'సైబర్​ నేరాలను సమర్థంగా ఎదుర్కోవడం అన్ని రాష్ట్రాల సమష్టి బాధ్యత'

author img

By

Published : Oct 27, 2022, 5:12 PM IST

amit shah
amit shah ()

దేశంలోని సైబర్​ నేరాలు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి సమావేశమై వ్యూహాల్ని రూపొందించి అమలు చేసినప్పుడే విజయం సాధించగలమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సైబర్​ నేరాలను సమర్థంగా ఎదుర్కోవడం అన్ని రాష్ట్రాల సమష్టి బాధ్యత అని అభిప్రాయపడ్డారు.

సైబర్‌నేరాల నియంత్రణ, మహిళా భద్రత, తీరప్రాంతాల రక్షణ సహా అంతర్గత భద్రతపై చర్చించేందుకు తలపెట్టిన అన్నిరాష్ట్రాల హోం మంత్రుల రెండు రోజుల సమావేశాలు హరియాణాలోని సూరజ్‌కుండ్​లో ప్రారంభమయ్యాయి. చింతన్‌ శిబిర్‌గా నామకరణం చేసిన ఈ సమావేశాలకు.. శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరై ప్రసంగించారు. సైబర్ నేరాలు, ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలను రచించడానికి ఈ చింతన్​ శిబిర్​ మంచి వేదికగా మారనుందని అమిత్​ షా తెలిపారు.

"మన రాజ్యాంగంలో శాంతిభద్రతలు అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. దేశంలోని సైబర్​ నేరాలు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి సమావేశమై వ్యూహాల్ని రూపొందించి అమలు చేసినప్పుడే విజయం సాధించగలం. దేశం లేదా రాష్ట్రాల సరిహద్దుల్లో జరుగుతున్న సైబర్​ నేరాలను సమర్ధంగా ఎదుర్కోవడం అన్ని రాష్ట్రాల సమష్టి బాధ్యత. అంతర్గత భద్రతకు సంబంధించిన అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయాలు 2024 కల్లా అందుబాటులో ఉంటాయి. మన దేశ అంతర్గత భద్రత పటిష్ఠంగా ఉంది. దేశ సమగ్రత చెక్కచెదరకుండా ఉండేందుకు 35 వేల మంది పోలీసులు, సీఏపీఎఫ్​ సిబ్బంది తమ ప్రాణాలను సైతం అర్పించారు."

-- అమిత్​ షా, కేంద్ర హోం శాఖ మంత్రి

సమావేశాల ముఖ్య ఉద్దేశం ఇదే..
విజన్ 2047, ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించిన పంచ్​ ప్రాణ్​ అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయటమే ఈ చింతన్​ శిబిర్​ ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైబర్ నేరాల నిర్వహణ వ్యవస్థ అభివృద్ధి, పోలీసు బలగాల ఆధునీకరణ, నేర న్యాయవ్యవస్థలో ఐటీ వాడకం పెంపు, భూ సరిహద్దు నిర్వహణ, తీర ప్రాంత భద్రత తదితర అంశాలపై చర్చించనున్నారు. '2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్' లక్ష్యం సాధనకు నారీ శక్తీ చాలా ముఖ్యమని, మహిళ భద్రత కోసం వారికి సురక్షిత వాతావరణ కల్పించటం ప్రధానమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్గత భద్రతకు మెరుగైన ప్రణాళిక, సమన్వయానికి జాతీయ విధానం తయారు చేయటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నాయి. శనివారం ఈ భేటీని ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్​గా ప్రసంగించనున్నారని చెప్పాయి.

తెలుగు రాష్ట్రాల తరఫున..
శుక్రవారం జరిగిన సమావేశానికి కేరళ, పంజాబ్, త్రిపుర సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, కేంద్ర పాలిత పాంత్రాల లెఫ్ట్​నెంట్​ గవర్నర్లు, కేంద్ర హోం శాఖ, ఐబీ, ఎన్​ఐఏ సహా పలు నిఘా సంస్థల అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి హోం మంత్రి తానేటి వనిత హాజరవ్వగా.. తెలంగాణ నుంచి పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.