ETV Bharat / bharat

CBI Custody Report: వైఎస్ వివేకా హత్యకు ముందు, ఆ తరువాత.. కస్టడీ రిపోర్ట్​లో విస్తుపోయే అంశాలు

author img

By

Published : Apr 17, 2023, 10:51 AM IST

CBI Custody Report
సీబీఐ కస్టడీ పిటిషన్‌

CBI Custody Report: వివేకా హత్యకు కుట్ర పన్ని, అమలు చేయించింది వైఎస్ భాస్కరరెడ్డేనంటూ.. సీబీఐ ప్రధాన అభియోగం మోపింది. హత్యాస్థలిలో ఆధారాల ధ్వంసంలోనూ ఆయనదే ప్రధాన పాత్ర అని స్పష్టంచేసింది. హత్యకు ముందు, ఆ తరువాత జరిగిన పరిణామాలపై సీబీఐ సవివరంగా రిపోర్ట్​లో చెప్పింది. హత్యకు కొన్ని గంటల ముందు నిందితుడు సునీల్‌యాదవ్‌ భాస్కరరెడ్డి ఇంట్లోనే ఉన్నాడని.. గొడ్డలి కొనడానికి వెళ్లిన దస్తగిరి కోసం అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాడని తెలిపింది. ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపత్రాలతోపాటు.. తాజాగా కస్టడీ పిటిషన్‌నూ ఈ విషయాలను సీబీఐ విస్పష్టంగా పేర్కొంది.

CBI Custody Report: వైఎస్ వివేకా హత్యకు ముందు, ఆ తరువాత.. విస్తుపోయే అంశాలు

CBI Custody Report: వివేకా హత్య కేసుకు ప్రణాళిక రూపకల్పన, కుట్ర, ఆధారాల ధ్వంసంలో వైఎస్ భాస్కరరెడ్డి పాత్ర, ప్రమేయంపై... అభియోగపత్రాలు, కస్టడీ పిటిషన్‌లో సీబీఐ చాలా కీలక అంశాలను ప్రస్తావించింది. 2019 ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు ప్రణాళిక రూపొందినట్లు సీబీఐ తెలిపింది.

హత్యకు ప్లాన్ ఇలా: వివేకానందరెడ్డిని హత్య చేస్తే నీ జీవితం సెటిలైపోతుందంటూ.. ఎర్ర గంగిరెడ్డి చెప్పారని దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. నువ్వు ఒక్కడివే కాదు, నీతో మేమూ వస్తామంటూ ప్రోత్సహించారని.. ఈ హత్య వెనుక వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారని చెప్పినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ హత్య చేస్తే శివశంకర్‌రెడ్డి 40 కోట్లు ఇస్తారని.. అందులో 5 కోట్లు నీకు వాటాగా ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పారంటూ షేక్‌ దస్తగిరి వాంగ్మూలమిచ్చారు. వివేకాను చంపాలని చెప్పిన రెండు, మూడు రోజుల తర్వాత సునీల్‌ యాదవ్‌ తనకు కోటి రూపాయిలు ఇచ్చిన విషయాన్నీ వెల్లడించారు.

శివశంకర్‌రెడ్డి ద్వారా ఎర్ర గంగిరెడ్డికి, ఆయన నుంచి తనకు అందినట్లు సునీల్‌ యాదవ్‌ చెప్పాడని దస్తగిరి వివరించారు. మరోసారి నిర్ధారించుకునేందుకు సునీల్‌ యాదవ్‌తో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళితే.. ఫోన్‌లో శివశంకర్‌రెడ్డితో మాట్లాడించారని చెప్పారు. మేం ఉన్నామని చెప్పాక అనుమానం ఎందుకు, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేయాలని.. శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు. హత్య జరిగిన రోజు ఉదయం 5 గంటల సమయంలో తనతోపాటు మిగిలిన నిందితులను ఇంటికి పిలిపించిన గంగిరెడ్డి.. ఎవరూ భయపడవద్దని సూచించారని అన్నారు. అంతా చూసుకుంటామని శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారని భరోసా ఇచ్చారని.. మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారు.

హత్యకు కొన్ని గంటల ముందు: ఈ కేసులో రెండో నిందితుడైన సునీల్‌ యాదవ్‌... వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు గూగుల్‌ టేకవుట్‌ విశ్లేషణ ద్వారా సీబీఐ తేల్చింది. ఫోరెన్సిక్‌ విశ్లేషణలోనూ ఇదే విషయం నిర్ధారణైంది. వివేకాను చంపేందుకు గొడ్డలి కొనడానికి కదిరి వెళ్లిన షేక్‌ దస్తగిరి కోసం... భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంట్లో సునీల్‌యాదవ్‌ నిరీక్షించారని సీబీఐ తేల్చింది. అదేరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో వివేకాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పులివెందులకు తిరిగొస్తున్న సమయంలో... ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సాయంత్రం 6.22 గంటల సమయంలో సునీల్‌యాదవ్‌కు రెండు సార్లు ఫోన్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది.

గొడ్డలి కోసం కదిరి వెళ్లిన దస్తగిరి రాత్రి ఎనిమిదిన్నరకు పులివెందులకు వచ్చి సునీల్‌యాదవ్‌ను కలిశారని సీబీఐ తెలిపింది. ముందస్తు పథకం ప్రకారం ఆ సమయంలో వైఎస్ భాస్కరరెడ్డి తన రెండు ఫోన్లు స్విచాఫ్‌ చేశార... అదేరోజు సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి కలిసి వివేకాను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారని సీబీఐ తెలిపింది. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు వరకూ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల ఇంటికి సునీల్‌ యాదవ్‌ పదే పదే తిరిగారని సీబీఐ నిగ్గుతేల్చింది. ఈ కుట్రలో వైఎస్ భాస్కరరెడ్డిని ప్రధాన పాత్రధారిగా గుర్తించి ఆదివారం అరెస్టు చేసింది.

హత్య తరువాత.. అక్కడే నిరీక్షణ: 2019 మార్చి 15 ఉదయం నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి... వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంటివద్దే ఉన్నారని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్య ప్రణాళిక అమలు పూర్తయిన విషయం వారికి అప్పటికే తెలుసని... వేరే వ్యక్తుల ద్వారా వివేకా మృతి సమాచారాన్ని తెలుసుకోవాలని, ఆ తర్వాత వెంటనే అక్కడికి చేరుకుని ఆధారాలు, సాక్ష్యాలు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో అక్కడే నిరీక్షించారని రిపోర్టులో పేర్కొంది. వివేకా చనిపోయారనే విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి బయటికి చెప్పగానే... దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నట్లు వివరించింది.

అదే సమయంలో వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరారని సీబీఐ గుర్తించింది. హత్యాస్థలిలో ఆధారాల్ని చెరిపేయడంతో పాటు గుండెపోటుతో వివేకా చనిపోయినట్లు ప్రచారం చేయడం వరకు... అన్నీ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, గంగిరెడ్డి సమక్షంలోనే జరిగినట్లు సీబీఐ తెలిపింది. మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం, తలపై తీవ్రగాయాలు, గొడ్డలిపోటు ఉండటం చూసి కూడా... ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారని గుర్తుచేసింది. గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే అంశంపై అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి మధ్య అంతకుముందు చర్చ జరిగిందని... అందుకు అనుగుణంగానే గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారని సీబీఐ తేల్చింది.

గుండెపోటుగా చిత్రీకరణ: 2019 మార్చి 15 ఉదయం 6 గంటల 32 నిమిషాల సమయంలో 90002-66234 ఫోన్‌ నెంబరుకు అవినాష్‌రెడ్డి కాల్‌ చేసిన విషయం ప్రస్తావించింది. ముఖ్యమంత్రి జగన్‌ భార్య వైఎస్ భారతితో మాట్లాడాలంటే ఈ నంబరుకే కాల్‌ చేయాల్సి ఉంటుందని, అది ఆమె వ్యక్తిగత సహాయకుడు నవీన్‌ వద్ద ఉండే ఫోన్‌ నెంబర్‌ అని గుర్తించిన సీబీఐ.... ఆయన్ను కూడా ఇటీవల ప్రశ్నించింది. 6 గంటల 40 నిమిషాలకు ఓసారి, 6 గంటల 41 నిమిషాలకు మరోసారి... అదే నెంబర్‌కు అవినాష్‌రెడ్డి కాల్‌ చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఆయన పీఏ రాఘవరెడ్డి ఫోన్‌ నుంచి అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యకు ఫోన్‌ చేసి... గుండెపోటు, రక్తపు వాంతులతో వివేకా చనిపోయినట్లు చెప్పారని, బందోబస్తు కోసం సిబ్బందిని పంపించమన్నారని సీబీఐ పేర్కొంది.

వివేకా గుండెపోటుతో మృతి చెందారంటూ తొలిసారి సాక్షి టీవీకి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి చెప్పారని రిపోర్టులో తెలిపింది. వివేకా మృతదేహం చూసిన తర్వాత, శివశంకర్‌రెడ్డితో చర్చించాకే అవినాష్‌రెడ్డి పోలీసులకు ఫోన్‌ చేశారనేది సుస్పష్టమని... కుట్రలో భాగంగా వివేకాది సహజ మరణంగా చిత్రీకరించేందుకే రక్తపు వాంతులతో కూడిన గుండెపోటు కట్టుకథ అల్లారనేందుకు ఇదే సంకేతమని దర్యాప్తులో తేల్చింది. వివేకా హత్యను సహజ మరణంగా చిత్రీకరించాలన్న ప్రణాళిక అమల్లో భాగంగా ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయడం మొదలుపెట్టారని... ఈ ప్రక్రియంతా వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల మార్గదర్శకత్వం, పర్యవేక్షణలోనే కొనసాగిందని సీబీఐ స్పష్టంచేసింది.

లోపలి నుంచి తలుపులు వేసింది అతనే: ఆధారాలు ధ్వంసం చేస్తున్నప్పుడు వివేకా ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా భాస్కరరెడ్డి లోపలి నుంచి తలుపులు వేశారని... రక్తపు మరకలు శుభ్రం చేసేవారు, గాయాలకు కట్లు, బ్యాండేజీలు వేసే సిబ్బందిని మాత్రమే అనుమతించారని వివరించింది. ఆ సమయంలో రెండుమూడు సార్లు అవినాష్‌రెడ్డి లోపలికి వెళ్లి బయటికి వచ్చారంది. గాయాలు కనిపించకుండా మృతదేహం చుట్టూ బ్యాండేజీలతో కట్టు కట్టారని... ఫ్రీజర్‌లో ఉంచి పూలతో అలంకరించారని వెల్లడించింది.

ఆ తర్వాతే మృతదేహాన్ని ఆసుపత్రికి పంపించారని... ఈ పరిణామాలన్నీ హత్య కుట్రను దాచిపెట్టేందుకే జరిగాయని సీబీఐ తేల్చింది. మౌనంగా ఉండటంతో పాటు కేసును గుండెపోటు మరణంగా మేనేజ్‌ చేయాలని ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్యను బెదిరించడమూ కుట్రకు అద్దం పట్టినట్లు పేర్కొంది. వివేకాది గుండెపోటు మరణమేనని, ఆయన మృతదేహాన్ని సందర్శించిన ప్రజలను నమ్మించేందుకు భాస్కరరెడ్డితో పాటు అనుచరులు ప్రయత్నించారని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తెలిపింది.

మేం చూసుకుంటాములే..: వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత... కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డితో పాటు ఈశ్వరయ్యతోటలో కలినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు. సీబీఐకి కేసు అప్పగించడంతో తమ పరిస్థితి ఏంటని అడగ్గా... ‘మేం చూసుకుంటాములే.. ఇబ్బంది లేదు.. డబ్బులేవైనా కావాలంటే అడగండి ఇస్తామని భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు.

వివేకా హత్య కేసులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు తమకు చెబితే... ఏం కావాలంటే అది ఇస్తామంటూ భరత్‌ యాదవ్, న్యాయవాది ఓబుల్‌రెడ్డి ద్వారా భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి తనను ప్రలోభపెట్టారని సీబీఐకి దస్తగిరి లేఖ రాశారు. వివేకా హత్యానేరాన్ని మీద వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి 10 కోట్లు ఇస్తారంటూ శివశంకర్‌రెడ్డి తనకు ఆఫర్‌ ఇచ్చారని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్‌రెడ్డి... అదే విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చారు. గత ఏడాది జూన్‌లో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అసలు హత్య ఎందుకు?: తన అనుచరుడు శివశంకర్‌రెడ్డి ద్వారా కడప ఎంపీ అవినాష్‌రెడ్డే వివేకానందరెడ్డిని హత్య చేయించారనే అనుమానం ఉన్నట్లు గతంలోనే సీబీఐ పేర్కొంది. కడప లోక్‌సభ నియోజకవర్గ టికెట్‌ అవినాష్‌రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మల్లో ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని పేర్కొంది. అందువల్లే ఆయన్ను హత్య చేయించి ఉంటారనే అనుమానం ఉన్నట్లు వివరించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పనిచేశారని... ఆ ఎన్నికల ఓటమి తర్వాత వివేకా ఒకరోజు అవినాష్‌రెడ్డి ఇంటికెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేశారని అన్నట్లు పేర్కొంది. నాకు అన్ని విషయాలూ తెలిశాయని, మీ అందరి కథ చెబుతానంటూ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని హెచ్చరించారని... దాంతో వారి మధ్య విబేధాలు పొడచూపాయని వివరించింది.

ఎప్పుడూ వివేకాకు వ్యతిరేకమే: ఈ క్రమంలోనే వివేకాను హత్య చేయడానికి భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి కుట్ర పన్నారని సీబీఐ తెలిపింది. వివేకానందరెడ్డి పట్ల తొలినుంచీ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి ఈర్ష్యగా ఉండేవాళ్లని... భాస్కరరెడ్డి ఎప్పుడూ వివేకాకు వ్యతిరేకంగానే ఉండేవారని తెలిపింది. భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల కంటే వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేదన్న విషయం దర్యాప్తులో గుర్తించామన్న సీబీఐ... శత్రువులూ వివేకాను గౌరవించేవారని పేర్కొంది. ఆయన నిర్ణయాల్ని విమర్శించే సాహసం చేసేవారు కాదని... భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల ఈర్ష్యకు ఇవన్నీ కారణాలుగా పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపత్రానికి సీబీఐ జతపరిచింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.