ETV Bharat / bharat

ఈసీకి భాజపా, టీఎంసీ పోటాపోటీ ఫిర్యాదులు

author img

By

Published : Jan 21, 2021, 4:06 PM IST

పశ్చిమ్​బంగా​లో ఎన్నికల కమిషన్​కు భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్​ పోటాపోటీగా ఫిర్యాదులు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలు భయాందోళనలో ఉన్నారని, రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని భాజపా కోరింది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను ఓ పార్టీకి అనుకూలంగా ఓటేయాలని బీఎస్​ఎఫ్​ బెదిరిస్తోందని టీఎంసీ ఆరోపించింది.

BJP and TMC complaints to CEC
ఈసీకి భాజాపా, తృణమూల్ పోటాపోటీ ఫిర్యాదులు

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్​కు పోటాపోటీగా ఫిర్యాదులు అందుతున్నాయి. పోలింగ్ నిర్వహణపై సమీక్షించేందుకు కోల్​కతా వచ్చిన ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా బృందానికి ప్రధాన పార్టీలు వేర్వేరు అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేశాయి.

ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని భాజపా ఆరోపించింది. ఎన్నికలు సజావుగా జరగడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని కోరింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో 42 చోట్ల ఘర్షణలు జరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రస్తావించారు.

"వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష కోసం ఎన్నికల కమిషన్ మొత్తం బృందం ఇక్కడికి వచ్చింది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కల్పించాలని వారికి విజ్ఞప్తి చేశాం. అందుకోసం కేంద్ర బలగాలను అతి త్వరలో రాష్ట్రంలో మోహరించాలి. రాష్ట్ర పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీఎంసీకీ అనుకూలంగా ఉంటూ భాజపా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు."

-దిలీప్ ఘోష్, భాజపా బంగాల్ అధ్యక్షుడు

స్వేచ్ఛాయుత, ప్రశాంతమైన పోలింగ్​ కోసం ఓటింగ్ కేంద్రాల లోపల కేంద్ర బలగాలను, వెలుపల రాష్ట్ర పోలీసులను మోహరించాలని దిలీప్​ ఘోష్ సూచించారు. రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చూపిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.

టీఎంసీ వాదన ఇలా...

సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను సరిహద్దు భద్రతా దళం-బీఎస్​ఎఫ్​ బెదిరిస్తోందని ఆరోపించింది టీఎంసీ.

"సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్​ఎఫ్​ భయపెడుతోందని ఈసీకి ఫిర్యాదు చేశాం. పలు గ్రామాల్లో తిరిగి అక్కడి ప్రజలను ఓ పార్టీకి అనుకూలంగా ఓటు వేయమని పారామిలటరీ దళాలు అడుగుతున్నట్లు మాకు సమాచారం అందింది. ఇదొక విపత్కర పరిస్థితి. ఎన్నికల కమిషన్ దీనిని తప్పనిసరిగా పరిష్కరించాలి."

- పార్థ ఛటర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఈ ఫిర్యాదుపై బీఎస్​ఎఫ్​ స్పందించాల్సి ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్​ లేదా మేలో బంగాల్​ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: సీఎం అభ్యర్థి లేకుండానే బంగాల్​ బరిలో భాజపా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.