.. టార్గెట్ సిబల్!

author img

By

Published : Mar 16, 2022, 5:23 PM IST

Congress vs G23: కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్​పై మరో నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఎదురుదాడికి దిగారు. పార్టీ నుంచి ఎంతగానో ప్రయోజనం పొందిన సిబల్.. ఇలా ఫిర్యాదులు చేయడం మంచిది కాదని అన్నారు. మరోవైపు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే సైతం జీ23 నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు.

congress vs g23
congress vs g23

Congress vs G23: కాంగ్రెస్​లో రెండు వర్గాల నేతల మధ్య మాటల వేడి పెరుగుతోంది. గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే నేతలు... జీ23 వర్గంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గాంధీ కుటుంబం పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని కపిల్ సిబల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయనపై ఎదురుదాడికి దిగారు మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ ఎంతో ప్రయోజనం పొందారని, అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఇలా ఫిర్యాదులు చేయడం దురదృష్టకరమని అన్నారు. పార్టీ తరఫున ఆయన ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారని ప్రశ్నించారు. గాంధీ కుటుంబమే పార్టీని ఐక్యంగా ఉంచుతోందని వ్యాఖ్యానించారు.

"ఇలాంటి సంక్షోభ సమయంలో పార్టీని ఐక్యంగా ఉంచేది గాంధీ కుటుంబమే. రాహుల్ గాంధీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఉండాలని పార్టీలోని నేతలందరూ భావిస్తున్నారు. ఆగస్టులో ఎన్నికలు జరిగి.. పార్టీ అధ్యక్షుడిగా ఆయన గెలుపొందాలని మేమంతా ఎదురుచూస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేయకుండా కపిల్ సిబల్ రాజ్యసభకు వెళ్లారు. ఆయనకు గౌరవం ఇచ్చి పార్టీ ఆ బాధ్యతలను అప్పగించింది. దానికి ఎవరూ ఎదురుచెప్పలేదు. గాంధీ కుటుంబం తరతరాలుగా చేసిన కృషి వల్లే ఇన్నేళ్లు అధికారంలో ఉన్నాం. దీనికి మేమంతా(జీ23నేతలను ఎద్దేవా చేస్తూ) అలవాటుపడిపోయాం. ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి కలత చెందుతున్నాం. అంతర్గత కలహాలు పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడవు. భాజపాకే ప్రయోజనం."

-సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ నేత

congress leadership crisis

సీడబ్ల్యూసీ సమావేశంలో నిస్పక్షపాతంగా చర్చలు జరిగాయని ఖుర్షీద్ తెలిపారు. జీ23 వర్గానికి చెందిన నేతలు సైతం పలు అంశాలను ప్రస్తావించారని, సోనియా గాంధీ నాయకత్వంపై వీరంతా పూర్తి విశ్వాసం ఉంచారని స్పష్టం చేశారు.

ఖర్గే సైతం...

రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే సైతం జీ23 నేతలను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్ని అంశాలపై చర్చించినప్పటికీ.. జీ23 నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని.. తద్వారా పార్టీని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వంద మీటింగులు పెట్టినా.. సోనియా గాంధీని ఎవరూ బలహీనంగా మార్చలేరని, దిల్లీ నుంచి గల్లీవరకు ఉన్న కార్యకర్తలంతా ఆమె వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీలో చర్చించిన అన్ని అంశాలపై సోనియా గాంధీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్​లో సంస్థాగత మార్పులు కోరుతూ 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గతంలో లేఖ రాశారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా భాజపాకు పోటీ ఇచ్చేలా పార్టీ ఎదుగుతుందని చెబుతున్నారు. అయితే, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారు మాత్రం.. జీ23 నేతల తీరును తప్పుబడుతున్నారు. భాజపాకు ప్రయోజనం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫేస్​బుక్​పై సోనియా, రాహుల్ ఫైర్.. డెమొక్రసీకి డేంజర్ అంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.