దిల్లీలో వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి నిబంధనను ఉల్లంఘించారు భాజపా రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్. బేసి సంఖ్యతో రిజిస్టర్ అయిన ఎస్యూవీ వాహానంలో ప్రయాణించిన ఆయనకు రూ.4వేల చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.
కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే ఇలా చేశానని వివరణ ఇచ్చారు గోయల్. సరి-బేసి నిబంధన అమలు చేయడాన్ని.. ఎన్నికల జిమ్మిక్కుగా పేర్కొన్నారు.
గోయల్పై విమర్శలు..
దిల్లీ ప్రజల పట్ల విజయ్ గోయల్ బాధ్యతాయుతంగా వ్యహరించట్లేదని విమర్శించారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. ఆయనకు కాలుష్య తీవ్రతపై నిజంగా ఆందోళన ఉంటే.. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్తో సమావేశం ఏర్పాటు చేసి.. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సరి-బేసి నిబంధన పాటిస్తుంటే గోయల్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు సిసోడియా.
2016 నుంచి సరి-బేసి
వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు దిల్లీలో 2016 నుంచి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ సమయంలో చివరి రెండు అంకెలు సరి సంఖ్య నంబరుపై రిజిస్టర్ అయిన వాహనాలు ఒకరోజు, బేసి నంబరుపై రిజిస్టర్ అయిన వాహనాలు మరో రోజు.. సరి-బేసి తేదీలకు అనుగుణంగా రోడ్లపైకి అనుమతిస్తారు. నిబంధనను అతిక్రమిస్తే రూ.4వేలు జరిమానా విధిస్తారు.
దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చినందువల్ల ఈ రోజు నుంచి 15వరకు సరి-బేసి నిబంధన అమల్లోకి తెచ్చారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది వర్తిస్తుంది.
తొలిరోజు 192 చలానాలు...
మొదటి రోజు నిబంధన ఉల్లఘించిన వారికి 192 చలానాలు విధించినట్లు సిసోడియా తెలిపారు. ఇందులో 170 చలానాలు ట్రాఫిక్ పోలీసులు విధించగా.. రవాణాశాఖ 15, రెవిన్యూ శాఖ 7 చలానాలు విధించినట్లు వెల్లడించారు.
కార్పూల్
సరి-బేసి నిబంధన అమల్లో ఉన్నరోజుల్లో తమ వాహనాలను ఉపయోగించుకోని వారు ఇతరులకు అవసరముంటే తీసుకువెళ్లేలా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. క్యాబ్ కంటే తక్కువ ధరకే కార్లు అద్దెకు లభిస్తాయని కొంతమంది తెలిపారు. బేసి నిబంధన అమల్లో ఉన్న రోజు బేసి నంబరు గల కారును ఇతరుల నుంచి అద్దెకు తీసుకుని అవసరానికి ఉపయోగించుకోవచ్చని ఓ స్థానికుడు తెలిపారు. ఈ కార్పూల్ విధానం ద్వారా గతేడాది తాను కొంత లాభపడినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: దేశ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్సెప్కు భారత్ నో