ఇన్స్టాగ్రామ్ స్నేహం బాలిక పాలిట శాపంగా మారింది. స్నేహం ముసుగులో 14 ఏళ్ల బాలికకు డ్రగ్స్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఏడుగురు. కేరళ మలప్పురం జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తనపై జరిగిన దాడిని బంధువులకు 10 రోజుల క్రితం తెలపగా.. చైల్డ్లైన్కు వచ్చిన సమాచారంతో ఈనెల 17న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆమెకు ఇద్దరు నిందితులు గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇచ్చారని.. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మిగతా వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లగా.. తల్లి, సోదరుడు, తాతతో కలిసి ఉంటోంది. గత ఎనిమిది నెలలుగా తన తల్లి ఫోన్ ద్వారా ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తోంది బాలిక. నిందితులంతా.. ఇన్స్టాగ్రామ్ స్నేహితులే. వారంతా 19-24 మధ్య వయస్కులుగా గుర్తించారు.
నిందితులపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికకు డ్రగ్స్ ఇచ్చిన ఇద్దరిపై జువనైల్ యాక్ట్ 77 కింద కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చూడండి: 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం