ETV Bharat / bharat

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తీవ్ర పంట నష్టం - రైతులకు జగన్​ సమాధానం చెప్పాలి : చంద్రబాబు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 4:23 PM IST

Updated : Dec 14, 2023, 4:56 PM IST

Chandrababu media conference
Chandrababu media conference

Chandrababu Media Conference on Cyclone Michaung impact: మూడు నెలల అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. మిగ్​జాం తుపాన్​పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. తుపాన్ నిర్వాహణపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదని విమర్శలు గుప్పించారు. తుపానులను ఆపలేకపోయినా నష్టాన్ని తగ్గించొచ్చని, కానీ ఈ ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని పేర్కొన్నారు.

Chandrababu Media Conference on Cyclone Michaung impact: నాశనమైన ప్రభుత్వ వ్యవస్థలు రైతుల పాలిట శాపాలుగా మారాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థతే ఈ వినాశనానికి కారణమని ఆరోపించారు. మిగ్జామ్ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే, రైతుల్ని ఆదుకోవడం లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 15జిల్లాల్లో 25లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినటానికి సర్కారు నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టటంలోనూ మొద్దునిద్ర పోయారని విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తీవ్ర పంట నష్టం - రైతులకు జగన్​ సమాధానం చెప్పాలి : చంద్రబాబు

మూడు నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు - టీడీపీలోకి చేరనున్న వైఎస్సార్​సీపీ నేతలు

గేట్లు కొట్టుకుపోయే పరిస్థితులు: నీటిపారుదల రంగంపై ప్రభుత్వం శీతకన్ను సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు ఖర్చు పెట్టటం లేదు కాబట్టే అన్నమయ్య ప్రాజెక్టు తో పాటు పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పై విశ్వాసం లేకనే టెండర్లు పిలిచినా మరమ్మతులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని ఆక్షేపించారు. ఓ వైపు కరవు, మరో వైపు తుఫాను రైతుల్ని కొలుకోలోని విధంగా దెబ్బతీశాయన్నారు. కరవు వల్ల 26లక్షల ఎకరాల్లో పంట వేయలేదు, తుఫాను వల్ల వేసిన 25లక్షల ఎకరాల పంట దెబ్బతిందని తెలిపారు. డ్రైన్లు పూడిక కూడా తీయకపోవటంతో సముద్రానికి, పొలానికి తేడా లేకుండా పోయాయని తెలిపారు.

పదేళ్ల సాయానికి పసిడి సైకిల్ గుర్తు​ బహుమతి - మనసును తాకిన అభిమానం

ప్రభుత్వం నిర్లక్ష్యం: కేంద్రానికి సరైన నివేదికలు పంపటంలోనూ జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కరవు నివేదికలు కేంద్రానికి పంపకుండా, తుఫాను నష్టం నివేదికలో 26లక్షల ఎకరాల్లో పంట వేయలేదని పేర్కొన్నారని దుయ్యబట్టారు. ఇంత భారీ నష్టం జరిగితే కేవలం 700 కోట్లు పంట నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 700 కోట్లు పంట నష్టం అంటే కేంద్రం ఓ 100 కోట్లు మాత్రమే ఇస్తుందన్నారు. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టం, ఆస్తి నష్టంపై కేంద్రానికి నివేదిక అందించాలన్నారు. నష్టపోయిన పంటలకు ఎంత ధర చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలని స్పష్టం చేశారు. పంటల బీమా కూడా చెల్లించకుండా రైతుల్ని గోదాట్లో ముంచే దుస్థితి తెచ్చారని విమర్శించారు. రైతుల కోసం ప్రత్యేక బీమా కంపెనీ పెడతానని రైతులను మోసం చేశారని ఆక్షేపించారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పకున్నా ఫర్వాలేదు కానీ.. రైతులకైనా చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి పదవి ఉంది దోపిడీ కోసం కాదని... అదో బాధ్యత అని హితవు పలికారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్​ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు

శ్వేతపత్రం విడుదల చేయాలి: రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందేంటో శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలోననే విధానం ప్రభుత్వం వద్ద ఉందా అని ప్రశ్నించారు. 22 మంది వైకాపా ఎంపీలు దిల్లీలో ఏం చేస్తున్నారో.. ఏం పైరవీలు చేస్తున్నారని నిలదీశారు. బాధల్లో ఉన్న రైతులను సీఎం జగన్ కార్పెట్ వేసుకుని పరామర్శిస్తారా అని మండిపడ్డారు. ఆలుగడ్డకు.. ఉల్లిగడ్డకు తేడా తెలియని మనిషి ఈ సీఎం అని ఎద్దేవా చేశారు. వరి పంట నష్టం నిమిత్తం హెక్టారుకు 30 వేలు ఇవ్వాలన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే 10 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు.

Last Updated :Dec 14, 2023, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.