AP JUDA on Medical seats మెడికల్ సీట్ల అమ్మకాలపై.. ఏపీ జూడాల అల్టిమేటం.. ఈనెల 7 తర్వాత సమ్మెకు
Junior Doctors on Medical seats ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను ఏ,బీ,సీ కేటగిరీలుగా చేసి విక్రయించటంపై వైద్య విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జీవోను ఉపసంహరించుకోకుంటే ఈ నెల 7 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చిరించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సీట్ల భర్తీలో రిజర్వేషన్ సౌకర్యం కలిగిన విద్యార్థులు, నీట్లో మంచి ర్యాంకులు పొందిన విద్యార్థులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ జీవో పేద విద్యార్థులకు శాపంగా మారుతోందని వాపోయారు. ఈ మేరకు జూడా ప్రధాన కార్యదర్శి చైతన్యకుమార్ ఏయూ, గుంటూరు, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పలువురు విద్యార్థులతో కలిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరసింహంకు లేఖ అందచేశారు. ఇదే విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్, సూపరిండెంటెంట్స్కు కూడా అక్కడి విద్యార్థులు సమ్మె నోటీసులు అందజేస్తున్నారు. గురువారం ప్రజాప్రతినిధులకు లేఖలు అందిజేసి.. కళాశాలల ప్రాంగణాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. 4వ తేదీన కొవ్వొత్తుల ర్యాలీ, 5న శాంతియుత ప్రదర్శన, 6న నిరసన దీక్షలు, 7 నుంచి అత్యవసర కేసుల మినహా మిగిలిన సేవలను బహిష్కరిస్తారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే అత్యవసర సర్వీసులకు కూడా దూరంగా ఉంటామని జూడా అసోసియేషన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూడా ప్రతినిధులతో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం సమావేశం కానున్నారు.