ETV Bharat / state

దేశవ్యాప్తంగా ఆన్​లైన్​ మోసాలు.. 44 కేసులు.. ఆట కట్టించిన ఏపీ పోలీసులు

author img

By

Published : Jan 12, 2023, 5:10 PM IST

cyber thieve arrested
cyber thieve arrested

cyber thieve arrested : అమాయకులే కాదు.. ఉన్నత విద్యావంతులనూ బురిడీ కొట్టించడంలో అతడు నేర్పరి. డిప్లొమా చదివి ఇంటర్నెట్ వాడకంపై పట్టు సాధించి ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ కోట్లు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 100కు పైగా ఫిర్యాదులు, 44 కేసులు అతడిపై నమోదయ్యాయి. ఈ నేపథ్యాన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన వైఎస్సార్ జిల్లా పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడి ఉనికిని పసిగట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శంకర్ మండల్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. అతడితో సంబంధం ఉన్న 23 బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసి రూ.12 కోట్ల నగదును ఫ్రీజ్ చేసినట్లు ఎస్పీ అంబురాజన్ తెలిపారు.

cyber thieve arrested : ఇంటర్నెట్ ద్వారా మోసాలకు పాల్పడడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. లాటరీల పేరుతో లింకులు, బహుమతుల ఎర వేసి మెసేజ్ లు పంపించి నగదు మాయం చేయడం అతడి నైజం. దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్న సైబర్ నేరస్తుడిని వైఎస్సార్ జిల్లా పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్పీ అంబురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

"పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన శంకర్ మండల్.. డిప్లమా వరకు చదువుకున్నాడు. ఇంటర్ నెట్ పై మంచి పరిజ్ఞానం ఉండడంతో వివిధ రకాల యాప్ ల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఏదైనా ఫోన్ నంబర్ కు కాల్ చేసి.. "లాటరీ తగిలింది.. డబ్బులు మీ ఖాతాలో జమ చేయాలంటే తొలుత మీరు కొంత డబ్బులు చెల్లించాలి" అంటూ ఆశ చూపిస్తాడు. ఇలా.. జిల్లాకు చెందిన ఓ బాధితుడి నుంచి సుమారు రూ.15.65 లక్షలు విడుతల వారీగా తన ఖాతాలోకి జమ చేయించుకున్నాడు. ఎన్నాళ్లయినా లాటరీ కి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి పశ్చిమబెంగాల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించాం... పలు ఆధారాలు సమీకరించుకుని పశ్చిమ బెంగాల్ వెళ్లి అతడిని అరెస్ట్ చేశాం.. అతడిపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 100కు పైగా ఫిర్యాదులు, 44 ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. నిందితుడు 57 ఫోన్లను ఉపయోగించినట్లు గుర్తించాం... అతడి, అతడి గ్యాంగ్ కు సంబంధించిన 23 బ్యాంకు ఖాతాలను జప్తు చేసి అందులో ఉన్న రూ.12 కోట్లు ఫ్రీజ్ చేయించాం" అని ఎస్పీ వెల్లడించారు. తదుపరి ఈ కేసును ఈడీ కి అప్పగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.