ఏపీలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు - వైసీపీ కుంభకోణాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి : పురందేశ్వరి
Published: Nov 17, 2023, 5:21 PM


ఏపీలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు - వైసీపీ కుంభకోణాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి : పురందేశ్వరి
Published: Nov 17, 2023, 5:21 PM

Purandeshwari Comments on YSRCP Govt: ఏపీలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. నెల్లూరులో పర్యటించిన ఆమె.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్రం నిధులతోనే చేసిందన్నారు. రాష్ట్రంలోని గతుకుల రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని వ్యాఖ్యానించారు.
Purandeshwari Comments on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్లో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆమె పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పురందేశ్వరి వెల్లడించారు.
Purandeshwari Inspected Nellore Railway Station Works: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికైన తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నెల్లూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమెకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 103 కోట్ల రూపాయలతో నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సాగుతున్నాయని పురందేశ్వరి తెలిపారు. పనులు పూర్తయితే, అన్ని సౌకర్యాలతో సుందరమైన రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ పనులన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాగుతున్నాయని ఆమె గుర్తు చేశారు.
Purandeshwari Comments: నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో గుంతలమయమైన రహదారులే ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు గ్రామాల్లో ఎక్కడ చూసిన కరవు పరిస్థితులు, ఎండిన పంటలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే. జగన్ పాలనలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థపడుతున్నారు. రాష్ట్ర రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోంది. గతకొన్ని నెలలుగా ఈ రాష్ట్రంలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయి. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వట్లేదు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయి. ఏపీలో కుంభకోణాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది.'' అని ఆమె అన్నారు.
Purandeshwari on Central Govt Funds: ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం.. కక్షపూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని.. పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే.. ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందన్న ఆమె.. వైసీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా, తమ ప్రభుత్వమే సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని ఆమె దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రం అందిస్తోన్న సహాయ సహకారాలను ప్రజలకు వివరించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించి.. రైతులను ఆదుకోవాలన్నారు.
