ETV Bharat / state

దిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ ఛార్జిషీట్‌లో కవిత, మాగుంట, శరత్‌రెడ్డిల పేర్లు

author img

By

Published : Dec 21, 2022, 10:05 AM IST

Delhi Liquor Scam
దిల్లీ మద్యం కుంభకోణం

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసిన సమీర్‌ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3,000 పేజీల ఛార్జిషీట్‌లో ఈడీ అనేక అంశాలు పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ్‌ రెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లైల పేర్లు ప్రముఖంగా ప్రస్తావించింది. రూ.10,000 కోట్ల ఆదాయం ఉన్న మద్యం వ్యాపారాన్ని చేజిక్కుంచుకోవడం కోసం రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఛార్ఙిషీట్‌లో పేర్కొంది. గత నెల 26న దాఖలు చేసిన 3,000పేజీల ఛార్జిషీట్​లో పొందుపరిచిన వివరాలతో కూడిని ప్రాసిక్యూషన్‌ కంప్లైంట్‌ కాపీని కోర్టుకు అందించింది. ఇది తాజాగా బయటికి రావడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిల పేర్లు ప్రస్తావించింది. వీరితోపాటు ఈ మొత్తం వ్యవహారంలో అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై పోషించిన పాత్రల గురించి పేర్కొంది. మద్యం కుంభకోణంలో దర్యాప్తులో భాగంగా.. అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3,000పేజీల ఛార్జిషీట్‌లో అనేక విషయాల వెల్లడించింది.

దిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ ఛార్జిషీట్‌లో కవిత, మాగుంట, శరత్‌రెడ్డిల పేర్లు

స్టేట్​మెంట్ల ఆధారంగా ఈడీ ఛార్జిషీట్: ఇప్పటివరకు అరెస్ట్ అయిన సమీర్‌ మహేంద్రు, పి. శరత్ చంద్రారెడ్డి, బినయ్‌ బాబు, విజయ్‌ నాయర్, అభిషేక్‌ బోయినపల్లి ద్వారా తీసుకున్న స్టేట్​మెంట్ల ఆధారంగా ఈడీ ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మాగుంట రాఘవ్‌ రెడ్డి, కవితలు అసలు భాగస్వామిగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థ 14,05,58,890 బాటిళ్ల మద్యం విక్రయించి.. రూ.1,028 కోట్లు సంపాదించినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది.

రూ.100 కోట్ల ముడుపులు: మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్‌ రెడ్డి, శరత్​రెడ్డి, కె. కవిత నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్.. రూ.100 కోట్ల ముడుపులను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల కోసం విజయ్‌ నాయర్‌కు ఇచ్చినట్లు పేర్కొంది. సౌత్ గ్రూప్ - ఆప్‌ నేతల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ముడుపులను ముందస్తుగా చెల్లించినట్లు తెలిపింది. అందుకు ప్రతిఫలంగా సౌత్ గ్రూపునకు అవాంఛిత ప్రయోజనాలు కల్పించినట్లు పేర్కొంది. ముడుపుల రూపంలో ఇచ్చిన రూ.100 కోట్లు రాబట్టుకునేందుకు వీలుగా.. ఇండో స్పిరిట్‌ సంస్థలో 65 శాతం వాటాను సౌత్ గ్రూపుకు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.

కవిత ఇంట్లో సమావేశం: ఇండో స్పిరిట్స్‌లోని వాటాను సౌత్‌ గ్రూప్‌లోని పాత్రదారులైన అరుణ్‌ పిళ్లై, ప్రేమ్‌ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో నడిపినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో వివిధ పాత్రలున్న 36 మందికి చెందిన 170 మొబైల్‌ ఫోన్​లు ధ్వంసం చేసిన విషయాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఈ ఏడాది జనవరిలో కవితతో హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో సమీర్ సమావేశం అయ్యారని ఈడీ తెలిపింది. ఈ సమావేశంలో సమీర్​తోపాటు, శరత్ చంద్రారెడ్డి, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, కవిత, ఆమె భర్త అనిల్‌ కూడా ఉన్నట్లు పేర్కొంది.

రూ.10,000 కోట్ల ఆదాయం: ఈ సందర్భంగా కవిత.. అరుణ్‌ పిళ్లై తమ కుటుంబ సభ్యుడు లాంటివారని.. ఆయనతో వ్యాపారం చేయడం అంటే తనతో వ్యాపారం చేయడమేనని హామీ ఇచ్చినట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.10,000 కోట్ల ఆదాయం ఉందని, అందువల్ల పెద్ద తలకాయలు కావాలని ఆప్ బినామీ అయిన విజయ్‌ నాయర్‌.. అరుణ్‌ పిళ్లైతో చెప్పినట్లు ఈడీ పేర్కొంది. ఇలా పెద్ద తలకాయల కోసం ఎదురు చూస్తున్న తరుణంలోనే శరత్‌ చంద్రారెడ్డి దిల్లీ మద్యం వ్యాపారం పట్ల ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో ఆయనే బుచ్చిబాబును ఆర్థికవనరులు, మార్కెటింగ్ విశ్లేషణ కోసం ఇందులోకి తీసుకొచ్చినట్లు ఈడీ పేర్కొంది.

ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం: ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. 3,000 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్‌ను నవంబరు 26న ఈడీ దాఖలు చేసింది. ఈ అంశంపై ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ మంగళవారం విచారణ చేపట్టారు. నిందితునిగా ఉన్న సమీర్‌ మహేంద్రు విచారణకు హాజరయ్యారు. ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన అనంతరం వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రత్యేక జడ్జి తెలిపారు. దీనిపై తమ అభిప్రాయాలను జనవరి ఐదో తేదీ లోపు చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న సమీర్‌ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం తయారీ, సరఫరా సంస్థలను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి ఐదో తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.