ETV Bharat / bharat

సచిన్​ 'పవర్'​ ప్లే- రాజస్థాన్​ దారెటు?

author img

By

Published : Jul 12, 2020, 4:54 PM IST

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతోంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తన మద్దతుదారులతో కలిసి దిల్లీ వెళ్లారు. ఇదే సమయంలో ఇవాళ రాత్రి జైపుర్​లో జరిగే సమావేశానికి హాజరుకావాలని అందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం గహ్లోత్‌ సమన్లు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ సర్కారును కూల్చేందుకు కుట్ర జరిగిందన్న కేసులో సీఎం గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ వాంగ్మూలం నమోదు చేయాలని రాజస్థాన్‌ పోలీసులు భావిస్తున్నారు.

rajasthan government situation
రాజస్థాన్​ ప్రభుత్వంలో సంక్షోభం తీవ్రతరం

రాజ‌స్థాన్‌లో రాజ‌కీయాలు ఉత్కంఠకర మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించిన మరుసటి రోజే ఆ రాష్ట్ర ఉప‌ ముఖ్యమంత్రి స‌చిన్ పైల‌ట్ కొంత‌మంది శాస‌న‌స‌భ స‌భ్యుల‌తో దిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి తనను త‌ప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ స‌చిన్‌ పైల‌ట్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. తాజాగా రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితిని సోనియా గాంధీతోపాటు రాహుల్‌ను క‌లిసి వివ‌రించ‌నున్నట్లు స‌మాచారం. తమకు దాదాపు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సచిన్‌ వర్గం చెబుతోంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌ మద్దతుదారులు మాత్రం స‌చిన్ పైల‌ట్ భారతీయ జనతా పార్టీకి స‌న్నిహితంగా మెలుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నట్లుగానే రాజ‌స్థాన్‌లోనూ ఆ పార్టీ పావులు క‌దుపుతోందని విమర్శిస్తున్నారు.

పార్టీ నేతలతో సీఎం భేటీ..

సచిన్‌ పైలట్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి దిల్లీ వెళ్లిన వేళ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌.. జైపుర్​లో రాత్రి 9 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యేలు రావాలని సమన్లు జారీ చేశారు.

అంతర్గత కలహాలే కారణం..

రాజ‌స్థాన్‌లో ఏర్పడ్డ రాజ‌కీయ సంక్షోభానికి కాంగ్రెస్ అంత‌ర్గత క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని భాజపా పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మ‌ధ్య పోటీనే ఈ పరిస్థితి అస‌లైన‌ కార‌ణ‌మని పేర్కొంది.

పోలీసుల నోటీసులు..

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల‌దోయ‌డానికి ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై ముఖ్యమంత్రి గహ్లోత్‌, ఉప ముఖ్యమంత్రి స‌చిన్ పైల‌ట్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు. ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రలోభాలకు దిగారంటూ ఇద్దరు వ్యక్తులపై పోలీస్ శాఖ‌లోని ప్రత్యేక ఆప‌రేష‌న్ల బృందం (ఎస్​ఓజీ) రెండురోజుల క్రితం కేసు న‌మోదుచేసింది. వీరిద్దరి‌నీ విచారించిన అనంత‌రం సచిన్‌ పైలట్‌, గహ్లోత్‌తో పాటు మ‌రి కొందరికి నోటీసులు జారీచేసింది. ఈ ప్రలోభాలకు సంబంధించి ఆధారాలు లభ్యం కావ‌డం వల్ల సీఎం స‌హా మ‌రింత‌మంది వాంగ్మూలాల‌ను న‌మోదుచేస్తామ‌ని పోలీసులు తెలిపారు.

అయితే, ఎస్‌ఓజీ పోలీసుల నోటీసులపై స‌చిన్ పైల‌ట్ ఆగ్రహానికి గుర‌య్యార‌ని స‌మాచారం.

ఇదీ చూడండి: ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం: గహ్లోత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.