కరవుపై 20, 21 తేదీల్లో సీపీఐ, రైతుసంఘాల నిరసనలు
CPI Leaders Protest on Drought Conditions In AP : కరవుపై ఈ నెల 20, 21 తేదీల్లో తాము చేపట్టిన నిరసనలకు మద్దతు తెలపాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడును సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు కోరారు. సీపీఐతో కలిసి రైతు సంఘాలు, అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీపీఐ నేతలు అచ్చెన్నాయుడుని కలిసి మద్దతు కోరగా.. టీడీపీ భాగస్వామి అవుతుందని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కరవు తీవ్రతను ముఖ్యమంత్రి కనబడనీయట్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. సకాలంలో కేంద్రానికి కరవు నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా ఏపీకి కృష్ణ జలాల విషయంలో అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరించిందని రామకృష్ణ మండిపడ్డారు. పక్కరాష్ట్రాల వారు సెప్టెంబర్లోనే కరవు మండలాలను ప్రకటించినప్పటికీ, ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని కరవును పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని కోరారు.