ETV Bharat / state

బెడిసికొట్టిన ప్రభుత్వ "స్మార్ట్​ మీటర్ల " దోపిడీ..

author img

By

Published : Dec 22, 2022, 7:13 AM IST

Updated : Dec 22, 2022, 9:56 AM IST

Smart Meters Scam : రాష్ట్రంలో స్మార్ట్‌మీటర్ల కుంభకోణం త్రుటిలో తప్పింది. అంచనాలు భారీగా పెంచేసి, అస్మదీయుల సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు పన్నిన పన్నాగం ఫలించలేదు. ఇతర రాష్ట్రాల కంటే రెండు మూడు రెట్ల అధిక ధరలతో అడ్డంగా దోచేయాలన్న ప్రయత్నం ఆఖర్లో బెడిసికొట్టింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో నెలన్నర క్రితం టెండర్లను రద్దు చేశారు.

Smart Meters
స్మార్ట్‌మీటర్లు

Smart Meters Scam : వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌మీటర్ల పేరుతో భారీ దోపిడీకి వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది. అధికారికంగా అంచనాలు పెంచేసి రూ.6వేల 480 కోట్ల భారీ కాంట్రాక్టులో సుమారు 85 శాతం వైఎస్సార్ జిల్లాకు చెందిన అస్మదీయుల కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. భారీగా పెంచిన అంచనాల ప్రకారం టెండర్లు పిలిచేసి, కాంట్రాక్టు కట్టబెట్టడమే తరువాయి అనుకున్న సమయంలో.. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీని వల్ల అక్టోబర్ చివరి వారంలో స్మార్ట్ మీటర్ల టెండర్లు రద్దయ్యాయి. డిస్కంల వైఖరిని, టెండర్ల ప్రక్రియలోని లోపాలను ఎండగడుతూ, తీవ్రంగా అభిశంసిస్తూ.. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వరుసగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లేఖలు రాశారు. ఆ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

షిర్డీసాయి సంస్థకు అనుకూలంగా ధరలు, టెండర్ నిబంధనల తయారీకి.. డిస్కంలు గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించాయి. శ్రీకాకుళం జిల్లాలో అమలుచేసిన పైలట్‌ ప్రాజెక్టు అనుభవాలు, ఇతర రాష్ట్రాల్లో గృహ వినియోగానికి స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు అనుసరిస్తున్న విధానాల్లోంచి... తమకు అనుకూలమైన వాటినే తీసుకున్నాయి. వాటిని కారణాలుగా చూపుతూ మీటర్లు, అనుబంధ పరికరాల ధరలు, నిర్వహణ వ్యయాల్ని భారీగా పెంచేశాయి. డిస్కంలు రూపొందించిన అంచనా వ్యయాల ఆధారంగా.. షిర్డీసాయితో పాటు బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలు భారీ ధరల్ని కోట్‌ చేశాయి.

షిర్డీసాయి సంస్థ సూచనల మేరకు హైబ్రిడ్‌ పద్ధతి: డిస్కంలు మొదట సిద్ధం చేసిన టెండర్‌ నిబంధనల ప్రకారం మీటర్ల అమరిక, నిర్వహణ పూర్తిగా ఆపరేషన్‌ ఎక్స్‌పెండిచర్ విధానంలో జరగాలి. మొత్తం వ్యయాన్ని గుత్తేదారులే భరించాలి. కానీ షిర్డీసాయి సంస్థ సూచనల మేరకు డిస్కంలు దాన్ని హైబ్రిడ్‌ పద్ధతిలోకి మార్చేశాయి. మొత్తం 6వేల 480 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో 2వేల 841.46 కోట్ల నిర్వహణ వ్యయాన్ని గుత్తేదారు సంస్థలు పెట్టుబడిగా పెడతాయి. అవి చేసిన ఖర్చును ఆ తర్వాత డిస్కంలు చెల్లిస్తాయి. కానీ మీటర్ల అమరిక, అనుబంధ పరికరాలకయ్యే 3వేల 638.75 కోట్లను.. నిర్వహణ వ్యయం కింద ముందుగానే డిస్కంలు గుత్తేదారు సంస్థలకు చెల్లిస్తాయి.

అక్కడ నెలకు రూ.200.. మరి ఇక్కడ: మహారాష్ట్రలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు ఒక్కో వినియోగదారుడిపై నెలకు 200 రూపాయల 96 పైసలు చొప్పున వెచ్చిస్తున్నారని, మన రాష్ట్రంలో గుత్తేదారు సంస్థలు 257 చొప్పున కోట్‌ చేశాయని.. ఇంధనశాఖకు పంపిన నివేదికలో డిస్కంలు పేర్కొన్నాయి. దాన్ని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి తన లేఖలో తప్పుబట్టారు. మహారాష్ట్రలో మీటర్ల అమరిక, నిర్వహణకయ్యే మొత్తం వ్యయం ఒక్కో మీటర్‌కు నెలకు 200.96 రూపాయలుగా ఉంటే.. మన దగ్గర 2వేల 841.46 కోట్ల నిర్వహణ వ్యయం గురించే ప్రస్తావిస్తూ ఒక్కో మీటర్‌కు నెలకు 257 రూపాయలు ఖర్చవుతున్నట్టు డిస్కంలు పేర్కొన్నాయని గుర్తుచేశారు.

మీటర్లు, అనుబంధ పరికరాలకయ్యే 3వేల 638.75 కోట్లను అందులో కలపని విషయాన్ని ప్రస్తావించారు. ఈ మొత్తాన్ని కలిపి లెక్కిస్తే నెలకు ఒక్కో మీటరుకు 581.16 రూపాయలు ఖర్చవుతుంది. దేశంలో మిగతాచోట్లా లక్షల స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేశారంటున్న డిస్కంలు.. ధరల్ని పోల్చడానికి మహారాష్ట్ర వివరాల్నే తీసుకున్నాయి. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలతోనూ పోల్చిచూడాలని... మన ధరల కంటే అక్కడ చాలా తక్కువగా ఉన్నాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తన లేఖల్లో వివరించారు.

అనుబంధ పరికరాల ధరలు 20రెట్లు అధికం: డిస్కంలు ఒక్కో మీటర్‌కు సగటున 19వేల 500 చొప్పున కోట్‌ చేశాయి. మీటర్‌ ధరను 7వేలు, అనుబంధ పరికరాలను 12 వేల చొప్పున కోట్‌ చేశాయి. ఇతర రాష్ట్రాల్లో ఒక్కో త్రీఫేజ్‌ స్మార్ట్‌మీటర్‌కు 3వేల 500 నుంచి 4వేలు ఖర్చవుతోంది. కేంద్ర విద్యుత్‌ సంస్థ మీటర్ ధరను 6వేలుగా పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా పైలట్‌ ప్రాజెక్టులో ఒక్కో మీటరుకు అనుబంధ పరికరాలకు 615.2 రూపాయల చొప్పున ఖర్చయితే.. స్మార్ట్‌ మీటర్‌కు గుత్తేదారు సంస్థలు 20 రెట్లు ఎక్కువగా 12 వేలకు పైగానే కోట్‌ చేశాయి.

స్మార్ట్​ మీటర్లలో ఎక్కువ ఫీచర్లు.. కానీ అంత భారీ ధరలా?: శ్రీకాకుళం జిల్లాలో అమర్చిన ఐఆర్​డీ మీటర్ల కంటే స్మార్ట్‌ మీటర్లలో కొన్ని ఎక్కువ ఫీచర్లు ఉన్నంత మాత్రాన, వాటికి మరీ అంత భారీ ధరలా అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. గుత్తేదారు సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు స్మార్ట్‌మీటర్లకు అవసరమయ్యే అనుబంధ పరికరాల జాబితాను డిస్కంలు భారీగా పెంచేశాయి. అవసరానికి మించిన ‘స్పెసిఫికేషన్ల’నూ చేర్చాయి. దీనిపైనా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అనుబంధ పరికరాల్లో ఎక్కువ శాతం మోటార్లకు రక్షణ కల్పించేందుకు ఉపయోగించనున్నట్టు కనిపిస్తోందని.. జీవో నెంబర్‌ 22 ప్రకారం వ్యవసాయ మోటార్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత డిస్కంలది కాదన్నారు. అదంతా రైతులు చూసుకుంటారని స్పష్టంచేశారు.

అప్పటి అంచనాల ప్రకారం టెండర్లు: కొవిడ్‌ సమయంలో విపరీతంగా పెరిగిన ముడిపదార్థాల ధరలు ఇప్పుడు తగ్గడంతో... మీటర్లు, అనుబంధ పరికరాల ధరలు కూడా దిగొచ్చాయి. కానీ డిస్కంలు మాత్రం ధరలు భారీగా పెరిగిన సమయంలో.. 2022 ఏప్రిల్‌ నాటి అంచనాల ప్రకారం టెండర్లు పిలిచాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో రాగి 27శాతం, అల్యూమినియం 36శాతం, ఉక్కు 26శాతం మేర ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా ధరలు మరింత తగ్గే అవకాశముంది. డిస్కంలు అప్పటి ధరలకు టెండర్లు ఖరారు చేసి ఉంటే... గుత్తేదారు సంస్థలు అడ్డగోలుగా లాభపడేవి. ఐఆర్​డీ మీటర్ల కంటే స్మార్ట్‌ మీటర్లే మెరుగైనవని చెప్పేందుకు ప్రభుత్వం అర్థరహితమైన వాదన వినిపించింది. స్మార్ట్‌మీటర్ల కంటే ఐఆర్​డీ మీటర్లకే ఎక్కువ ఖర్చవుతుందని గుత్తేదారు సంస్థలు చెప్పాయి.

మొదటి సంవత్సరంలోనే 20శాతం కాలిపోయిన ఐఆర్​డీ మీటర్లు: శ్రీకాకుళం జిల్లా పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఐఆర్​డీ మీటర్లు అమరిస్తే... వాటిలో 20శాతం మొదటి సంవత్సరంలోనే కాలిపోయినట్లు తెలిపాయి. ఆ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా లక్షల మీటర్లు కాలిపోతాయంటూ.. సమస్యను భూతద్దంలో చూపించాయి. ఐఆర్​డీ మీటర్లే కాలిపోతే, వాటికంటే సున్నితంగా ఉండే స్మార్ట్‌మీటర్లు కాలిపోవా అన్నదానికి డిస్కంల నుంచి సమాధానం లేదు. పైలట్‌ ప్రాజెక్టులో ఒక్కో ఐఆర్​డీ మీటర్‌కు 19వందల 68.1 రూపాయలు ఖర్చయితే 2వేల 500 అయినట్టుగా, అనుబంధ పరికరాల కోసం ఒక్కో మీటర్‌కు 615.15 రూపాయలు ఖర్చయితే 2వేల 500 అయినట్టు డిస్కంలు అంచనాల్లో చూపించాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. టోకున కొంటే ధర తగ్గుతుంది కానీ, ఎలా పెరుగుతుందో అర్థం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

మీటర్ల జీవితకాలాన్ని డిస్కంలు ఎలా నిర్ణయిస్తాయి: పైలట్‌ ప్రాజెక్టు కంటే ఎక్కువ వ్యయంతో మరింత మెరుగైన అనుబంధ పరికరాల్ని అమర్చుతున్నట్టు డిస్కంలు చెబుతున్నాయని.. అలాంటప్పుడు ఐఆర్​డీ మీటర్లకు మరింత రక్షణ లభించి కాలిపోయే శాతం తగ్గాలి కదా అని ప్రశ్నించారు. ఐఆర్​డీ మీటర్ల జీవితకాలాన్ని ఐదేళ్లుగా, స్మార్ట్‌మీటర్ల జీవితకాలాన్ని పదేళ్లుగా డిస్కంలు ఎలా నిర్ణయించాయని ప్రశ్నలు సంధించారు. కేంద్ర విద్యుత్‌ సంస్థ, కేంద్ర విద్యుత్‌శాఖ, రాష్ట్ర లేదా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థల మార్గదర్శకాల్ని పరిగణనలోకి తీసుకోకుండా.. డిస్కంలు ఆ నిర్ణయానికి ఎలా వచ్చాయని నిలదీశారు. ఐఆర్​డీ మీటర్ల కంటే గుత్తేదారు సంస్థలు కోట్‌ చేసిన స్మార్ట్‌మీటర్ల ధర 8 రెట్లు ఎక్కువని తెలిపారు.

ఫీడర్‌ స్థాయిలో సరిపోయేదానికి... మోటార్లకు ఎందుకు?: కేంద్ర సౌర విద్యుత్‌ సంస్థ - సెకితో చేసుకున్న 7వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం.. ఆ కరెంట్‌ను వ్యవసాయానికి సరఫరా చేయాలంటే మోటార్లకు మీటర్లు ఏర్పాటుచేయాలని డిస్కంలు చెబుతున్నాయి. సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలే పెద్ద కుంభకోణమన్న ఆరోపణలు ఉండగా.. ఆ పేరు చెప్పి మోటార్లకు స్మార్ట్‌మీటర్లు అమర్చడం మరో భారీ స్కామ్ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఫీడర్‌ సప్లయ్‌ పాయింట్ వద్ద విద్యుత్ సరఫరా ఎంతో లెక్కిస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా ప్రతి మోటారుకూ మీటర్ అక్కర్లేదని ప్రత్యేక ప్రధానకార్యదర్శి లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం గృహ వినియోగదారులకే స్మార్ట్‌మీటర్లు పెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న 18.58 లక్షల వ్యవసాయ మీటర్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు మొదట పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలి. అది ఫలిస్తే క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకయ్యే ఖర్చును, రాయితీల్లో జరుగుతున్న లీకేజిల్ని అరికట్టడం ద్వారా నాలుగేళ్లలోనే తిరిగి రాబట్టవచ్చని డిస్కంలు చెబుతున్నాయని.. కానీ అది అసాధ్యమని స్పష్టంచేశారు. మీటర్ల కొనుగోలు వ్యయంపై గుత్తేదారులు వడ్డీని 10.5శాతంగా పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలు తీసుకుంటున్న రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ కంటే అది చాలా ఎక్కువ.

బెడిసికొట్టిన ప్రభుత్వ "స్మార్ట్​ మీటర్ల " దోపిడీ..

ఇవీ చదవండి:

Last Updated :Dec 22, 2022, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.