Chaos in AP Assembly on Chandrababu Arrest: గురువారం ఉదయం శాసనసభ సమావేశాలు (Andhra Pradesh Assembly Sessions) ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుపై తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. చంద్రబాబుపై కక్షసాధింపుతో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ.. నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ, టీడీపీ సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్పై చర్చకు డోలా బాలవీరాంజనేయస్వామి సహా టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
ప్రశ్నోత్తరాల సమయం మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లో నిలబడగా, మిగతా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.పోడియం పై నుంచి టీడీపీ సభ్యుల నినాదాలు, కింద నుంచి వైసీపీ సభ్యుల హేళనలు, వెక్కిరింతలతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. టీడీపీ సభ్యులు సరియైన ఫార్మాట్లో వస్తే వారు డిమాండ్ చేస్తున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చెప్పారు.
టీడీపీ సభ్యుల తీరు ఇలాగే కొనసాగితే.. వైసీపీ సభ్యులూ రెచ్చిపోయే ప్రమాదం ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే టీడీపీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ సందర్భంగా పోడియంపై ఉన్న టీడీపీ సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రి అంబటి మీసం తిప్పుతూ సవాళ్లు చేసుకున్నారు. అధ్యక్షా.. బాలకృష్ణ గారిని సినిమాల్లో చూపించమనండి. ఇక్కడ మీసాలు తిప్పడం కాదు అని అంబటి వ్యాఖ్యానించారు. ఆగాగులే.. ఇక్కడ కాదు.. దమ్ముంటే రా.. అంటూ రెచ్చగొట్టారు. వైసీపీ సభ్యుడు మధుసూదన్రెడ్డి తొడ కొట్టారు.
అధ్యక్షా... టీడీపీ సభ్యులు మీపై దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా కనిపిస్తోందని మంత్రి అంబటి అన్నారు. వారే అవాంఛనీయ ఘటనల్ని ఆహ్వానిస్తున్నారన్నారు. మా పార్టీలోంచి వెళ్లి ఆ పార్టీలో చేరిన సభ్యుడు.. మీ ముందుకు వచ్చి మానిటర్ లాగడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఆయన ఓవర్యాక్షన్ చేస్తున్నారని.. దాని వల్ల మా సభ్యులు ఆవేశకావేశాలకు లోనయ్యే అవకాశం, రెచ్చిపోయే ప్రమాదం ఉందని అన్నారు. మీపై భౌతిక దాడులకు దిగాలన్న ఉద్దేశం టీడీపీ సభ్యుల్లో కనిపిస్తోందన్నారు. వారిపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
టీడీపీ సభ్యుడు ఒకాయన మీ బల్లపై కొడుతున్నారు.. నిజంగా చంద్రబాబుపై గౌరవం ఉంటే బల్ల కొట్టాల్సింది ఇక్కడ కాదు. న్యాయస్థానాల్లోకి వెళ్లి కొట్టమనండని అంబటి అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయమని అడగాల్సింది ఇక్కడ కాదు. దిల్లీ నుంచి తీసుకొస్తున్న న్యాయవాదులతో హైకోర్టులోను. సుప్రీంకోర్టులోను, మున్సిపల్ కోర్టులోను వాదించుకోమనండని పేర్కొన్నారు. అప్పటికి సభలో గందరగోళం సద్దుమణగకపోవడంతో... స్పీకర్ సభను వాయిదా వేశారు.
వాటీజ్ దిస్ యూజ్లెస్ఫెలో.. ఎవడురా చెప్పారు మీకు.. వీడియోస్ ఆర్ ప్రొహిబిటెడ్.. తీసుకెళ్లండి వాళ్లను అంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ సీతారాం ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులను ఉద్దేశించి.. ప్లీజ్ మనవాళ్లు వెనక్కి రండి.. వైఎస్సార్.. ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ కంబ్యాక్ అంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. విరామం తర్వాత సభ మళ్లీ మొదలయ్యాక.. స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు మరింత ఉద్ధృతంగా నినాదాలు చేయసాగారు. అప్పటికి సీఎం జగన్ సభలోనే ఉన్నారు. ఈసారి టీడీపీ సభ్యులు పోడియంపైకి వెళ్లకుండా పదుల సంఖ్యలో మార్షల్స్ని మోహరించారు.
ఒక్క టీడీపీ సభ్యురాలు ఆదిరెడ్డి భవానీకే ఆరేడుగురు మహిళా మార్షల్స్ని కాపలా పెట్టారు. టీడీపీ సభ్యులు సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాయితాలు విసిరేశారని స్పీకర్ అన్నారు. సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పుని.. సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేసిన నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారన్నారు. మొదటి తప్పిదంగా భావించి ఆయనకు సభ తొలి హెచ్చరిక చేస్తోందన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా సభ ఆయనను హెచ్చరిస్తోందని పేర్కొన్నారు.
శ్రీధర్రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ఫైల్స్ చించివేయడం, మానిటర్ను పగలగొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆ అంశాన్ని నైతిక విలువల కమిటీకి రిఫర్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. సభ ఆస్తులకు నష్టం చేసిన సభ్యుల నుంచే వాటి విలువను రాబడతామన్నారు. స్పీకర్ ప్రకటన చేస్తున్నప్పుడే.. వెనుక వరుసలోంచి వైసీపీ సభ్యుడు బియ్యపు మధుసూదన్రెడ్డి... టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుడు బెందాళం అశోక్ కూడా ముందుకు దూసుకురావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ వెంటనే మంత్రులు జోగి రమేష్, కాకాణి గోవర్ధన్రెడ్డి, మేరుగు నాగార్జున సహా పెద్ద సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు వారివైపు దూసుకెళ్లారు.
TDP MLAs MLCs Condemned Chandrababu Arrest: ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు.. ప్రజలంతా మా వెంటే : టీడీపీ
అంబటి రాంబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలకూ మధ్య మార్షల్స్ అడ్డుగోడగా నిలిచారు. ఒకపక్క ఆ గొడవ జరుగుతుండగానే.. నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని బుగ్గన తీర్మానం ప్రవేశ పెట్టారు. శ్రీధర్రెడ్డి, సత్యప్రసాద్లను ప్రస్తుత సమావేశాల జరిగినంత కాలం, మిగతా టీడీపీ సభ్యుల్ని, ఉండవల్లి శ్రీదేవిని గురువారం ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ మొదట ప్రకటించారు.
టీడీపీ సభ్యులపైకి దూసుకొస్తున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల్ని.. టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ వీడియో తీయడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆయనపైనా చర్య తీసుకోవాలని బుగ్గన రాజేంద్రనాథ్ సూచించడంతో.. పయ్యావుల కేశవ్ను కూడా ప్రస్తుత సమావేశాలు జరిగినంత కాలం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.