ETV Bharat / state

ప్రజలపై నిరంతరం నిఘా.. వాలంటీర్లు కాదు.. వైసీపీ వేగులు!

author img

By

Published : Dec 10, 2022, 9:31 AM IST

Updated : Dec 10, 2022, 10:09 AM IST

System of volunteers
వాలంటీర్ల వ్యవస్థ

System of volunteers working for YCP: రాష్ట్ర ప్రజలపై నిరంతరం అధికారిక నిఘా కొనసాగుతోంది. జగన్‌ సర్కార్‌ నియమించిన సుమారు 2.61 లక్షల మంది ‘గూఢచారులు’..ప్రజల కదలికల్ని నిరంతరం డేగకళ్లతో కనిపెడుతున్నారు. వారి ఆనుపానుల్ని ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చేరవేస్తున్నారు. వాళ్లెవరో కాదు..వాలంటీర్లు.! పేరుకే వాళ్లు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛంద సేవకులు. నిజానికి ఆ ముసుగులో పనిచేస్తున్న అధికార పార్టీ వేగులు.! వాళ్లంతా ప్రజల సొమ్మును జీతాలుగా స్వీకరిస్తూ.. వారి వివరాల్ని అధికార పార్టీకి అందిస్తున్న అసలు సిసలు వైసీపీ కార్యకర్తలు.

System of volunteers working for YCP: జగన్‌ ప్రభుత్వం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటిన వాలంటీర్‌ వ్యవస్థ.. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం వేళ్లూనుకుంది. వైసీపీ కోసం పెంచి పోషిస్తున్న ఈ సమాంతర వ్యవస్థ..ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారింది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన.. స్వేచ్ఛగా జీవించే హక్కుకి, భావ ప్రకటన స్వేచ్ఛకు పెను విఘాతంగా మారింది.

పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందేలా చూసేందుకే వాలంటీర్లను నియమించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే..వాలంటీర్ల నియామకం వెనుకున్న అసలు ఉద్దేశం వేరే..! వారు సేవ చేస్తోంది ప్రజలకు కాదు..అధికార పార్టీకే. వారు చేస్తోంది పూర్తిగా రాజకీయ కార్యకలాపాలే! ప్రజలపైనా, ప్రతిపక్షాలపైనా నిఘా పెట్టడం, వారి బలాల్ని, బలహీనతల్ని కూపీలాగి అధికార పార్టీకి చేరవేయడమే వారి ప్రధాన విధి.

ప్రభుత్వ వైఫల్యాలు, పథకాల అమలులో లోపాలపై పౌరులు ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే చుట్టూ ఒకసారి పరికించి చూసి, వాలంటీరు లేరని నిర్ధారించుకున్నాకే పెదవి విప్పుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రజల్ని అంతగా భయపెడుతోంది. సీఎం చెప్పిన ఈ మాటలు బయటి వాళ్లెవరైనా వింటే..వైసీపీ ప్రభుత్వం 2.61 లక్షల మంది మానవతామూర్తుల్ని తయారు చేసిందేమోనని భ్రమపడతారు. కానీ మంత్రి అంబటి రాంబాబు మాటల వింటే అసలు విషయం అర్థమవుతుంది.

విన్నారుగా..వాలంటీర్లు ఎవరో, ఎవరి కోసం పనిచేస్తున్నారో..! పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రతి వాలంటీరు తమకు కేటాయించిన కుటుంబాల్లో అర్హత ఉన్నవారిని గుర్తించి, ధ్రువీకరణ పత్రాలు సేకరించి ఓటర్లుగా నమోదు చేయించారు. ఎన్నికలప్పుడూ ప్రచారం చేయాలని వైసీపీ నుంచి వారికి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. పథకాలన్నీ జగనే ఇస్తున్నారని.. ప్రతి లబ్ధిదారునికి పదేపదే చెబుతున్నారు. మళ్లీ జగన్‌ సీఎం అయితేనే పథకాలన్నీ కొనసాగుతాయని ప్రచారం చేస్తున్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకుంటే..వచ్చే ప్రభుత్వం ఇళ్ల స్థలాల్ని రద్దు చేస్తుందని లబ్ధిదారుల్ని బెదిరిస్తున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు.. వాలంటీర్లతో ప్రత్యేక వ్యవస్థను నడుపుతున్నారు. క్రమం తప్పకుండా వారితో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ.. గ్రామాల వారీగా పార్టీల బలాబలాల వివరాలను సేకరిస్తున్నారు. ప్రైవేటుగా ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీకి సంబంధించిన మండల స్థాయి అధికారులు(ఎమ్‌ఎల్‌వో) క్రమం తప్పకుండా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ..ప్రజలు ఎవరైనా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారా? కారణాలేంటి? వారు ఏ పార్టీకి చెందినవారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు.

అసంతృప్తిగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడి, వ్యతిరేకతను పోగొట్టాలని పైనుంచి ఆదేశిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొనే ప్రభుత్వ సమావేశాలు, వైసీపీ సభలకు ప్రజల్ని తరలించే బాధ్యత వాలంటీర్లదే. హాజరవకపోతే పథకాలు రద్దవుతాయని ప్రజలను బెదిరిస్తున్నారు. వాళ్లే దగ్గరుండి వాహనాల్లోకి ఎక్కించి తీసుకెళుతున్నారు. అక్కడ హాజరును నమోదు చేస్తున్నారు.

నేతన్ననేస్తం, పింఛన్ల పంపిణీలో అర్హత ఉన్నవారికి కూడా.. కొన్నిచోట్ల వైసీపీ నేతల ఒత్తిడితో లబ్ధి చేకూరడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థికి ఓట్లేయలేదని మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ గ్రామంలో కొందరు లబ్ధిదారులకు కాపు, ఈబీసీ నేస్తం పథకాలు నిలిపేశారు.

ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వాలంటీర్లు పాల్గొనరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చినా కొన్నిచోట్ల ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను వారే చేపట్టారు. ఎన్నికలు ఏవైనా వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నుంచి, ఓటర్లకు డబ్బు పంపిణీ వరకు అన్నీ తామై చక్కబెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ నేతలు సమకూర్చిన వాహనాల్లో ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు శాసనసభా స్థానం ఉప ఎన్నికలోనూ వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు. కొన్నిచోట్ల వైసీపీ నేతల ఆదేశాల మేరకు కులాల వారీగా లబ్ధిదారుల జాబితాను వాలంటీర్లు సేకరించారు. ఏ సామాజికవర్గానికి ఏఏ పథకాలు అందాయి. ఎక్కువగా లబ్ధి పొందిన వర్గాలేవి? వంటి వివరాల్ని నమోదు చేశారు.

ప్రభుత్వం ఇటీవల వాలంటీర్ల ద్వారా ఎంప్లాయిమెంట్‌ సర్వే చేయించింది. వారికి కేటాయించిన కుటుంబాల్లో..అక్షరాస్యులెందరు? డిగ్రీ ఎక్కడ పూర్తి చేశారు? వృత్తిరీత్యా ఎక్కడ ఉంటున్నారు? ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారా? వారు ఏ రాజకీయ పార్టీ అంటే ఆసక్తి చూపిస్తున్నారనే వివరాలను సేకరించారు. అసలు ఎంప్లాయిమెంట్‌ సర్వేలో రాజకీయ ఆసక్తులను తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి.

వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల్ని వాలంటీర్లే నిర్ణయించడంపై ఈ ఏడాది ఏప్రిల్‌ 6న హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా మండిపడింది. వాలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టుకి వివరాలు సమర్పించేందుకు శ్రీకాకుళం నుంచి వస్తున్న ఒక కుటుంబానికి చెందినవారిని స్థానిక వాలంటీర్‌ నిర్బంధించడాన్ని హైకోర్టు ప్రస్తావించింది.

ఈ వ్యవస్థ మాఫియాలా మారిందని, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, వారిని నియంత్రించకుంటే వచ్చేఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకోలేరని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో వీరిని పార్టీ తరఫున వినియోగించుకునేందుకు సాంకేతిక సమస్యలు ఎదురు కావచ్చనే ఆందోళన వైసీపీ నేతల్లో మొదలైంది.

ఏదైనా బలమైన కారణంతో వాలంటీర్లు పార్టీ కోసం పనిచేయలేకపోతే తమ పాచిక పారదని భయపడుతున్నారు. వీరి అరాచకాలు పెచ్చుమీరడంతో వస్తున్న విమర్శలను కప్పిపుచ్చేందుకు, ఎన్నికల్లో వాడుకోవడానికి కొత్తగా గృహ సారథులను నియమించాలని సీఎం జగన్‌ సిద్ధమయ్యారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ తమకు ఇస్తున్న ఇంతటి ప్రాధాన్యాన్ని అడ్డుగా పెట్టుకునే కొందరు వాలంటీర్లు రెచ్చిపోతున్నారు.

అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని కొన్నిచోట్ల వాలంటీర్లు మోసాలకు పాల్పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు వంటి ఘోరమైన నేరాలకు తెగబడుతున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ నాల్గో డివిజన్‌లోని కట్టమంచిలో ఇళ్ల పట్టాలిప్పిస్తానని పేదల నుంచి ఒక వాలంటీర్‌ డబ్బులు వసూలు చేశారు.

విశాఖ గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన ఓ వితంతువుకి ఇవ్వాల్సిన పింఛన్‌ సొమ్ముని 11 నెలలపాటు వాలంటీర్‌ స్వాహా చేశాడు. ఆమె కుమారుడికి రైల్వేలో ఉద్యోగం రావడంతో పింఛన్‌ రాదని చెబుతూనే ప్రతినెలా ఇంటికొచ్చి ఆమెతో వేలిముద్ర తీసుకొని డబ్బు ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల పరిధిలోని వాలంటీర్‌ ఒక బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ఒక వాలంటీర్‌ అదే గ్రామానికి చెందిన ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అతనిపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం సునపర్తికి చెందిన ఎం.సన్యాసినాయుడు తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే వాలంటీర్‌ నరసింగరావు రూ.50 వేలు డిమాండ్‌ చేశాడు. డబ్బు ఇవ్వనందుకు..అదే స్థలాన్ని 1972లో వేరొకరికి సన్యాసినాయుడు విక్రయించినట్లు తప్పుడు దస్తావేజులు సృష్టించాడు. దాంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటికంభంపాడులో ఉపాధి హామీ పనులపై నిర్వహించిన గ్రామ సభలో అక్రమాలపై ప్రశ్నించిన సర్పంచి లావణ్యపై..స్థానిక వాలంటీర్‌ అనూష దాడికి ప్రయత్నించింది. తనకు రక్షణ కల్పించాలని సర్పంచి పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది.

రేషన్‌ సరకుల పంపిణీ సమాచారం తెలియజేయలేదన్నందుకు.. నెల్లూరు జిల్లా కోవూరులోని రాళ్లమిట్టలో వాలంటీర్‌ దివ్య ఒక వృద్ధురాలి తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మచిలీపట్నంలోని 11వ డివిజన్‌ వాలంటీర్‌ ఎం.కృష్ణను వారించేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుతగులుతున్నాడనే కారణంతో విజయనగరానికి చెందిన వాలంటీర్‌ బి.బ్రాహ్మాజీ ఈ ఏడాది అక్టోబరులో తన స్నేహితుడిని హత్య చేశాడు. రైలు ఢీకొని మృతి చెందినట్లుగా పోలీసుల్ని నమ్మించేందుకు ప్రయత్నించాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఫిబ్రవరి 2న జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందారు. వాలంటీర్‌ రాంబాబు అందులో క్రిమిసంహారక మందు కలపడంతోనే వారు చనిపోయారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుల్లో ఒకరి భార్యతో వాలంటీర్‌ సన్నిహితంగా ఉండేవాడు. విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియడంతో గొడవ జరిగింది. ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు క్రిమిసంహారిక ముందు కలిపిన జీలుగు కల్లును తాగించాడు. అదే కల్లుని మరో నలుగురూ తాగి చనిపోయారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం మేఘమాల గ్రామానికి చెందిన వాలంటీర్‌ రాజారావు నాటు సారా విక్రయిస్తూ 2022 జూన్‌లో పోలీసులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ముకుందవరంలో సారా తయారు చేస్తున్న వాలంటీర్‌ జి.రామదుర్గను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న కర్నూలు జిల్లా కప్పట్రాళ్లకి చెందిన వాలంటీర్‌ రాజశేఖర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నాటు తుపాకులు తయారు చేస్తున్న చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం చింతోపులో వాలంటీర్‌ రవిని పోలీసులు పట్టుకున్నారు.

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ 2019 అక్టోబరు 2న మొదలైంది. 2.61 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. వారికి వార్షిక అవార్డులు, మొబైల్‌ ఫోన్‌ ఛార్జీలు, సాక్షి దినపత్రిక కొనుక్కోవడానికిచ్చే నిధులు కలిపి.. మొత్తంగా ఏడాదికి 19వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

వైసీపీ వాలంటీర్ వ్యవస్థతో.. ప్రజలపై నిరంతరం నిఘా

ఇవీ చదవండి:

Last Updated :Dec 10, 2022, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.