ETV Bharat / bharat

రాజస్థాన్​లో మళ్లీ రిసార్ట్ రాజకీయాల జోరు

author img

By

Published : Aug 9, 2020, 6:52 PM IST

Updated : Aug 9, 2020, 9:54 PM IST

రాజస్థాన్​లో ఈనెల 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. సమావేశాలకు ముందు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు జైసల్మేర్​లో, పైలట్​ వర్గం హరియాణాలో ఉండగా.. తాజాగా భాజపా ఎమ్మెల్యేలను గుజరాత్​ తరలించారు.

Listen to voice of people to save democracy: Gehlot to MLAs
అసెంబ్లీ సమావేశాలకు ముందు మళ్లీ రిసార్ట్​లకు 'రాజ'కీయం

రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న వేళ మళ్లీ రిసార్టు రాజకీయాలు ఊపందుకున్నాయి. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టులకు తరలిస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలో 'సత్యంవైపు నిలవండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అంటూ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు.

'ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెడు సంప్రదాయాలవైపు మొగ్గొద్దు. ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజల మనోభావాలను, ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కోసం ఎలా పనిచేస్తోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు సత్యం వైపే నిలుస్తారన్న నమ్మకం ఉంది. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి సహకరిస్తారని నమ్ముతున్నా'

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

కరోనా విపత్తు వేళ అందరూ వైరస్​పై పోరాడాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు గహ్లోత్​. ఇలాంటి సమయంలో కొందరు సహచరులు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఈనెల 14న రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే బలపరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు గహ్లోత్.

గుజరాత్​కు భాజపా ఎమ్మెల్యేలు..

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు రోజుల్లో 18 మంది భాజపా ఎమ్మెల్యేలు రాజస్థాన్​ నుంచి గుజరాత్​కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను వేధిస్తోందని.. అందుకే మానసిక ప్రశాంతత కోసం సోమనాథ్​కు వెళ్లినట్లు భాజపా ఎమ్మెల్యే నిర్మల్​ కుమావత్​ తెలిపారు.

గుజరాత్​కు చేరుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలు అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లారు. వారు ఎక్కడికి వెళ్లారనేది ఇంకా తెలియరాలేదు.

భాజపా ఎమ్మెల్యేలను గుజరాత్​కు తరలించటంపై ప్రశ్నించారు సీఎం గహ్లోత్​. ప్రతిపక్ష పార్టీ కక్షసాధింపు విధానంతో నడుచుకుంటోందని ఆరోపించారు.

జైసల్మేర్​లోనే గహ్లోత్​ వర్గం..

ఇప్పటికే గహ్లోత్​ వర్గం ఎమ్మెల్యేలు జైసల్మేర్​లోని రిసార్టుల్లో ఉన్నారు. సమావేశాలు ప్రారంభమయ్యే వరకు వారంతా అక్కడే ఉండనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల కొనుగోలును అడ్డుకునేందుకే తమ వారందరినీ ఒక్కచోటే ఉంచామని తెలిపారు గహ్లోత్​

హరియాణాలోనే పైలట్​ వర్గం..

అధికార కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేలు, సచిన్​ పైలట్​ వర్గం హరియాణాలోనే ఆశ్రయం పొందుతున్నారు.

ఆగస్టు 11న భాజపా శాసనసభాపక్ష భేటీ..

ఆగస్టు 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష భాజపా 11న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఈ మేరకు లేఖలు రాశారు ప్రతిపక్ష నేత గులాబ్​ చాంద్​ కటారియా. జైపుర్​లోని హోటల్​ క్రౌన్​ ప్లాజాలో సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది.

ఇదీ చూడండి: కశ్మీర్​ రంగస్థలంలో సరికొత్త 'రాజకీయం'!

Last Updated : Aug 9, 2020, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.