ETV Bharat / bharat

అమృత్‌పాల్‌ కోసం వేట.. పోలీసుల సెలవులు రద్దు.. పంజాబ్​లో టెన్షన్​.. టెన్షన్​!

author img

By

Published : Apr 7, 2023, 2:13 PM IST

Updated : Apr 7, 2023, 3:34 PM IST

punjab police cancels leaves for cops till april 14
పంజాబాా పోలీసులకు సెలవులు రద్దు చేసిన రాష్ట్ర డీజీపీ

పరారీలో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారు అమృత్‌ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 14వ తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయడమే కాకుండా కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్‌ డీజీపీ గౌరవ్​ యాదవ్ పోలీసు అధికారులను ఆదేశించారు.

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్‌ దే పంజాబ్‌ చీఫ్‌ అమృత్‌పాల్‌ కోసం పోలీసుల వేట మరింత ఉద్ధృతమైంది. అందులో భాగంగా పంజాబ్‌ పోలీసులకు ఈనెల 14వ తేదీ వరకు సెలవులు రద్దుచేశారు రాష్ట్ర డీజీపీ గౌరవ్​ యాదవ్. బైశాఖీ పండుగ సందర్భంగా ఈనెల 14న సర్బత్‌ ఖల్సా సమావేశం ఏర్పాటు చేయాలని అమృత్‌ పాల్‌.. అకాల్ తఖ్త్‌ను కోరటం వల్ల పంజాబ్‌ పోలీసులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను కిడ్నాప్‌ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ వందల మంది అనుచరులతో ఫిబ్రవరి 24న అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్నాలా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించాడు. వీరంతా తల్వార్లు, తుపాకులతో ఠాణాపై దాడికి దిగారు. అమృత్‌ పాల్‌, సాయుధులైన అనుచరగణం రెచ్చిపోవటం వల్ల పోలీసులు లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుడిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు పక్కా వ్యూహరచన చేశారు. కానీ వారికి చిక్కినట్టేచిక్కి తప్పించుకున్నాడు. బైశాఖి పర్వదినం సందర్భంగా సర్బత్‌ ఖల్సా సమావేశం ఏర్పాటు చేయాలని అమృత్‌పాల్‌ గతనెలలో అకాల్‌ తఖ్త్‌ను కోరాడు. బైశాఖీ సమీపిస్తుండటం వల్ల పంజాబ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. అమృత్‌పాల్‌ను ఎలాగైనా పట్టుకోవాలని భావిస్తున్న పంజాబ్‌ ప్రభుత్వం ఈనెల 14వ తేదీ వరకు పోలీసుల సెలవులను రద్దుచేసింది. ఈ మేరకు పంజాబ్‌ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే మంజూరు చేసిన సెలవులను రద్దు చేయడమే కాకుండా కొత్తగా ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని ఆదేశించారు. గెజిటెడ్‌, నాన్‌-గెజిటెడ్‌ అధికారులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎవరీ అమృత్​పాల్​ సింగ్​..?
ఖలిస్థానీ అనుకూల సంస్థ 'వారీస్​ పంజాబ్​ దే'కు ప్రస్తుతం అమృత్​పాల్​ సింగ్ అధినేతగా ఉన్నాడు​. గతేడాది ఫిబ్రవరి వరకు అమృత్‌పాల్‌ సింగ్​ ఎవరికీ తెలియని ఓ సామాన్య వ్యక్తి. 30 ఏళ్ల అమృత్​పాల్​ మోడ్రన్​ లైఫ్​స్టైల్​ను అనుసరిస్తూ పంజాబీలు కచ్చితంగా ధరించే తలపాగా కూడా ధరించేవాడు కాదు. తన బంధువుల రవాణా వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండేందుకు దుబాయి వెళ్లాడు. యువత లాగే ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలోనే గడిపేవాడు. కానీ, 'వారిస్‌ పంజాబ్‌ దే' సంస్థ వ్యవస్థాపకుడు, నటుడు దీప్‌సిద్ధూ మరణం కారణంగా అమృత్‌పాల్‌ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీప్​సిద్ధూ అనుచరులకు దిశానిర్దేశం చేసేవారు కరవైపోయారు! దీనిని అవకాశంగా మలుచుకున్నాడు అమృత్‌పాల్‌ సింగ్​. కొంత కాలం తర్వాత 'వారిస్‌ పంజాబ్‌ దే' సంస్థకు తానే నాయకుడి​నని ప్రకటించుకున్నాడు. అయితే మొదట్లో అమృత్​పాల్​ కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించలేదు. కానీ, అమృత్‌పాల్ తెగువతో తక్కువ సమయంలోనే పంజాబ్ వ్యాప్తంగా ఫేమస్​ అయ్యాడు.

ఏం చేస్తుందీ ఖలీస్తానీ సంస్థ..?
భారత్​కు వ్యతిరేకంగా పంజాబీ యువతలో ఖలిస్థానీ భావజాలాన్ని నింపడమే అజెండాగా తన కార్యకలాపాలను ప్రారంభించాడు అమృత్​పాల్​. సిక్కులందరూ ప్రమాదంలో ఉన్నారని.. బానిస బతుకుల నుంచి బయటకు రావాలని మతవిద్వేషాలను పంజాబీల మనస్సుల్లో నాటాడు. అంతేకాకుండా పాక్‌ ఉగ్రసంస్థ ఐఎస్‌ఐ అజెండాను సైతం అమృత్​పాల్​ అనుసరిస్తున్నాడని కొందరు సిక్కు మేధావులు అంటున్నారు. దీంతో వారి మతానికే చెడ్డ పేరు తెస్తున్నాడని వాపోతున్నారు. ఇకపోతే కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది అయిన జర్నైల్‌ సింగ్‌ భింద్రాన్‌వాలా దారిలోనే అమృత్‌పాల్‌ నడుస్తున్నాడని విమర్శలు ఉన్నాయి. కాగా, అమృత్​పాల్​ సింగ్​ వేషధారణ కూడా భింద్రాన్‌వాలాను పోలి ఉండటం గమనార్హం.

Last Updated :Apr 7, 2023, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.