ETV Bharat / state

విద్యార్థులు మెచ్చిన ఉత్తమ టీచర్.. ఈ ఉమా.. సైన్స్ గురు!

author img

By

Published : Mar 4, 2023, 9:25 PM IST

Updated : Mar 4, 2023, 10:32 PM IST

Etv Bharat
Etv Bharat

Biology Teacher : పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాకుండా.. ప్రయోగాత్మకంగా ప్రతి పాఠ్యాంశాన్ని విద్యార్థులకు అర్థమయ్యోలాగా బోధించటం ఆ ఉపాధ్యాయురాలి ప్రత్యేకత. జిల్లా, రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో ఎక్కడ వైజ్ఞానిక ప్రదర్శనలు జరిగినా విద్యార్థులను పాల్గొనెందుకు ఆమె ప్రొత్సహిస్తున్నారు. బోధన మాత్రమే తన వృత్తి అని ఏనాడు భావించకుండా.. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Vizianagaram Biology Teacher : విద్యార్థులకు బట్టీ చదువులు నేర్పించకుండా ప్రతీ అంశానికి సంబంధించిన వాటిని ప్రదర్శిస్తూ పాఠాలు బోధిస్తోంది ఆ ఉపాధ్యాయురాలు. విజయనగరం జిల్లాలోని రేగిడి ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్న ఉమామాహేశ్వరి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులకు వినూత్నంగా పాఠాలు బోధిస్తోంది. ఆమె చేస్తున్న వినూత్న బోధన, సామాజిక సేవా కార్యక్రమాలకు పలు జాతీయ స్థాయి అవార్ఢులు ఆమె సొంతమయ్యాయి.

రెండున్నర దశాబ్ధలుగా.. ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న బూరవిల్లి ఉమామహేశ్వరి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. ఆమె భర్త కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఆమె తండ్రి త్రినాథరావు విశాఖపట్టణానికి డిప్యూటీ కలెక్టర్​గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. చిన్ననాటి నుంచి ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి ఉండటంతో.. 1998లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించారు. అంతటితో సంతృప్తి చెందక 2001 సంవత్సరంలో డీఎస్సీ రాసి స్కూల్​ అసిస్టెంట్​గా విధులలో చేరారు.

రేగిడిలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా : గత ఐదు సంవత్సరాలుగా రేగిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. ఆమె జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె బోధించే పాఠాలు అంటే ఎంతో ఇష్టమని విద్యార్థులు అంటున్నారు. పుస్తకాలలో ఉన్న ప్రతి అంశాన్ని.. ప్రయోగాల రూపంలో చేసి చూపిస్తూ, నమూనాలతో వివరిస్తూ బోధించటం ఆమె ప్రత్యేకత. అంతేకాకుండా ఆమె పాఠశాల విద్యార్థుల కోసం రెండు సంవత్సరాల క్రితం.. "ఉమా సైన్స్ గురు" అనే యూ ట్యూబ్ ఛానల్​ను ఆమె ప్రారంభించారు. ఇందులో పాఠశాల విద్యార్థులకు సంబంధించి సైన్స్​ తరగతులను బోధిస్తోంది. పాఠ్యంశాలకు సంబంధించిన అంశాలే కాకుండా.. విజ్ఞానానికి సంబంధించిన వీడియోలను అందులో నిక్షిప్తం చేస్తున్నారు. అందుకే విద్యార్థులు ప్రేమగా.. ఆమెను ఉమా సైన్స్ గురు అని పిలుస్తున్నారు.

వైజ్ఞానిక ప్రదర్శన ఎక్కడైనా : విద్యార్థుల చేత ప్రేమగా పిలిపించుకుంటున్నా ఆ టీచర్​ వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయని తెలిస్తే చాలు.. విద్యార్థులను ప్రొత్సహిస్తున్నారు. వారితోపాటు ఆమె వెళ్లి పలు వైజ్ఞానిక ప్రదర్శనలు, సెమినార్లు, పోస్టర్ ప్రజంటేషన్లను ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె సూచనల మేరకు రూపొదించిన ప్రాజెక్టులలో 5 జాతీయ స్థాయిలో, 15 రాష్ట్ర స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అంతేకాకుండా వీవీఎం కౌశల్ పోస్టర్ ప్రజంటేషన్​లో 2020, 2021 సంవత్సరాలలో జిల్లా స్థాయి ప్రథమ, 2019లో ద్వితీయ స్థానాలకు రేగడి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.

ఉపాధ్యాయురాలిగా పలు సామాజిక కార్యక్రమాలు : ఆమె విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయురాలిగా సమాజానికి తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాల విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ట్రేలతో.. మొక్కలకు కుండీలు రూపొందించారు. ఒకసారి వినియోగానికే అవకాశమున్న ఈ ట్రేలను అట్టతో తయారు చేస్తారు. వాటిని గుజ్జుగా చేసి కుండీల అకృతి తీసుకు వచ్చి పునర్వినియోగంలోకి తీసుకువచ్చారు. దీనివల్ల నర్సరిల్లో మొక్కలు పెంచటానికి కవర్లను వినియోగించకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆమె అంటున్నారు. ఈ ప్రయోగం 2020లో విజయనగరంలో నిర్వహించిన ఇన్​స్పైర్ ప్రదర్శనలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. ఫాస్ట్​ఫుడ్ సెంటర్లు, పానీపూరీ బండ్ల వద్ద వినియోగించే థర్మల్​ కప్పుల వినియోగాన్ని తగ్గించేందుకు.. చిరుధాన్యాల పిండి, గోధుమపిండి కలిపి చెంచాలు, కప్పులు, చిన్న గిన్నెలు తయారు చేశారు. వీటిని వినియోగించిన తర్వాత పడేయకుండా తినటానికి అవకాశం ఉంటుందని ఆమె అంటున్నారు. ఇటీవల చిన్న పిల్లల్లో వస్తున్న తెల్లజుట్టు నివారణకు.. ప్రకృతి సిద్ధంగా దొరికే వనరులతో నేచురల్ హెయిర్ డైను తయారు చేశారు. దీనికి పేటెంట్​ దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.

దేశ స్థాయిలో ప్రదర్శనలు : విజ్ఞాన, పర్యావరణ హితమైనవే కాకుండా.. రైతులకు మేలు చేయాలని పరికరాలను రూపొందించారు. వ్యవసాయంలో కూలీల సమస్యను అధిగమించేందుకు ఫార్మర్ ఫ్రెండ్లీ మిషన్​ను తయారు చేయించారు. ఇది గత సంవత్సరంలో విద్యార్థులు ఆమె మార్గదర్శకాలతో రూపొదించగా.. జాతీయ స్థాయి ఇన్​స్పైర్ సైన్స్​కు ఎంపికైంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో ప్రదర్శించగా అందరి మన్ననలు అందుకుంది. విత్తనాలు ఎరువులు, పురుగుల మందులు చల్లడం, ధాన్యాన్ని బస్తాల్లో నింపటం, ఇతర ప్రాంతాలకు తరలించటం వంటి పనులను.. ఈ యంత్రంతో సులభంగా చేయవచ్చని ఆమె తెలిపారు.

విద్యార్థులకు బోధన, వైజ్ఞానిక ప్రదర్శనలు, పర్యావరణ హితమైన కార్యక్రమాలతో.. ముందుకు వెళ్తున్న ఈ ఉపాధ్యాయురాల్ని పలు జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. భిన్న రీతిలో భోదన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న.. ఈ జీవశాస్త్ర టీచర్​కు 2022 సంవత్సరంలో విక్రమ్‌ సారాభాయ్‌ టీచర్‌ సైంటిస్ట్‌ అవార్డు లభించింది. ఈ అవార్డు తనకు రావటం తన భాద్యతను మరింత పెంచిందని ఆమె అంటోంది.

విద్యార్థులు మెచ్చిన ఉత్తమ టీచర్.. ఈ ఉమా.. సైన్స్ గురు!

ఇవీ చదవండి :

Last Updated :Mar 4, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.