పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టడంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ముందుంటుంది. గతంలో సౌర విద్యుత్, సబ్ ఎయిర్ వ్యవస్థ, జీవ ఇంధనం(బయోగ్యాస్) వంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం మరో పర్యావరణ హిత కార్యక్రమానికి తెరతీసింది.
వ్యర్థాలను నియంత్రించేందుకుగాను ప్లాస్టిక్ బాటిళ్లను ముక్కలుగా చేసే యంత్రాన్ని బెంగళూరు చిన్నస్వామి మైదానంలో ఏర్పాటు చేసింది.
ఈ యంత్రాన్ని కేఎస్సీఏ అధ్యక్షుడు, 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడు రోజర్ బిన్నీ ప్రారంభించారు.
"ప్లాస్టిక్ వ్యర్థాలతో మరో పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టాం. భవిష్యత్తులో ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేధించే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రస్తుతానికి బాటిల్ను ముక్కలు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశాం. 85 శాతం ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది."
-రోజర్ బిన్నీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఈ యంత్రం ఏటా 4 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను ముక్కలు చేయగలదు. చిన్నచిన్న ముక్కలుగా మారిన ప్లాస్టిక్తో టోపీలు, స్వెటర్లు, స్పోర్ట్స్ షూస్ వంటివి తయారు చేస్తారు.
క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ చర్య కర్ణాటక వ్యాప్తంగా ఆదర్శం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు రోజర్ బిన్నీ.
"మేం పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే రాష్ట్రాన్ని స్వచ్ఛమైన ప్రాంతంగా నిలబెడతాయి. పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఇవి ఉపకరిస్తాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి."
-రోజర్ బిన్నీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించే దిశగా అవగాహన ఏర్పడి పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆశిస్తోంది కేఎస్సీఏ.
ఇదీ చూడండి: ప్లాస్టిక్పై పోరు కోసం బాహుబలి 'తాబేలు'!