ETV Bharat / bharat

కరెంట్ కట్.. మండపంలోనే వధూవరులపై యాసిడ్​ దాడి.. 12 మందికి..

author img

By

Published : Apr 20, 2023, 9:00 AM IST

acid-attack-bride-and-groom-thug-attacked-newlyweds-with-acid
నూతన దంపతులపై దుండగుడు యాసిడ్‌తో దాడి

నూతన దంపతులపై యాసిడ్ దాడి చేశాడు ఓ దుండగుడు. పెళ్లి మండపంలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. దాడిలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో సహా.. మొత్తం 12 మంది గాయపడ్డారు. బిహార్​లో జరిగిందీ ఘటన.

పెళ్లి మండపంలోనే నూతన వధూవరులపై యాసిడ్​ దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందికి సైతం గాయాలయ్యాయి. బిహార్​లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధితులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లి వేడుకల్లోనే నూతన దంపతులపై ఈ దాడి జరగడం వల్ల.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్తర్ జిల్లాలోని అంబల్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెళ్లికి వచ్చిన ఓ దుండగుడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లి వేడుక జరుగుతుండగా.. దాదాపు 7 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కరెంట్​ సరాఫరా నిలిచిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకున్న దుండగుడు.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుపై యాసిడ్ పోశాడు. దీంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరిని మొదటగా భన్పురీ సివిల్ హాస్పిటల్​కు తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ ప్రాథమిక చికిత్స అందించి.. మైరుగైన వైద్యం కోసం జగదల్‌పూర్‌లోని మహారాణి హాస్పిటల్​ తరలించినట్లు వారు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని వారు పేర్కొన్నారు.

మహిళపై భర్త, ప్రియుడి యాసిడ్ దాడి..
కొంత కాలం క్రితం ఓ వివాహితపై ఆమె భర్త, ప్రియుడు కలిసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితురాలి ముఖం, చేతి భాగం తీవ్రంగా కాలిపోయాయి. మహారాష్ట్ర విరార్​లోని నాలాసోపారాలో ఈ దారుణం జరిగింది.

నాలాసోపారాకు చెందిన కరిష్మా అలీ(20)కి తౌఫిక్​ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే కరిష్మాను ఆమె భర్త తౌఫిక్ నిత్యం కొడుతుండేవాడు. ఈ క్రమంలో బాధితురాలు అతడిని దూరంపెట్టి.. అదే ప్రాంతానికి చెందిన కమ్రాన్ అన్సారీ అనే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది. అయితే కమ్రాన్​.. కరిష్మాను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడం వల్ల అతడిని కూడా వదిలేసింది.

ఆ తర్వాత నాలాసోపారాకు చెందిన కమల్ ఖాన్‌తో కలిసి ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న కరిష్మా భర్త తౌఫిక్, ప్రియుడు కమ్రాన్​ అన్సారీ ఆమెతో గొడవపడ్డారు. కమల్​ ఖాన్​తో కలిసి ఉండొద్దని హెచ్చరించారు. అయితే బాధితురాలు కమల్​తోనే కలిసి ఉంటానని చెప్పింది. ఈ క్రమంలో బాధితురాలిపై కోపం పెంచుకున్నారు ఇద్దరు నిందితులు. సోమవారం రాత్రి బాధితురాలు కరిష్మా నిద్రిస్తున్న సమయంలో ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు. ఆ సమయంలో బాధితురాలి పక్కనే ఉన్న కమల్ ఖాన్​కు సైతం గాయాలయ్యాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.