ETV Bharat / state

వైసీపీ నేతల వేధింపులతో.. పరిశ్రమలు పరార్..

author img

By

Published : Dec 3, 2022, 9:34 AM IST

Updated : Dec 3, 2022, 11:40 AM IST

industries left
తరలిపోతున్న పరిశ్రమలు

Industries Left Due to The Harassment Of The YCP Leaders: తెలుగుదేశం నేతలకు సంబంధించిన పరిశ్రమలనే కాదు..గత ప్రభుత్వ హయాంలో వచ్చిన దిగ్గజ సంస్థలపైనా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రతాపం చూపారు. వాటిని రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న సింగపూర్ కన్సార్షియం దగ్గర నుంచి మొదలు..లులూ, అదానీ, టెంపుల్టన్‌..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంస్థలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. వెళ్లగొట్టిన వాటి జాబితా మాత్రం చాంతాండంత ఉంది.

Industries Left Due to The Harassment Of The YCP Leaders: కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు..ఆదాయ మార్గాలను పెంచుకుని..రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తారు. కానీ సీఎం జగన్ రూటే వేరు..కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా..ఉన్న వాటిని రాష్ట్రం నుంచి తరిమేశారు. అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి పనులు ఆపేశారు. రాజధానిలో స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న సింగపూర్‌ కన్సార్షియంని తరిమికొట్టారు. విశాఖలో లులూకి పొగబెట్టారు.. అదానీని బెదరగొట్టారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ని పో పొమ్మని పంపేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో కియాపై కన్నెర్ర చేశారు. జాకీని మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు రిలయన్స్‌నీ వెళ్లగొట్టారు. ఇక్కడి పరిస్థితులకు భయపడి కొన్ని పరిశ్రమలు వెళ్లిపోతుంటే..అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దాష్టీకాలను తట్టుకోలేక మరికొన్ని పరిశ్రమలు పారిపోతున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అదానీకి ఝలక్‌ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో 70వేల కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో మూడు చోట్ల 400 ఎకరాల్ని కేటాయించగా..20 ఏళ్లలో పెట్టుబడి పెడితే, ఇప్పుడు భూములివ్వడమేంటని వైసీపీ ప్రభుత్వం కుదరదు పొమ్మంది. దాంతో అదానీ సంస్థ 70 వేలకోట్ల ప్రతిపాదన విరమించుకుని 3వేల కోట్లు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ ఏర్పాటుకు 2వేల 200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు యూఏఈ సంస్థ లులూ ముందుకు వచ్చింది. విశాఖ బీచ్‌రోడ్డులో దీనికి 13.83 ఎకరాల్ని గత ప్రభుత్వం కేటాయించగా..వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. ప్రభుత్వ వేధింపులు తాళలేక లులూ సంస్థ తమిళనాడుకు తరలిపోయింది. అక్కడ 3వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థ విశాఖలో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ క్యాంపస్‌కు ముందుకొచ్చింది. 2,500 మందికి అత్యున్నతస్థాయి ఐటీ ఉద్యోగాలు కల్పించడమే గాక..70 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడతామని ఒప్పందం కుదుర్చుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిందే తడవు..ఆ సంస్థకూ పొగబెట్టింది..

వెనకబడిన అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద 129 కోట్లతో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాగా..గత ప్రభుత్వం 27 ఎకరాలు కేటాయించింది. స్థానిక ప్రజాప్రతినిధి ముడుపుల కోసం వేధిస్తుండటంతో మీకో దణ్ణం అంటూ భూమలు వెనక్కి ఇచ్చేసింది. అమెరికాకు చెందిన ట్రైటాన్‌ సంస్థ 727 కోట్లతో విశాఖ, చిత్తూరుల్లో సోలార్‌ బ్యాటరీ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాగా....వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. దీంతో ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

తిరుపతి సమీపంలో 15 వేల కోట్లతో రిలయన్స్.. ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వివాదస్పద భూములు కేటాయించడంతో యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదనను రిలయన్స్ విరమించుకుంది. అలాగే ప్రకాశం జిల్లాలో 24వేల కోట్లతో ఏషియన్ పల్ప్‌ అండ్ పేపర్‌ మిల్స్..కాగిత పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాగా, వైసీపీ ప్రభుత్వంలో ప్రతికూల పరిస్థితులతో వెనకడుగు వేసింది.

చిత్తూరు జిల్లాలో 300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు బెస్ట్‌ బ్యాటరీ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసినా..ఆ తర్వాత తెలంగాణకు వెళ్లిపోయింది. గత ప్రభుత్వ చొరవతో సత్యసాయి జిల్లా పెనుకొండలో 10వేల 500 కోట్లతో కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీనికి అనుబంధంగా 5వేల కోట్ల పెట్టుబడులతో అనుబంధ యూనిట్లు రావాల్లి ఉన్నా..స్థానిక ఎంపీ బెదిరింపులు, ఎదురైన చేదు అనుభవాలతో వెనక్కి తగ్గారు.

వైసీపీ నేతల వేధింపులతో రాష్ట్రంలో పరిశ్రమలు పరార్

ఇవీ చదవండి:

Last Updated :Dec 3, 2022, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.