YCP leaders illegal soil mining: జగనన్న కాలనీల పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు
YCP leaders illegal soil mining in Guntur district Gottipadu: గుంటూరు జిల్లా గొట్టిపాడులో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు జగనన్న కాలనీల పేరుతో విచ్చలవిడిగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టి దందా చేస్తున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా.. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టటం లేదని.. ఆ గ్రామ సర్పంచ్, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గొట్టిపాడులో మట్టి అక్రమ తవ్వకాలు-పట్టించుకోని అధికారులు.. జగనన్న కాలనీల్లో మెరక పేరుతో గుంటూరు జిల్లా గొట్టిపాడులో మట్టి అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని.. ఆ గ్రామ సర్పంచ్ మరియరాణి తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టి దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దందా గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశానని, అక్రమార్కులు అధిక ధరలకు గ్రావెల్ తరలిస్తున్నా.. ఇప్పటివరకూ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టటం లేదని ఆమె వాపోయారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి.. అక్రమ మట్టి తవ్వకాలను జరుపుతున్న నాయకులను అడ్డుకోవాలని ఆమె కోరారు.
గ్రామ పంచాయతీలో తీర్మానం లేదు.. ఎజెండా లేదు.. గొట్టిపాడు సర్పంచ్ మరియరాణి అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మట్లాడుతూ.. ''411 సర్వే నెంబర్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడికొచ్చి చూసేసరికి లారీలు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. ఈ మట్టి తరలింపుపై గ్రామపంచాయితీలో ఒక తీర్మానం లేదు, ఎజెండా లేదు. ఎటువంటి సంతకాలు పెట్టకుండానే మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయంపై వీఆర్వో, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశాం. కానీ, ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి'' అని ఆమె అన్నారు.