ETV Bharat / bharat

పతిభక్తి కన్నా దేశభక్తే మిన్న! భర్తను వదిలేసి స్వతంత్ర సంగ్రామంలోకి

author img

By

Published : May 31, 2022, 7:30 AM IST

gulab kaur freedom fighter: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రతి ఘట్టంలోనూ పురుషులకు సమానంగా మహిళలూ పోరాడారు. అహింస ఉద్యమాల నుంచి .. సాయుధ పోరాటాల దాకా సందర్భం ఏదైనా వీరనారి లేని సందర్భం లేదు. చివరకు విదేశాల్లో మొదలైన గదర్‌ విప్లవంలోనూ గులాబ్‌ కౌర్‌ రూపంలో మహిళాశక్తి గుబాళించింది. దేశ స్వాతంత్య్రం కోసం సౌకర్యవంతమైన జీవితాన్నే కాదు.. భర్తను సైతం వదిలేసి వచ్చి.. ఆంగ్లేయుల చేతుల్లో అష్టకష్టాలు పడి కన్నుమూసిన గులాబ్‌ కౌర్‌.. చరిత్రలో విస్మృత వీరాంగన!

gulab kaur freedom fighter
gulab kaur freedom fighter

gulab kaur freedom fighter: పంజాబ్‌ సంగ్రూర్‌ జిల్లా బక్షివాలా గ్రామంలో 1890లో జన్మించిన గులాబ్‌ కౌర్‌ది రైతు కుటుంబం. చిన్నతనంలోనే మాన్‌సింగ్‌తో పెళ్లయింది. పంజాబ్‌లో అప్పటి ఆంగ్లేయ సర్కారు విధానాల కారణంగా అనేక మంది రైతు కుటుంబాల బతుకులు ఇబ్బందుల్లో పడ్డాయి. ఫలితంగా.. చాలామంది పొట్ట చేతపట్టుకొని విదేశాలకు వలస వెళ్లటం మొదలైంది. ఆ క్రమంలోనే.. మాన్‌సింగ్‌-గులాబ్‌ కౌర్‌లు కూడా భారత్‌లో కష్టాల నుంచి బయటపడి, మెరుగైన జీవితం కోసం అమెరికా వెళ్లాలనే లక్ష్యంతో తొలుత ఫిలిప్పీన్స్‌కు బయల్దేరారు. అప్పటికి భారత్‌లో బ్రిటిష్‌ సర్కారును కూల్చేసే ఉద్దేశంతో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన గదర్‌పార్టీ విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌లలోని భారతీయులపై విప్లవ కార్యకలాపాల ప్రభావం ఉండేది. అక్కడి గురుద్వారాల్లో మత ప్రార్థనల తర్వాత స్వాతంత్య్ర లక్ష్యాల గురించి ప్రసంగాలు నడిచేవి. వాటి స్ఫూర్తితో 1913లో గదర్‌పార్టీలో చేరారు మాన్‌-గులాబ్‌ దంపతులు! గదర్‌ కరపత్రాలు పంచటమేగాకుండా.. కార్యకర్తలకు ఆయుధాల సరఫరాలో కూడా చురుగ్గా వ్యవహరించే గులాబ్‌ తన గాత్రంతో అందరిలో స్ఫూర్తినింపేది. అలా ఉద్యమంలో కీలకమైన ఆ దంపతులిద్దరూ ఇకపై అమెరికా వెళ్లకుండా మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చి స్వాతంత్య్రం కోసం పోరాడాలనుకున్నారు. తీరా.. ఓడెక్కే రోజు భర్త మాన్‌ వెనక్కి తగ్గాడు. మనీలా నుంచి అమెరికా వెళ్లి .. సౌకర్యవంతమైన జీవితాన్ని గడపటానికే ప్రాధాన్యమిచ్చాడు.

భారత్‌కు వెళ్లేలా భర్తను ఒప్పించటానికి గులాబ్‌ ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. కట్టుకున్న భర్తతో అమెరికా వెళ్లి హాయిగా జీవించటమో.. కన్నభూమి భారత్‌ బానిస సంకెళ్లను తెంచటానికి పోరాటమో తేల్చుకోవాల్సిన పరిస్థితి! అత్యంత క్లిష్టమైన ఈ దశలో.. బీబీ గులాబ్‌ కౌర్‌.. పతిభక్తి కంటే దేశభక్తికే ప్రాధాన్యమిచ్చింది. భర్తను వదిలేసింది. తన ఒక చేతి గాజులను మాన్‌పై విసిరేసి.. గదర్‌ నేతలతో కలసి భారత్‌కు ఓడెక్కింది. వివిధ దేశాల నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న గదర్‌ విప్లవకారులంతా 1914లో హాంకాంగ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయుధాల సరఫరాతో పాటు.. దేశభక్తి గేయాలతో, ప్రసంగంతో గులాబ్‌ హోరెత్తించింది. కార్యకర్తల్లో ఇంకా కొంతమంది పోరాడాలా వద్దా అని ఊగిసలాడుతున్నట్లు కనిపించటంతో.. "కన్నభూమి కోసం పోరాటంలో ఇంకా ఎవరికైనా అనుమానాలుంటే.. వెనక్కి తగ్గాలనుకుంటే ఇదిగో ఈ గాజులు తొడుక్కొని పక్కన కూర్చోండి. వారి స్థానంలో మేం మహిళలం పోరాడతాం" అంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది.


గదర్‌ వీరుల ఓడ భారత్‌కు రాగానే.. ఆంగ్లేయ పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. ఎలాగోలా గులాబ్‌ తప్పించుకొని పంజాబ్‌ చేరుకుంది. హోశియార్‌పుర్‌, జలంధర్‌, కపుర్తలా జిల్లాల్లో సాయుధ విప్లవానికి ప్రజల్ని సిద్ధం చేసే పని మొదలెట్టింది. ఆయుధాల సరఫరాతో పాటు.. గూఢచర్యం చేస్తూ గదర్‌ వీరులకు సమాచారం చేరవేసేది. ఎంతమంది అరెస్టయినా.. గులాబ్‌ మాత్రం తప్పించుకుంటుండటం వల్ల.. ఆంగ్లేయ పోలీసులు ఆమెపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాజద్రోహ నేరం మోపి అరెస్టు చేసి.. లాహోర్‌ జైల్లో పెట్టారు. అక్కడ ఖైదీల స్థితిగతులపై ప్రశ్నించినందుకు గులాబ్‌ను చిత్రహింసలపాల్జేశారు. దాదాపు రెండేళ్ల కఠిన కారాగారశిక్ష అనుభవించిన ఆమె ఆరోగ్యం క్షీణించింది. జైలు నుంచి విడుదలయ్యాక కూడా స్వాతంత్య్ర పోరాటం కోసం ప్రజల్ని చైతన్య పర్చిన గులాబ్‌... 1931లో కన్నుమూశారు.

ఇదీ చదవండి: తెరవెనక పాత్రలో ఒదిగిపోయిన సమరకిరణం.. జగ్జీవన్‌దాస్‌ మెహతా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.