ETV Bharat / bharat

'అగ్నిపథ్‌'పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. వారికి మాత్రం నో ఛాన్స్​!

author img

By

Published : Apr 10, 2023, 1:37 PM IST

Updated : Apr 10, 2023, 2:17 PM IST

agneepath-scheme-supreme-court-judgement
అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టు తీర్పు

అగ్నిపథ్​కు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రెండు వ్యాజ్యాలను కొట్టివేసింది. గతంలో సాయుధ బలగాల రిక్రూట్​మెంట్​ ర్యాలీల్లో ఎంపికైన వారికి.. ఇప్పుడు అగ్నిపథ్​ కింద నియామకం పొందే అవకాశం లేదని తేల్చిచెప్పింది.

'అగ్నిపథ్​'పై దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్​ పథకాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గోపాల్ కృషన్, న్యాయవాది ఎంఎల్​ శర్మ వేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్​ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు నిర్ణయం ప్రకటించింది.

వారికి నో ఛాన్స్​!
అగ్నిపథ్​ పథకం అమలుకు ముందే సాయుధ బలగాలకు ఎంపికైన వారికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్మీ రిక్రూట్​మెంట్ ర్యాలీల ద్వారా సాయుధ దళాలకు ఎంపికైనంత మాత్రాన.. వారికి ఇప్పుడు అగ్నిపథ్​ పథకం కింద నియామకం పొందే అవకాశం లేదని తేల్చిచెప్పింది. మరోవైపు.. అగ్నిపథ్​ అమలుకు ముందు వాయుసేనకు నియామకాలకు సంబంధించిన పిటిషన్​పై విచారణను మాత్రం సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ మూడో పిటిషన్​పై ఈ నెల 17న వాదనలు వింటామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన వాదనలు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది అగ్నిపథ్​ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అన్నింటినీ విచారించిన దిల్లీ హైకోర్టు.. అగ్నిపథ్ పథకాన్ని సమర్థించింది. జాతీయ భద్రతే ప్రాధాన్యాంశంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించారని స్పష్టం చేసింది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టేందుకు మార్చి 27న సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. సోమవారం అందులో రెండు పిటిషన్లను కొట్టివేసింది. మూడో వ్యాజ్యంపై వాదనలు ఈ నెల 17న ఆలకిస్తామని తెలిపింది.

అసలేంటి అగ్నిపథ్​..?
త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ ​14న 'అగ్నిపథ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని తెలిపింది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈ ఏడాది రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించింది. కానీ ఈ స్కీమ్​కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల యువత హింసాత్మక నిరసనలు చేపట్టినప్పటికి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. తాజాాగా వెలువడిన సీఆర్​ఫీఎప్​ నియమాకాల్లోనూ.. అగ్నివీర్​లకు 10 శాతం రిజర్వేషన్​లు కల్పించింది ప్రభుత్వం.

Last Updated :Apr 10, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.