ETV Bharat / state

Byreddy fire on CM Jagan: జగన్ సీఎం అయిన తర్వాత.. రాయలసీమకు మరింత అన్యాయం: బైరెడ్డి

author img

By

Published : Jul 3, 2023, 6:57 PM IST

Etv Bharat
Etv Bharat

Byreddy Rajasekhar Reddy latest comments : జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే.. రాయలసీమకు అత్యంత అన్యాయం జరిగిందని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా కోసం, ఈనెల 28న చలో దిల్లీ చేపడుతున్నట్లు చెప్పారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేయించుకున్న జగన్.. సీమకు ఏం చేశారో చెప్పాలని బైరెడ్డి నిలదీశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ వల్ల అక్కడ జిరాక్స్ షాపు, బజ్జీలు వేసుకునే 10 మంది బతుకుతారు తప్ప మిగిలిన వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదని బైరెడ్డి ఎద్దేవా చేశారు.

Rayalaseema Steering Committee: సేవ్ రాయలసీమ నినాదంతో ఈనెల 28న ఛలో దిల్లీ నిర్వహిస్తున్నట్లు, రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో రాయలసీమకు సమాన వాటా ఇవ్వాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేయించుకున్న జగన్ రాయలసీమకు ఏమీ చేయలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని బైరెడ్డి ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునేందుకు ఛలో డిల్లీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రాయలసీమకు న్యాయం జరగాలనుకునే వారు ఎవరైనా ఛలో దిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఛలో దిల్లీలో పాల్గొని రాయలసీమ సమస్యలపై కేంద్రానికి వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. ఛలో దిల్లీ తరువాత రాయలసీమ రాజకీయాలు మారతాయని బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి వెల్లడించారు.

రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

వైసీపీ ప్రభుత్వం కర్నూలులో పెడతామంటున్న న్యాయ రాజధాని పెద్ద మోసమని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. న్యాయ రాజధాని వల్ల రాయలసీమ యువతకు ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయ రాజధాని అంటూ కర్నూలుల్లో ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఎవరికి లాభం ఉంటుందని ప్రశ్నించారు. హైకోర్టు బెంచ్ వల్ల అక్కడ జిరాక్స్ షాపు, బజ్జీలు వేసుకునే 10 మంది బతుకుతారు తప్ప మిగిలిన వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదని బైరెడ్డి ఎద్దేవా చేశారు. న్యాయ రాజధాని పెట్టడం వల్ల తామేదో రాయలసీమకు మంచి చేసేశామని భావిస్తూ వైసీపీ నాయకులు గర్జనలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో పదిమంది ఎక్కడ కలిసినా వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుకుంటున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ముందు వివేకాది గుండెపొటు అన్నారని, తర్వాత గొడ్డలి పోటు అన్నారని చెప్పారు. వివేకాను ఒంటరి వాడిని చేసి చంపేశారని బైరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమకు న్యాయ రాజధాని కాకుండా పరిశ్రమలు, అభివృద్ది కావాలని బైరెడ్డి డిమాండ్ చేశారు.

కుటుంబాలను చీల్చితే ముఖ్యమంత్రి జగన్​కు ఏం వస్తుందో ఆర్ధం కావడం లేదని బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి తెలిపారు. నక్క పులి తోలు కప్పుకుని పులిలా ఎలా నటిస్తుందో.. అలాగే కొంత మంది బైరెడ్డి అనే పేరును తోలుగా కప్పుకుని నటిస్తున్నారని విమర్శించారు. బైరెడ్డి పేరును వాడుకుని దందాలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే వారి తోలు తొలుగుతుందన్నారు. పెదనాన్న, చిన్నాన్న మీదకు ముఖ్యమంత్రి జగన్ అబ్బాయిలను ఎగదోస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.