ETV Bharat / bharat

మహా విషాదం.. మలబార్​ వీరుల 'వ్యాగన్​ ట్రాజెడీ'కి వందేళ్లు

author img

By

Published : Sep 11, 2021, 9:13 AM IST

Wagon Tragedy
కౌలురైతులను ఒకే గూడ్స్ వ్యాగన్ లో ఉంచి ఉసురు తీసిన రాక్షసం

మాటలకందని మహావిషాదం. కౌలురైతులను ఒకే గూడ్స్ వ్యాగన్​లో ఉంచి ఉసురు తీసిన రాక్షసం.. వలస పాలనలో అలనాటి అనాగరిక ఊచకోత ఘటనకు నూరేళ్లు. మలబార్ వీరుల త్యాగాలతో స్వాతంత్ర్యోద్యమం స్ఫూర్తినందుకుంది. అది బ్రిటిష్ ముష్కర పాలకులు సాగించిన నరమేధానికి పరాకాష్ట. మరో జలియన్ వాలాబాగ్​గా చరిత్రకారులు అభివర్ణించిన ఘటన.

మలబార్​ రైతాంగ తిరుగుబాటుదారుల ఊచకోతకు వందేళ్లు

బ్రిటిష్ దుష్పరిపాలనకు, భూస్వాముల దురాగతాలకు నిరసనగా మద్రాస్ ప్రెసిడెన్సీలోని కేరళలోని రైతాంగ ఉద్యమం రగులుకుంది. మలబార్ రైతాంగ తిరుగుబాటు అణచివేత, అరెస్టుల పర్వం కొనసాగుతున్న సమయమది. అయినా జనం ఖాతరు చేయలేదు. ఉద్యమం మరింత విస్తృతమైంది. ఆ రోజుల్లో అరెస్టయిన ఉద్యమకారులను తరలించటానికి బ్రిటిషర్లు రైలు గూడ్సు వ్యాగన్లను ఉపయోగించేవారు. 1921 నవంబర్ 20న అలా వందమందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిని మలప్పురంలోని తిరూరు రైలు స్టేషన్​లో సరకు రవాణా వ్యాగన్​లోకి ఎక్కించి .. కర్ణాటకలోని బళ్లారి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మలప్పురం-పాలక్కాడ్ సరిహద్దులోని పులమంతోల్‌ బ్రిడ్జి పేల్చివేతకు కుట్రపన్నారని అభియోగం మోపారు.

వారందరినీ గాలి, వెలుతురు లేని ఒక గూడ్స్ వ్యాగన్​లో కుక్కివేశారు. ఊపిరాడక కేకలు వేయసాగారు. రైలు పాలక్కాడ్ జిల్లాలోని షోర్నూరు, ఒలవక్కోడు స్టేషన్లలో ఆగింది కూడా. కానీ బ్రిటిష్ సైనికాధికారులు వ్యాగన్ తలుపులు తెరవలేదు. ఎట్టకేలకు రైలును తమిళనాడులోని పోత్నూరు స్టేషన్లో నిలిపివేశారు. రైలు బోగీలో ఉంచిన వారి హాహాకారాలు రైలు ప్రయాణిస్తున్న స్టేషన్లన్నింటిలో అధికారులకు వినపడుతూనే ఉన్నాయి. గూడ్సు డబ్బాలోని దాదాపు 70 మంది తమను కాపాడాలంటూ శక్తికొద్దీ కేకలు వేస్తున్నారు. అలా అరుస్తూ.. శ్వాస అందక ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడ్డవారిని బ్రిటిష్ అధికారులు ఆసుపత్రికి తరలించారు. కర్కశంగా ప్రవర్తించే బ్రిటిష్ సైనికాధికారులే వ్యాగన్ లోపల దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. మృతదేహాలతో కూడిన ఆ వ్యాగన్​ను రైల్వే అధికారులు తిరిగి పోతన్నూరు నుంచి తిరూరుకు పంపివేశారు. చరిత్రకారులు ఈ ఘోర దురంతాన్ని మరో జలియన్ వాలా బాగ్​గా అభివర్ణించారు.

ఊచకోతకు వందేళ్లు..

అమానుష ఊచకోత ఘటనకు వందేళ్లు నిండాయి. అయినా నేటికీ ఆ పీడకల తిరూరును వెన్నాడుతూనే ఉంది. వ్యాగన్​లో తీసుకొచ్చిన 44 మృతదేహాలను తిరూరు ఖొరాన్ ఘాట్ జుమా మసీదు సమీపంలో ఖననం చేశారు. మరో 11 మృతదేహాలను కోట్​లోని జుమామసీదు సమీపాన అంత్యక్రియలు నిర్వహించారు. ఆరోజు రైలు నుంచి మృతదేహాలను స్వీకరించిన తుంబేరి ఆలికుట్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనాడు సైనికులు ఉద్యమకారులను వెంటాడి మరీ అరెస్టు చేశారు. తర్వాత తిరూరు రైల్వే స్టేషన్లో ఓ వ్యాగన్​లో కుక్కివేశారు. నలుగురు పోలీసులను కూడా వ్యాగన్​లోకి ఎక్కించారు.

రైలు కోయంబత్తూరు చేరినప్పుడు.. స్టేషన్ మాస్టరు వ్యాగన్​ను తెరిచారు. ఓ హృదయవిదారక దృశ్యాన్ని చూశారు. వారిలో అనేకమంది మృతిచెందారు. ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి పంపించారు. మృతదేహాల వ్యాగన్​ను తిరిగి తిరూరుకు పంపించారు.

తీసుకునేందుకు ఎవరూ రాలేదు..

మృతదేహాలు వెనుదిరిగి వచ్చినప్పుడు తిరూరులో వాటిని తీసుకునేందుకు సంబంధీకులెవరూ రాలేదు. చిట్టచివరకు ఎల్నాడు కనిక్కర మమ్మిహాజీకి చెందిన కమ్ముకుట్టియక్క స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

'వ్యాగన్​ ట్రాజెడీ' పుస్తకం..

ఆనాటి మారణకాండ నుంచి అత్యంత ఆశ్చర్యంగా ప్రాణాలు దక్కించుకున్న వారిలో కన్నోల్లీ అహ్మద్ హాజీ ఒకరు. ఆయన 1981లో 'వ్యాగన్ ట్రాజెడీ' అనే పుస్తకం రాశారు.

'బ్రిటిష్ దళాలు తాము పట్టుకున్న ఖైదీలను తిరూరు రైల్వే స్టేషనుకు తీసుకొచ్చాయి. నిర్బంధంలోకి తీసుకున్న వారిలో 600మంది ఉన్నారు. ఆర్మీ వాళ్లు వ్యాగన్లలో ఖైదీలను కుక్కుతున్నారు. ఘోరం జరిగిన వ్యాగన్ లో వందమందిని ఉంచారు. దిండులో దూదిని కుక్కినట్లు జనాన్ని ఒక వ్యాగన్లో కుక్కారు. అనేకమంది ఒంటికాలుపై నిలుచున్నారు. ఆర్మీవాళ్లు తుపాకులతో మమ్మల్ని లోపలికి తోసివేసి, తలుపు తాళం పెట్టారు. ఖైదీలు ఊపిరాడక హాహాకారాలు చేస్తున్నారు. వ్యాగన్ లో గాలీ, వెలుతురూ లేవు' అని కన్నోల్లీ అహ్మద్ హాజీ రాశారు.' కొందరు విపరీతమైన దప్పికతో కుప్పకూలిపోయారు. మరికొందరు తమకు తెలియకుండానే మలమూత్రాలు విసర్జించారు. వస్తున్న చెమటను నాకేందుకు, మూత్రం సేవించేందుకు విఫలయత్నం చేశారు. మృత్యువు తరుముకొస్తున్న వేళ ఒక చోట గోరంత రంధ్రం కనపడింది. అందులోంచి ఓకరి తర్వాత మరొకరు ఊపిరి తీసుకోవటానికి యత్నించారు. ఒకరినొకరు రక్కుకుంటున్నారు. నెట్టుకున్నారు. కాసేపటికి నేను స్పృహ తప్పి పడిపోయాను. నాకు స్పృహ వచ్చి కళ్లు తెరిచేసరికి వ్యాగన్ బీభత్సంగా ఉంది.

ఎటుచూసినా..మల మూత్రాలు, రక్తం. ఎవరో నా నోట్లో చల్లని నీరుతెచ్చి పోశారు. నా శరీరంలో వణుకు ప్రారంభమైంది. నన్ను కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించినప్పుడు నేను ప్రాణాలతోనే ఉన్నానని గ్రహించాను' అని కన్నోల్లీ అహ్మద్ హాజీ తన వ్యాగన్ ట్రాజెడీ' పుస్తకంలో రాశారు.

విషాద స్మృతి చిహ్నాలుగా..

బ్రిటిష్ సైనికులు బంధించిన ఖైదీలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. వ్యాగన్ ను తిరూర్‌ కు తిరిగి తీసుకొచ్చినప్పుడు దుర్గంధం భరించలేనిదిగా ఉంది. అందులో 64 మృతదేహాలు పడివున్నాయి, ఒకదానిపై ఒకటి పడి, ఒకదానినొకటి హత్తుకొని ఉన్నాయి. ఆనాటి వ్యాగన్ ఊచకోత విషాద స్మృతి చిహ్నాలుగా ...తిరూరు మునిసిపల్ టౌన్ హాలును వ్యాగన్ ఆకారంలో తీర్చిదిద్దారు. గ్రంథాలయాలు, పాఠశాల భవనాలను సైతం వ్యాగన్ ఆకారంలో నిర్మాణం చేశారు. మాటలకందని విషాదమైనా... స్వాతంత్ర్యోద్యమ కాంక్ష రగిలించేందుకు ఈ ఘటన తోడ్పడింది.

ఇదీ చూడండి: భారతీయులకు 'స్వాతంత్య్రం' రుచి చూపిన గణపతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.