ETV Bharat / state

యువత రాజకీయాల్లోకి రాకపోతే.. దుర్మార్గులు రాజ్యమేలుతారు: నాగబాబు

author img

By

Published : Jan 12, 2023, 4:07 PM IST

NAGABABU ON YSRCP : వైసీపీ పతనాన్ని జనం కళ్లారా చూస్తారని జనసేన నేత నాగబాబు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న యువశక్తి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తక్కువ మంది యువతే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. యువత రాకపోతే రాజకీయాల్లోకి దుర్మార్గులు రాజ్యమేలుతారన్నారు.

NAGABABU ON YSRCP
NAGABABU ON YSRCP

NAGABABU ON YSRCP : తక్కువ మంది యువత మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారని జనసేన నేత, సినీనటుడు నాగబాబు అన్నారు. యువత రాకపోతే రాజకీయాల్లోకి దుర్మార్గులు వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తాళ్లవలస వద్ద నిర్వహించిన ‘యువశక్తి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జనసేన పార్టీ యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తోందని నాగబాబు చెప్పారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పని చేస్తానని చెప్పారు. వైసీపీ నేతలు, సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజం అన్నట్లుగా అధికార పార్టీ నేతల వ్యవహారశైలి ఉందన్నారు. వైసీపీ పతనాన్ని త్వరలోనే మనమంతా కళ్లారా చూస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వ పతనాన్ని త్వరలోనే కళ్లారా చూస్తాం

యువశక్తి వేదిక ద్వారా పవన్​ భరోసా: రాష్ట్రంలో.. ఎన్నడూ లేనంతగా యువశక్తి నిర్వీర్యమవుతున్న దుస్థితి.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. మాట్లాడనున్నారు. తొలుత 100 మంది యువతీ యువకుల సమస్యలు, సూచనలను బహిరంగ సభ ద్వారా వినిపించనున్నారు. ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరిపై ప్రశ్నిస్తున్న యువతపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న జనసేన నాయకులు.. అలాంటివారికి యువశక్తి సభ వేదికగా పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇవ్వనున్నారని తెలిపారు. జనసేన నిర్వహిస్తున్న యువశక్తి సభకు వివేకానందా వికాస వేదికగా నామకరణం చేెశారు.

యువశక్తి సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు: మరోవైపు ఈ సభకు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసైనికులు, పవన్‌ అభిమానులు, యువత భారీగా తరలివస్తున్నారు. దీంతో సభా ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. అయితే మరోవైపు జీవో నెం 1 తర్వాత పోలీసు అధికారుల పర్మిషన్​ అనంతరం దీనిని నిర్వహిస్తున్నారు. అయితే దీనిని 3000 వేల ఎకరాలు ప్రదేశంలో నిర్వహిస్తున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. తోపులాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

యువశక్తి సభ వద్ద తోపులాట: రణస్థలంలో జనసేన యువశక్తి సభ వద్ద తోపులాట జరిగింది. రణస్థలం యువశక్తి సభా ప్రాంగణానికి పవన్‌ కల్యాణ్‌ చేరుకోవడంతో.. బారికేడ్లు తోసుకుని వచ్చేందుకు జనసైనికులు యత్నించారు. జనసేన కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో కార్యకర్తపై ఓ ఎస్‌ఐ దాడి చేయడంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై తిరగబడ్డారు. ఎస్సై దాడిలో జనసేన కార్యకర్త చైతన్యకు గాయాలు కాగా, అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.