ETV Bharat / bharat

Tspsc Paper Leak Case : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు... మరో 13 మంది డీబార్

author img

By

Published : May 31, 2023, 8:31 PM IST

Updated : May 31, 2023, 10:27 PM IST

Tspsc
Tspsc

20:26 May 31

Tspsc Paper Leak Case : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు... మరో 13 మంది డీబార్

Tspsc Paper Leak Case Latest Update : ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో డీబార్ల సంఖ్య 50కి చేరింది. నిన్న 37 మందిపై డిబార్ వెయిట్ వేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ మరో 13 మందిపై అదే చర్యలు తీసుకుంది. తమ నోటిఫికేషన్‌లోని నిబంధనలను అనుసరించి లీకేజీ కేసులో ప్రమేయమున్న వారు భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యంతరం ఉంటే రెండు రోజుల్లోగా తెలపాలని తాజాగా అరెస్ట్ అయిన డీఈ రమేష్ సహా 13 మందికి టీఎస్​పీఎస్సీ నోటీసు ఇచ్చింది. ఆ 13 మంది వివరాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్​లో పొందుపరిచింది. సిట్ అరెస్టు, రిమాండ్ నివేదికల ఆధారంగా టీఎస్​పీఎస్సీ చర్యలు తీసుకుంటోంది.

విచారణలో విస్తుపోయే వాస్తవాలు : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజి కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తున్న అంశం తెలిసిందే. అయితే తాజాగా అరెస్ట్ అయిన డీఈ రమేష్​ను విచారించగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. కేవలం ఏఈ పేపర్లు విక్రయించడం ద్వారా డీఈ రమేష్‌ 1.1కోట్ల రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తం 30 మందికి అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్లు విక్రయించినట్లు సిట్‌ గుర్తించింది. గతంలో వరంగల్ విద్యుత్‌ శాఖలో డీఈగా పనిచేసిన రమేష్... ప్రస్తుతం హైదరాబాద్​లో పనిచేస్తున్నారు. లీకేజి కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్​కు సురేష్​ మిత్రుడు కాగా.... డీఈ రమేష్​కు సురేష్ బంధువు. ఈ మొత్తం వ్యవహారంతో ప్రవీణ్ కుమార్​కు, డీఈ రమేష్​కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.

పేపర్లు విక్రయించి 1.1కోట్ల రూపాయలు సంపాదించిన డీఈ : సురేష్​ ద్వారా రమేష్​కి ఏఈ ప్రశ్నపత్రాలు అందాయి. డీఈ రమేష్​ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అభ్యర్ధులకు వివిధ అంశాలపై శిక్షణనిస్తుంటాడు. అదే సమయంలో అక్కడి అభ్యర్ధులతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఏఈ సివిల్ ప్రశ్నపత్రాలు విక్రయిస్తే వచ్చిన డబ్బులో డీఈ రమేష్​కు 40శాతం ఇస్తానని సురేష్ చెప్పాడు... కానీ, ఇందుకు డీఈ రమేష్ ఒప్పుకోలేదు. చివరకు డీఈ రమేష్​కు 70 శాతం, సురేష్​కు 30 శాతంగా డీల్‌ కుదిరింది. ఇలా తనకు ఉన్న పరిచయాలతో 30 మందికి పేపర్లు విక్రయించి రమేష్ 1.1కోట్ల రూపాయలు సంపాదించినట్లు సిట్ గుర్తించింది.

మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం : మరోవైపు పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 45 మందిని సిట్ అరెస్ట్‌ చేసింది. ఇదిలా ఉండగా అరెస్టుల సంఖ్య వంద దాటే అవకాశముందని హైదరాబాద్‌ నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం పేర్కొనడం గమనార్హం. తొలుత రేణుక అనే ఉపాధ్యాయురాలు సహా తొమ్మిది మందిని అరెస్ట్‌ చేయడంతో లీకేజీ వ్యవహారం బహిర్గతమైంది. దర్యాప్తు క్రమంలో కమిషన్‌ ఉద్యోగులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, షమీమ్‌, సురేశ్‌, రమేశ్‌ల పాత్ర ఉన్నట్లు తేలింది. ఇలా తీగలాగే కొద్దీ డొంక కదులుతుండటంతో సిట్‌ దర్యాప్తు ఎన్ని రోజులు సాగుతుందనేది అంతుచిక్కడం లేదు. లీకేజీకి పాల్పడినవారి సంఖ్య రెండు వందలకు చేరొచ్చని దర్యాప్తు అధికారులే అనధికారిక సంభాషణల్లో వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి :

Last Updated :May 31, 2023, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.