ETV Bharat / bharat

ఐరాసలో సంస్కరణలు రావాల్సిందే: నరేంద్ర మోదీ

author img

By

Published : Sep 26, 2020, 7:27 PM IST

reform-of-united-nations-is-the-need-of-the-hour-pm-modi-at-75th-un-general-assembly-session
ఐరాసలో సంస్కరణలు అత్యావశ్యకం: నరేంద్ర మోదీ

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశం సందర్భంగా వర్చువల్​గా ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఐరాసలో సంస్కరణలు రావాలని పిలుపునిచ్చారు. 1945లో ఐరాస ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు.. ఇప్పుడు పరిస్థితులు మారాయని అభిప్రాయపడ్డారు మోదీ. కావున 21వ శతాబ్దం ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా సంస్కరణలు రావాలన్నారు.

సమగ్ర సంస్కరణలు చేపట్టకపోవడం వల్ల ఐక్యరాజ్య సమితి తన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఐక్యరాజ్య సమితి(ఐరాస) 75వ సాదారణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. ఐరాసలో జరిగే సంస్కరణలు బహుముఖమైనవి కావాలని ఆకాంక్షించారు. అప్పుడే భాగస్వామ్య దేశాలు తమ గళాన్ని సమర్థంగా వినిపించి.. సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ప్రపంచ మానవాళి అభివృద్ధికి దోహదం చేసినట్లు అవుతుందని మోదీ వివరించారు.

తొలిసారి రికార్డు చేసి..

ఐక్యరాజ్యమితి 75వ సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ తొలి ప్రసంగం చేశారు. కొవిడ్ నిబంధనల మధ్య చరిత్రలో ఎన్నడూలేని విధంగా దృశ్యమాధ్యమం ద్వారా ఈ సమావేశం జరిగింది. ఇందుకోసం ముందుగానే రికార్డు చేసి మోదీ తన సందేశాన్ని పంపారు.

ఈ ప్రసంగం ద్వారా ఐక్యరాజ్యమితిలో సంస్కరణలు అత్యావశ్యకమని ప్రధాని మరోసారి నొక్కిచెప్పారు. 2021, జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు.. శక్తిమంతమైన ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఉండనుంది. ఈ నేపథ్యంలో మోదీ చేసిన ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. అసలైన లక్ష్యానికి మాత్రం ఆమడదూరంలోనే నిలిచిందని మోదీ అభిప్రాయపడ్డారు.

లక్ష్యాలకు దూరం..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్ల పరిష్కారానికి, ప్రపంచదేశాల అభివృద్ధికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని, వాతావరణ మార్పుల విషయంలో కూడా ఇంకా అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేదని చెప్పారు మోదీ. ఇదంతా జరగాలంటే ఐక్యరాజ్యమితిలో పాత విధానాలకు స్వస్తి చెప్పి నూతన సంస్కరణలకు మొగ్గతొడగాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ స్పష్టం చేశారు. ఇలా జరగని పక్షంలో ఐక్యరాజ్యమితి తన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్యమితి కారణంగానే నేడు ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతోందని.. అయితే 1945లో ఏర్పాటైన ఈ సంస్థ సమకాలీన పరిస్థితులకి తగ్గట్లు మారాల్సిందేనన్నారు.

''ఐక్యరాజ్యమితిలో సంస్కరణలు తప్పనిసరి అన్న విషయం స్పష్టం అవుతోంది. పాత విధానాలతో కూడిన వ్యవస్థలతో పెద్దపెద్ద సవాళ్లను మనం ఎదుర్కోలేము. సమగ్రమైన సంస్కరణలు చేపట్టకపోతే.. ఐక్యరాజ్యసమితి తన విశ్వాసాన్ని కోల్పోయే ముప్పు పొంచి ఉంది. ప్రపంచదేశాలన్నీ అనుసంధానమై ఉన్న ప్రస్తుత సమయంలో బహుముఖమైన సంస్కరణలు అత్యావశ్యకం. ఆ సంస్కరణలు ఇవాళ్టి ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. భాగస్వాములైన ప్రతి ఒక్కరి గళాన్ని సమర్థంగా వినిపించే వీలు కల్పిస్తాయి.

సమకాలీన ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం సహా మానవాభివృద్దికి బాటలు వేస్తాయి. ఈ లక్ష్యసా‍ధన కోసం భారతదేశం సహచర దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

భారత్​ ఎంతో చేసింది: మోదీ

తాము కోరుకుంటున్న సంస్కరణలను విస్మరిస్తున్నారన్న మోదీ.. భారత్​ వంటి కీలకమైన దేశాన్ని నిర్ణాయాధికారం నుంచి ఎంత కాలం దూరం ఉంచుతారు అని ప్రశ్నించారు. ఐరాసలో కూడా ప్రపంచ శాంతి కోసం భారత్​ ఎంతో కృషి చేసిందని అన్నారు ప్రధాని.

''ఐరాసలో ప్రపంచ శాంతి కోసం భారత్​ ఎంతో కృషి చేసింది. అస్థిర ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం భారత్​ తన వంతు కృషి చేస్తోంది. ఎంతో మంది భారత సైనికులు శాంతి పరిరక్షణ కోసం త్యాగాలు చేశారు. ప్రపంచంలోని ఏ దేశంతోనూ భారత్​ విరోధాన్ని కోరుకోవడం లేదు. ఏ దేశంతోనైనా భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తుంది.

కరోనా సమయంలో 150కిపైగా దేశాలకు భారత్​ నుంచి ఔషధాలు పంపించాం. కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధిలో భారత్​ కీలకంగా ఉంది. వ్యాక్సిన్​ రంగంలో భారత్​కు ఉన్న బలం కరోనాపై విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. భద్రతా మండలిలో సభ్య దేశంగా కీలక పాత్ర పోషించగలదు.''

- నరేంద్ర మోదీ, ప్రధాని

ఐక్యరాజ్యమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం కోసం ఏళ్లుగా పోరాటం చేస్తుండగా ఈ విషయంలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా.. భారత్‌కు తమ మద్దతును ప్రకటిస్తూనే ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.