మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ బడా మోసం - భగ్గుమన్న నిరుద్యోగులు, కలెక్టరేట్ ఎదుట ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 5:36 PM IST
Employees protest on Mega DSC: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 'మెగా డీఎస్సీ' పేరుతో వేలాది మంది నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని.. జేఏసీ, ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ.. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్.. అధికారం చేపట్టాక మాట మార్చారని దుయ్యబట్టారు.
AIYF Leaders Comments: ''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామని ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లయినా ఇప్పటికీ ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. జగన్ హామీలపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి.. ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పోస్టులు భర్తీ చేయకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం.'' అని నిరుద్యోగ జేఏసీ, ఏఐవైఎఫ్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.