ETV Bharat / bharat

సంక్షోభంలో దాగిన అవకాశం.. కొవిడ్‌ నేర్పిన పది పాఠాలు!

author img

By

Published : Jun 16, 2020, 7:58 AM IST

దేశంలో కరోనా కేసులు నమోదైన తొలి రోజుల్లోనే అప్రమత్తమైంది ప్రభుత్వం. వైరస్​ వ్యాప్తిని నివారించడానికి ప్రపంచంలోనే చాలా కఠినమైన లాక్‌డౌన్ విధించింది భారత ప్రభుత్వం.‌ దీని వల్ల వ్యాపారాలు కుదేలయ్యాయి. కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిణామం తీవ్ర సంక్షోభానికి దారి తీసింది. అయితే దీని నుంచి భారత్​ ఎలాంటి పాఠాలు నేర్చుకుందో తెలుసుకుందాం.

ten lessons have India learned from the Coronavirus crisis
సంక్షోభంలో దాగిన అవకాశం.. కొవిడ్‌ నేర్పిన పది పాఠాలు!

చైనీయుల చిత్ర లిపిలో సంక్షోభం అనే పదాన్ని రెండక్షరాల్లో రాస్తారు. ఒక అక్షరం ప్రమాదాన్ని, రెండో అక్షరం అవకాశాన్ని సూచిస్తాయి. కొన్ని దేశాలు కొవిడ్‌ సంక్షోభంలో భయంతో అల్లాడిపోతే, మరికొన్ని దేశాలు ఈ కల్లోలాన్ని అవకాశంగా మలచుకున్నాయి. మరి భారతదేశం స్పందన ఏమిటి? సంక్షోభం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుంది? దీని నుంచి నేర్చుకోవలసిన మొదటి పాఠం- రాజ్యాధికారాన్ని మృదువుగా, వినమ్రంగా ఉపయోగించాలని. కానీ, భారత ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ప్రపంచంలోనే చాలా తీవ్రమైనది. దీనివల్ల వ్యాపారాలు కుదేలయ్యాయి. కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు. దినసరి కూలీలు ఉపాధి కోల్పోవడమంటే దుర్భర దారిద్రయంలోకి జారిపోవడమే. దాని నుంచి బయటపడటానికి ఏళ్లూపూళ్లూ పడుతుంది.

దీనిబదులు వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మాత్రం లాక్‌డౌన్‌ చేసి ఉంటే కరోనా బాధితులకు చికిత్స చేస్తూ, మిగతా దేశంలో దైనందిన కార్యకలాపాలను సజావుగా జరగనిచ్చినట్లయ్యేది. దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్‌ విధింపునకు వారం రోజులు, బంగ్లాదేశ్‌లో నాలుగు రోజుల ముందు నోటీసులు ఇచ్చారు. మనం కూడా ఆ పని చేసివుంటే వలస కూలీలు భద్రంగా ఇంటికి చేరిఉండేవారు. కరోనా వైరస్‌ను మహమ్మారి అని చిత్రించడం భయాందోళనలను పెంచి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దీనిబదులు పరీక్షలకు, వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఎక్కువ నిధులు కేటాయించి మూడు శాతం లోపే ఉన్న వైరస్‌ బాధితులను ఏకాంత నిర్బంధంలో ఉంచితే మంచి ఫలితాలు వచ్చేవి. అలాకాక గుండుగుత్తగా లాక్‌ డౌన్‌ విధించినందు వల్ల ఆర్థిక కార్యకలాపాలు విచ్ఛిన్నమై దేశం వారానికి రెండు లక్షల కోట్ల రూపాయల వంతున నష్టపోయింది. సమస్య వచ్చినప్పుడు అతిగా స్పందించకూడదు, అలాగే పెద్దగా పట్టనట్లూ ఉండకూడదు. మహాభారతంలో విదురుడు చెప్పిన రాజధర్మంలో మొదటి సూత్రం- ప్రజలకు హాని తలపెట్టకూడదని; రోగంకన్నా మందు భయంకరమైనది కాకూడదని.

వివేకం ప్రదర్శించాలి

కొవిడ్‌ నేర్పిన రెండో పాఠం- జనాన్ని ఆకట్టుకోవడానికి వెంపర్లాడేకన్నా వెనకాముందూ చూసుకుంటూ అర్థవంతంగా వివేకంతో స్పందించాలని. ప్రతిపక్షాలు, టీవీ, పత్రికా వ్యాఖ్యాతలు వలస కూలీల కష్టాలు తీర్చడానికి జీడీపీలో ఒక శాతం సరిపోదని, రెండు శాతం కేటాయించాలని సూచించారు. వారు చెప్పినది సమంజసమే. పేదల జన్‌ ధన్‌ ఖాతాల్లోకి మరింత సొమ్ము జమచేసి ఉండాల్సింది. కానీ, భారత్‌ లో సబ్సిడీలన్నీ ఎత్తివేయకుండా అందరికీ కనీస ఆదాయ పథకం ప్రవేశపెట్టాలనడం మాత్రం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. ప్రజలకు ధన సంతర్పణలో అమెరికాను చూసి నేర్చుకోవాలనేవారు, ఆ దేశ ఆదాయంలో కనీసం 20శాతం కూడా భారత్‌ కు లేదనే సంగతి మరచిపోయారు.

మూడో పాఠం- రాష్ట్రాలు తమ సరిహద్దులను ఇష్టారాజ్యంగా మూసివేయడం తప్ఫు ఇది జాతి సమైక్యతకు భంగం కలిగిస్తుంది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) ఒకే ఆర్థిక మండలంగా పరిగణన పొందుతున్నా దిల్లీ, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌లు లాక్‌డౌన్‌ నిబంధనలకు వక్రభాష్యం చెప్పడం లక్షలాది దినసరి కూలీల పొట్టకొట్టింది. దిల్లీ ఆస్పత్రుల్లో బయటివారికి చికిత్స చేయకూడదని ఆప్‌ ప్రభుత్వం ఆదేశించడం- అనైతికం. కర్ణాటక తన పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులను మూసివేయడమూ ఏమాత్రం సమర్థనీయం కాదు.

ఫార్మాకు పెట్టుబడులు అవసరం

నాలుగోపాఠం- కొవిడ్‌కు త్వరలో వ్యాక్సిన్లు, కొత్త మందులు అందుబాటులోకి వచ్చాక, ప్రపంచ దేశాలకు వాటిని భారీయెత్తున సరఫరా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మన దేశ ఫార్మా రంగానికి ఈ సత్తా ఉంది. నిజానికి భారత్‌ ఐటీ, ఫార్మా, ఆటో రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ప్రైవేటు రంగం ఫార్మా పరిశోధనల మీద, ఆస్పత్రులు, వైద్య కళాశాలల మీద భారీ పెట్టుబడులు పెట్టగలిగేలా మన విధానాలను మార్చాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య బీమా చేసుకున్న ప్రతి వ్యక్తీ అయిదు లక్షల రూపాయల వరకు క్లెయిము చేసుకోవచ్ఛు ప్రైవేటు రంగం దేశమంతటా ఆస్పత్రుల నిర్మాణ, విస్తరణలను చేపట్టేందుకు ఇది దోహదం చేయగలదు.

అయిదో పాఠం- కరోనా వల్ల వలస కార్మికులకు దాపురించిన కష్టనష్టాలు తిరిగి ఎన్నడూ సంభవించకుండా జాగ్రత్త పడాలి. పసిబిడ్డలను చంకనెత్తుకుని, తల మీద బండెడు బరువుతో వలస కూలీలు వందల మైళ్ల దూరంలోని స్వరాష్ట్రాలకు నడిచివెళ్లడం అందరి హృదయాలను కలచివేసింది. ఈ దుస్థితి మళ్లీ తలెత్తకుండా నివారించాలంటే 1979 వలస కూలీల చట్టానికి కాలం చెల్లిందని గుర్తించి ఆ కార్మికుల వివరాలను సాధికారంగా నమోదు చేసి, కనీస కార్మిక హక్కులు కల్పించి, సంక్షోభ సమయాల్లో వారి ఖాతాలకు నగదు బదిలీ చేయాలి. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు దీనికి ఉపయోగపడే మాట నిజం. అదేసమయంలో వలస కూలీలకు ఒక ఏడాది నివాసం తరవాత, ఉన్న చోటనే ఓటు చేసే హక్కు కూడా కల్పించాలి.

కార్మిక చట్టాలు మారాలి

కొవిడ్‌ సంక్షోభం మన కార్మిక చట్టాల ద్వంద్వ నీతిని బయటపెట్టింది. ఈ చట్టాలు సంఘటిత రంగంలోని 15 శాతాన్నే తప్ప అసంఘటిత రంగంలోని 85 శాతాన్ని ఏమాత్రం పట్టించుకోవు. మనం నేర్వాల్సిన ఆరో పాఠం- కార్మిక చట్టాలను వెంటనే మార్చాలని. కొన్ని రాష్ట్రాలకు మల్లే ఈ చట్టాలను సస్పెండ్‌ చేయకూడదని.

ఏడో పాఠం- ఆత్మనిర్భర్‌ అభియాన్‌ పేరుతో స్వదేశ వాణిజ్య రక్షణకు పెద్దపీట వేయకూడదని. అలా చేస్తే మన ఎగుమతులను ఎన్నటికీ పెంచుకోలేం. అదే జరిగితే ఇండియాను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందించాలనే కల కల్లగానే మిగులుతుంది.

కొవిడ్‌ సంక్షోభం ఏదో ఒకనాటికి సమసిపోతుంది. ఉపాధి అవకాశాలను ఇబ్బడిముబ్బడిగా పెంచడానికి ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాలన్నది ఎనిమిదో పాఠం. దీనికోసం మౌలిక వసతుల కల్పన, విస్తరణలపై భారీ పెట్టుబడులు పెట్టాలి. అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో కీలక పాత్ర వహించే స్థాయికి ఎదగాలి. లక్షల్లో ఉద్యోగాలు సృష్టించాలంటే ఇదే అత్యుత్తమ మార్గం.

అది సాధ్యమేనా?

కొవిడ్‌ సంక్షోభంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్‌ ప్రభుత్వ నిఘాకు తోడ్పడే సాధనం. సంక్షోభం ముగిసిన వెంటనే ప్రభుత్వం నిఘా అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలన్నది తొమ్మిదో పాఠం. ఈ యాప్‌ పౌరుల గోప్యతకు భంగకరం. ఆరోగ్యసేతు యాప్‌ను ప్రభుత్వం చేతుల్లో నుంచి తప్పించడం ఆవశ్యకమే కానీ, అది అంత సులువైన పనిమాత్రం కాబోదు.

భారతదేశం సంక్షోభ సమయాల్లో మాత్రమే మేల్కొని సంస్కరణలు చేపడుతుంది. కొవిడ్‌ సంక్షోభాన్ని వృథా చేయకూడదని గ్రహించడమే పదో పాఠం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంగతి గుర్తించారు. వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో చరిత్రాత్మక సంస్కరణలను ప్రారంభించారు. ఇకమీదట భూమి, కార్మికులు, పెట్టుబడి రంగాల్లో సంస్కరణలు చేపట్టి పారిశ్రామిక విజృంభణకు తెర తీయాలి. ఆయన ఈ పనిచేస్తే భారత్‌ ఇతర ప్రపంచ దేశాలతో సమర్థంగా పోటీపడగలుగుతుంది. దేశవిదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించి, అపార ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. మోదీ హామీ ఇచ్చిన అచ్ఛేదిన్‌ను నిజంగా తీసుకొచ్చి, కొవిడ్‌ సంక్షోభం నుంచి మునుపటికన్నా బలీయ శక్తిగా అవతరిస్తుంది!

-గుణచరణ్​ దాస్,

(రచయిత-ప్రజావ్యవహారాల అధ్యయనకర్త, ప్రోక్టర్​ అండ్​ గ్యాంబుల్​ మాజీ సీఈఓ)​

ఇదీ చూడండి: 'సానుకూల చర్చల బాధ్యత నేపాల్​దే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.