ETV Bharat / bharat

భాజపా నేతపై ముష్కరుల దాడి- ముగ్గురి మృతి

author img

By

Published : Jul 8, 2020, 9:57 PM IST

Updated : Jul 9, 2020, 3:35 AM IST

bjp leader killed in kashmir
భాజపా నేత కుటుంబంపై కాల్పులు

03:33 July 09

భాజపా నేత కుటుంబంపై ముష్కరుల దాడి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు.  ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరాలో బుధవారం రాత్రి జిల్లా భాజపా మాజీ అధ్యక్షుడు  వసీమ్‌బరి కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వసీంబరితోపాటు అతని తండ్రి,సోదరుడు ప్రాణాలు కోల్పోయారు.  

వసీమ్ బరీ నివాసం వద్ద దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మోటార్ సైకిల్ మీద వచ్చిన ముష్కరులు అతి దగ్గర నుంచి  సైలెన్సర్ అమర్చిన తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వసీమ్‌బరి అక్కడికక్కడే మరణించారు. ఆయన తండ్రి, సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.  

భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం!  

పోలీస్‌స్టేషన్‌కు పదిమీటర్ల దూరంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఏడుగురు పోలీసులను అధికారులు అరెస్ట్ చేశారు.  

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా పలు పార్టీల నాయకులు దాడిని తీవ్రంగా ఖండించారు. వసీమ్ బరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. 

00:30 July 09

వసీం కుటుంబానికి ప్రధాని సానుభూతి ప్రకటన

ఘటనపై ఆరా తీసిన ప్రధాని..

వసీంబరి కుటుంబంపై ఉగ్రదాడి, హత్యకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. వసీం కుటుంబానికి సానుభూతి ప్రకటించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.  

వసీంను కోల్పోయాం..

జమ్ముకశ్మీర్​లో జరిగిన క్రూరమైన దాడిలో వసీంబరి, అతని తండ్రి, సోదరుడిని కోల్పోయామని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పార్టీకి ఇది తీరని నష్టమని తెలిపారు. వసీం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి భాజపా  అండగా నిలుస్తుందన్నారు. వసీం త్యాగం వృథా కానివ్వమని హామీ ఇచ్చారు. 

22:18 July 08

భాజపా నేత కుటుంబంపై కాల్పులు.. ముగ్గురు మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. బందీపొరా జిల్లాలో ఒకే కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. భారతీయ జనతా పార్టీ బందీపొరా జిల్లా మాజీ అధ్యక్షుడు వసీం బరీపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు.

బందీపొరా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని వసీం దుకాణం వద్దే ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వసీం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆయన తండ్రి బషీర్​ అహ్మద్​, సోదరుడు ఉణర్​లు ఆస్పత్రికి తరలించే క్రమంలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.      

ముగ్గురి మృతిని జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ చీఫ్‌ దిల్బాగ్​ సింగ్‌ ధ్రువీకరించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు.  

కాల్పులకు తెగబడ్డ ముష్కరుల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.    

అదుపులో భద్రతా సిబ్బంది..

వసీంబరి భద్రతా సిబ్బంది 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు నిర్వహించకపోవటానికి గల కారణాలపై విచారిస్తున్నారు. 

21:49 July 08

భాజపా నేత కుటుంబంపై ఉగ్రవాదుల కాల్పులు..

జమ్ముకశ్మీర్​లోని బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భాజపా యువజన కార్యకర్త వసీం బరి కుటుంబంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వసీం సహా ఆయన తండ్రి, సోదరుడు మరణించారు.  

Last Updated : Jul 9, 2020, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.