ETV Bharat / bharat

'వారు వేగంగా స్పందిస్తే బాగుండేది'.. మూత్ర విసర్జన ఘటనపై టాటా గ్రూప్ ఛైర్మన్

author img

By

Published : Jan 8, 2023, 3:51 PM IST

Updated : Jan 8, 2023, 5:39 PM IST

Air India peeing incident
Air India peeing incident

Air India Pee Incident : ఎయిర్​ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో తాము సరైన రీతిలో స్పందించలేదన్నారు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్​. చంద్రశేఖరన్​. ఈ ఘటన తనతో పాటు సంస్థ ఉద్యోగులకు ఎంతో వేదనను కలిగించిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Air India Pee Incident : ఎయిర్​ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన ఘటనపై టాటా గ్రూప్​ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమ ఉద్యోగులు త్వరితగతిన స్పందించాల్సిందని చెప్పారు. దీనికి వారు సరైన రీతిలో పరిష్కారం చూపించలేదని తెలిపారు. ఈ ఘటన తనతో పాటు సంస్థ ఉద్యోగులకు ఎంతో వేదనను కలిగించిందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు టాటా గ్రూప్, ఎయిర్​ ఇండియా సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయని.. తమ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తారని ఆయన వివరించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూత్ర విసర్జన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిరిండియా విమానయాన సంస్థకు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

'బాధితురాలికి సీటు కూడా ఇవ్వలేదు'
మహిళపై మూత్ర విసర్జన జరగలేదంటూ నిందితుడి తండ్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అమెరికాకు చెందిన సహ ప్రయాణికుడు డాక్టర్​ సుగతా భట్టాచార్జీ. ఇంత వివాదం నడుస్తున్న తరుణంలో.. తన కుమారుడు అమాయకుడని చెప్పడం దారుణమని అన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉండి ఏం చేస్తున్నాడో కూడా తెలియదని వివరించారు. విమాన సిబ్బంది ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. బాధితురాలికి సరైన సీటు కూడా కేటాయించలేదని విమర్శించారు. ఇంతకాలం తాను వేచి ఉన్నానని.. కానీ అతడి తండ్రి ఇలా చెప్పాక తాను నిశబ్దంగా ఉండడం సరైంది కాదన్నారు. అందుకే నైతిక బాధ్యతగా ఆ మహిళకు అండగా తాను ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు. ఓ మహిళ పరువుతో పాటు టాటా లాంటి గొప్ప సంస్థ పేరును సైతం చెడగొట్టాడని విమర్శించారు. అతడు సైతం తన ఉద్యోగాన్ని కోల్పోయాడని.. అతడి కుటుంబం కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందన్నారు.

'పైలట్లపై వేటు వేయడం సరైంది కాదు'
ఈ ఘటనలో బాధిత మహిళ పట్ల విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన ఎయిర్ ఇండియా దిద్దుబాటు చర్యలకు దిగింది. ఘటన సమయంలో ఉన్న విమాన పైలట్‌, క్యాబిన్‌ సిబ్బందిపై వేటు వేసింది. అయితే ఈ ఘటనపై మాజీ పైలట్లు తీవ్రంగా విమర్శించారు. ఐదుగురిపై చర్యలు తీసుకోవడానికి సరైన కారణం లేదని చెప్పారు.

నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానం బిజినెస్‌ క్లాసులో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడు శంకర్‌ మిశ్రను ఎట్టకేలకు దిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బెంగళూరులో తలదాచుకున్న అతడిని దిల్లీకి తరలించి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అతడిని మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని దిల్లీ పోలీసులు కోరారు. శంకర్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని.. అప్పుడే విమాన కెప్టెన్‌, క్యాబిన్‌ సిబ్బంది అతడిని గుర్తుపడతారని పోలీసులు తెలిపారు. నిందితుడికి పోలీసు కస్టడీకి అప్పగించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం అతడికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపించింది.

ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించిన ఉద్యోగులు
విమాన భద్రతా నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఇద్దరు విదేశీయులను విమానం నుంచి బయటికి దించారు ఉద్యోగులు. గోవా నుంచి ముంబయి వెళ్తున్న గో ఫస్ట్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ అధికారులు తెలిపారు. వారిని వెంటనే విమానం నుంచి దించి విమానాశ్రయ భద్రత సిబ్బందికి అప్పగించామని చెప్పారు. దీనిపై డీజీసీఏకు సమాచారం అందించామని.. తదపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు.

ఇవీ చదవండి : రూ. 6 లక్షలతో 'అంబానీ సేతు'.. ప్రభుత్వం దృష్టి పడేందుకే!

'జోడో యాత్ర నాకు తపస్సుతో సమానం.. కొందరి చేతుల్లోనే సంపద, మీడియా'

Last Updated :Jan 8, 2023, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.