ETV Bharat / bharat

ఇకపై విద్యుత్​ దాతలుగా రైతులు: మోదీ

author img

By

Published : Oct 24, 2020, 1:11 PM IST

గుజరాత్​లో మూడు కీలక ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో రైతు సంక్షేమం, ఆరోగ్యం, పర్యటక రంగాల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రైతులను విద్యుత్తు దాతలుగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు ప్రధాని.

PM Modi inaugurates Kisan Suryodaya
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దేశంలోని రైతులను అన్నదాతలుగా మాత్రమే కాకుండా విద్యుత్తు దాతలుగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్​లోని సౌర విద్యుత్​ కోసం ఉద్దేశించిన కిసాన్​ సూర్యోదయ యోజన సహా గిర్నార్​ పర్వత ప్రాంతంలో అతిపెద్ద రోప్​వే, అహ్మదాబాద్​లోని గుండె ఆసుపత్రిని ప్రధాని దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు.

గత ఆరేళ్లలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సౌర విద్యుత్తు రంగంలో భారత్​ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు మోదీ. రోప్​వే ప్రాజెక్టు జాప్యానికి ప్రతిపక్షాలే కారణమని విమర్శించారు. అడ్డంకులు సృష్టించి ఉండకపోతే.. గతంలోనే అందుబాటులోకి వచ్చేదన్నారు.

" దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, వ్యవసాయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి.. నిరంతరం కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాం. దేశంలో రైతులను అన్నదాతలుగా మాత్రమే కాకుండా విద్యుత్‌ దాతలుగా మార్చడానికి కూడా పని చేస్తున్నాం. రైతు ఉత్పాదక సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు.. బంజరు భూముల్లో చిన్న సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటులో సహాయం చేస్తున్నాయి. దేశంలోని లక్షలాది రైతుల సౌర విద్యుత్‌ ప్లాంట్లను గ్రిడ్‌తో అనుసంధానిస్తున్నాం. పొలాల్లో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను రైతులు అవసరాల మేరకు తమ వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు. మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు ."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కిసాన్​ సూర్యోదయ యోజన

రైతుల కోసం కిసాన్​ సూర్యోదయ యోజనను ప్రవేశపెట్టింది గుజరాత్ ప్రభుత్వం. దీని ద్వారా రైతులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్తు అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు కేటాయించింది. 3,490 కిలోమీటర్ల మేర.. 66 కిలోవాట్ల ట్రాన్స్​మిషన్​ లైన్లు, 220కేవీ ఉపకేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 2020-21 ఏడాదికి గాను ఈ పథకం పరిధిలోకి దహోద్​, పటాన్​, మహిసాగర్​, పంచమహల్​, చోటా ఉదేపుర్​, కేదా, తపి, వల్షాద్​, ఆనంద్​, గిర్​సోమ్​నాథ్​ ప్రాంతాలను చేర్చారు.

గుండె ఆసుపత్రి..

యూఎన్​ మెహతా కార్డియాలజీ ఇన్​స్టిట్యూట్​, రీసర్చ్​ కేంద్రానికి అనుసంధానించిన పీడియాట్రిక్​ హార్ట్​ ఆసుపత్రిని ప్రారంభించారు మోదీ. దీంతో భారత్​లోనే అతిపెద్ద గుండె ఆసుపత్రి అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రపంచస్థాయి సౌకర్యాలు, వైద్య పరికరాలు కలిగిన ఆసుపత్రుల్లో ఇదీ ఒకటి. ఇందు కోసం గుజరాత్ ప్రభుత్వం 470 కోట్లు ఖర్చుచేస్తోంది.

గిర్నార్​ రోప్​వే..

జునాగడ్​ నగర సమీపంలోని గిర్నార్ పర్వత ప్రాంతంలో​ 2.3 కిలోమీటర్ల మేర.. గంటకు 1000 మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో అతిపెద్ద రోప్​వేను నిర్మించారు. ప్రస్తుతం దీనిని 8 మంది కూర్చునే వీలు కలిగిన 25-30 క్యాబిన్లతో ప్రారంభించారు. 7.5 నిమిషాల్లో 2.3 కిలోమీటర్లు చేరుకోవచ్చు. ఆసియాలోనే అతిపెద్ద ఆలయ రోప్​వేగా గుర్తింపు పొందింది.

ఇదీ చూడండి: దసరా వేడుకల్లో తృణమూల్​ ఎంపీ- నృత్యంతో సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.