ETV Bharat / bharat

'అందరూ కోర్టులను విమర్శిస్తున్నారు'

author img

By

Published : Jan 30, 2021, 7:47 AM IST

కోర్టులను విమర్శించే వారి సంఖ్య పెరుగుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ.. ఓ కార్టూనిస్ట్​ చేసిన ట్వీట్​పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది సుప్రీం ధర్మాసనం.

Comedian Kamra defends tweets in SC, decries growing intolerance in country
అందరూ కోర్టులను విమర్శిస్తున్నారు!

న్యాయ స్థానాలను విమర్శించడం పెరుగుతోందని, ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ ట్వీట్​ చేసినందుకు కార్టూనిస్టు రచిత్​ తనేజాపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. ఈ కేసుపై న్యాయమూర్తులు జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఆర్​.సుభాశ్​ రెడ్డి, జస్టిస్​ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయస్థానాన్ని విమర్శించడం కోర్టు ధిక్కరణ కిందకు రాదని ఆమె తరఫు న్యాయవాది ముకుల్​ రోహత్గీ వాదించారు. ఒక జర్నలిస్టు కేసును సెలవుల్లో విచారణకు స్వీకరించడంపై ప్రజల్లో విమర్శలు వచ్చాయని చెప్పారు. ఆరోపణలపై సమాధానం ఇచ్చేందుకు నిందితురాలికి మూడు వారాల గడువునిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరో రెండు కేసుల్లోనూ..

  • ఇలాంటి ట్వీట్​నే చేసినందుకు హాస్యనటుడు కునాల్​ కమ్రాపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసు విచారణను కూడా రెండు వారాలకు వాయిదా వేస్తూ ఇదే ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
  • నగదు అక్రమ చలామణి నిరోధక అపిలేట్​ ట్రైబ్యునల్​లో ఛైర్​పర్సన్​ సహా.. ఇతర ఖాళీలను భర్తీచేసే విషయమై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది ఇదే ధర్మాసనం.

వారికి మరో అవకాశం ఎందుకివ్వరు?

కొవిడ్​-19 కారణంగా 2020లో సివిల్స్​ పరీక్షలకు హాజరుకాని వారికి మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం న్యాయస్థానం. "ఒకసారే అవకాశం ఇవ్వమంటున్నాం. గతంలో ఇచ్చినప్పుడు ఈసారి ఎందుకివ్వకూడదు?" అని జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. వయసు అర్హతలను పెంచమని అడగడం లేదని, కరోనా సమయంలో ఆఖరి అవకాశాన్ని కోల్పోయిన వారి వినతిని మాత్రమే పరిశీలించమంటున్నామని సుప్రీం కోర్టు తెలిపింది.

ఇదీ చదవండి: దిల్లీలో మరోసారి రైతుల నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.