ETV Bharat / bharat

బులెట్ గాయాలతో భారత్​లోకి మయన్మార్ పౌరులు!

author img

By

Published : Mar 27, 2021, 10:05 AM IST

తీవ్రమైన బులెట్ గాయాలతో ముగ్గురు మయన్మార్ జాతీయులు భారత్​లోకి ప్రవేశించారు. సరిహద్దు దాటి వచ్చిన వీరిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం సుమారు పన్నెండు మంది మయన్మార్ వాసులు మణిపుర్​లోకి ప్రవేశించారని, అందులో ఎనిమిది మందిని వెనక్కి పంపించామని చెప్పారు.

3 Myanmar nationals with bullet wounds cross into India
బులెట్ గాయాలతో దేశంలోకి మయన్మార్ వాసులు

మయన్మార్​లో సైనిక హింసను తట్టుకోలేక శరణార్థులుగా భారత్​లోకి ప్రవేశిస్తున్నారు ఆ దేశ పౌరులు. శుక్రవారం ముగ్గురు మయన్మార్ జాతీయులు అసోంలోని సరిహద్దు ప్రాంతంలోకి వచ్చారు. తీవ్రమైన బులెట్ గాయాలతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు స్థానిక అధికారులు.

గత గురువారం రాత్రి సుమారు 12 మంది మయన్మార్ వాసులు మణిపుర్​లోకి ప్రవేశించారని స్థానిక పోలీసులు తెలిపారు. సరిహద్దులో మయన్మార్ దళాలు ప్రజలపై కాల్పులకు తెగబడటం వల్ల వారు ఆ దేశం విడిచి పారిపోతున్నారని చెప్పారు. భారత్​లోని సరిహద్దు ప్రాంతమైన మోరేలో వారికి స్థానికులు ఆశ్రయం కల్పించారని వెల్లడించారు.

శుక్రవారం ఎనిమిది మందిని తిరిగి మయన్మార్​కు పంపించినట్లు పోలీసు అధికారి విక్రమ్​జీ సింగ్ చెప్పారు. గాయపడ్డవారికి మానవతా దృక్పథంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

వందల్లో శరణార్థులు!

ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం తిరుగుబాటు చేయడం, అనంతరం నిరసనకారులపై ఉక్కుపాదం మోపడం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరిహద్దులో నివసించే ప్రజలు దేశం దాటి వెళ్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఇలా భారత్​కు చేరుకున్నవారి సంఖ్య వందల్లో ఉండొచ్చని తెలుస్తోంది. గత రెండు వారాల్లో భారత్​లోకి వచ్చిన 34 మంది పోలీసులు, ఓ అగ్నిమాపక సిబ్బందికి భారత్​లోని ఓ గ్రామ ప్రజలు ఆశ్రయం ఇచ్చారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.