TDP Mahanadu Arrangements: మహానాడుకు ముమ్మర ఏర్పాట్లు.. అతిథులకు గోదావరి రుచులు
Published: May 21, 2023, 10:26 AM

TDP Mahanadu Arrangements: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరి వద్ద ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి టీడీపీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా 27వ తేదీన ప్రతినిధుల సభ, 28న మహానాడు బహిరంగ సభలకు వేర్వేరు వేదికలు సిద్ధమవుతున్నాయి. ప్రతినిధుల సభకు 15 వేలకు మించి జనాభా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే మహానాడు బహిరంగ సభకు లక్షల్లో వచ్చే పార్టీ శ్రేణులు, తెలుగుదేశం అభిమానులు కోసం విశిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ కళ్యాణమండపాలను, హోటళ్లను టీడీపీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసే అతిథులకు గోదావరి రుచులతో ఆత్మీయ ఆతిథ్యం అందిస్తామని నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ నిర్వహిస్తున్న ఈ మహానాడు ఎంతో ప్రత్యేకమైదని, అంతే స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ హోం మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప చెప్పారు.