ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​: కొత్త పోస్టులు బంద్​

author img

By

Published : Sep 5, 2020, 8:25 AM IST

కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొత్త పోస్టుల కల్పనను నిలిపివేయాలని సూచిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ఇప్పటికే కొన్ని ముద్రణా అంశాలపై నిషేధం విధించిన ఆర్థిక శాఖ.. తాజాగా జారీచేసిన ఆఫీస్​ మెమోరాండంలో మరికొన్ని షరతులు విధించింది.

Central Ministry of Finance has issued orders to suspending of new posts due to the revenue declining
కొత్త పోస్టులు బంద్​

కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం కొత్త పోస్టుల కల్పనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే పుస్తకాలు, పబ్లికేషన్లు, డాక్యుమెంట్లు, టేబుల్‌టాప్‌ క్యాలెండర్ల ముద్రణను నిలిపేసిన ఆర్థికశాఖ తాజాగా జారీచేసిన ఆఫీస్​ మెమోరాండంలో మరికొన్ని అంశాలను చేర్చింది. వాటిలో ప్రధానంగా కొత్త పోస్టుల సృష్టిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

ఆ పోస్టులకు బ్రేక్.​!

కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం ఆమోదం పొందిన పోస్టులు తప్ప మిగతావాటిపై ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. తాజా నిబంధన కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు, అనుబంధ కార్యాలయాలు, చట్టబద్ధ, స్వయంప్రతిపత్తి సంస్థలకు వర్తిస్తుందని పేర్కొంది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం అనుమతి లేకుండా, అధికారులు తమ అధికారాలను అనుసరించి ఈ ఏడాది జులై 1 తరువాత ఏవైనా పోస్టులు సృష్టించి ఉంటే వాటిని భర్తీచేయకూడదని ఆదేశించింది. ఒకవేళ వాటిని భర్తీచేయడం అనివార్యమని భావిస్తే అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వ్యయ విభాగానికి పంపాలని షరతు విధించింది.

అభివృద్ధియేతర కార్యక్రమాల వ్యయాన్ని తగ్గించి ప్రాధాన్యతా కార్యక్రమాలకు తగిన నిధులు అందుబాటులో ఉంచడానికి ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది కేంద్రం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆర్థిక వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని, అందుకే ఈ ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది.

మరిన్ని నిబంధనలివే..

  • అన్ని శాఖలూ కన్సల్టెంట్ల పనితీరును సమీక్షించి, వారి సంఖ్యను సాధ్యమైనంత కనిష్ఠ స్థాయికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కన్సల్టెంట్లను నియమించేటప్పుడు వారి ఫీజుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది.
  • వ్యవస్థాపక దినోత్సవాల్లాంటి కార్యక్రమాలపై పెట్టే ఖర్చులను తగ్గించాలని, అనవసరమని భావిస్తే పూర్తిగా పరిహరించాలని పేర్కొంది.
  • దిగుమతి చేసుకున్న కాగితంపై పుస్తకాలు, పబ్లికేషన్ల ముద్రణ నిలిపేయాలని పేర్కొంది.

ఇదీ చదవండి: కరోనా లక్షణాలు ముందే కనిపెట్టే స్మార్ట్​ బ్యాండ్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.