ETV Bharat / state

మార్చి 9 నుంచి దశలవారీగా ఉద్యమ కార్యాచరణ.. సీఎస్​కు తెలిపిన ఉద్యోగులు

author img

By

Published : Feb 28, 2023, 6:05 PM IST

Updated : Feb 28, 2023, 6:22 PM IST

Etv Bharat
Etv Bharat

NOTICES TO CS : ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ప్రకటించి ఉద్యమ నోటీసులను సీఎస్​కు అందించారు. ఉద్యమంలో వారు చేపట్టనున్న కార్యాచరణ వివరాలను సీఎస్​కు అందించిన నోటీసులలో వివరించారు.

AP JAC GIVE NOTICES TO CS : తమ డిమాండ్లు, సమస్యలను పరిష్కరించాలని.. సీఎస్​ జవహర్​ రెడ్డికి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందించారు. ఉద్యోగుల ఆర్థికపరమైన, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ నోటీసులో పేర్కొన్నారు. ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్​ను పక్కదారి ఎందుకు పట్టిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. డీఏ బకాయిలు, సరెండర్ లీవ్​లు, సీపీఎస్​ ఉద్యోగులకు.. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వాటాను కూడా తీసుకుంటున్నారని వాపోయారు.

తమకు వచ్చే ఆదాయంలో 30 శాతం వరకు ఆదాయపు పన్ను కట్టేది ఉద్యోగులు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను అవహేళన చేస్తోందని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల, ఉద్యోగ సంఘాల పట్ల హేళనగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చిన మిగతా రాష్ట్రాలు ఆ పని చేసి చూపుతున్నాయని.. ఏపీలో మాత్రం హామీని నేరవేర్చటం లేదన్నారు. 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు పెంపును.. ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు అమలు చేయడం లేదని వెల్లడించారు.

ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం లేదని.. ఉద్యోగులందరూ ఆందోళనల్లో పాల్గొని ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. ఈ వర్గం, ఆ వర్గం అని చూడకుండా ఉద్యోగులందరూ ఉద్యమంలో పాల్గొని డిమాండ్ల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.

మార్చి 9 నుంచి దశలవారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ సమయంలో ఆందోళనలు నిర్వహిస్తామని వివరించారు. చివరికి కలెక్టరేట్లలో స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్సీ వల్ల ఉద్యోగుల్లో ఉద్యోగ సంఘాల, నేతల పట్ల విశ్వాసం పోయిందన్నారు. అందుకే ఉద్యోగులలో ద్రోహిగా మిగిలిపోకూడదని ఈ ఉద్యమం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. లిఖితపూర్వమైన హామీ ఇస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని తెలిపారు

ప్రస్తుతం ఏపీ జెఏసి అమరావతి ఉద్యోగుల సంఘం మాత్రమే ఒంటరిగా కార్యాచరణ ప్రకటించిందని తెలిపారు. తర్వాత అన్ని సంఘాలు కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రతిసారి చాయ్ బిస్కెట్స్ సమావేశాలతో రాజీ పడినట్లు.. ఈసారి చాయ్ బిస్కెట్స్​తో సమావేశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని వెల్లడించారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ నేత

"మాకు కొత్తగా జీతాలు పెంచమనో, డబ్బులు ఇవ్వమనో ప్రభుత్వాన్ని కోరటం లేదు. ఏ గొంతెమ్మ కోరిక కోరటం లేదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. కొత్తగా పెంచిన 11వ పీఆర్సీ వల్ల.. 10వ పీఆర్సీలో పొందుతున్న రాయితీలు కూడా రద్దు చేసి తగ్గించినందుకు అప్పుడు ఉద్యమానికి వెళ్లాము. ఉద్యమ ఫలితాలలో రద్దు చేసిన వాటిలో కొంచెం తగ్గించుకుని పొందాము తప్ప కొత్తగా పొందిందేమి లేదు. ఆనాటి చర్చలలో ప్రభుత్వం బకాయిలను చెల్లిస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మాకు రావాల్సిన 11వ పీఆర్సీ స్కేల్స్​ మాకు తెలియజేయలేదు. కొత్తగా చేరిన ఉద్యోగులకు వారి పేస్కేల్స్​ వారికి తెలియవు. మాకు రావాల్సిన వేల కొట్ల రూపాయల బడ్జేట్​ను ఎక్కడికి తరలిస్తున్నారని అడుగుతున్నాము." -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ నేత

ఇవీ చదవండి :

Last Updated :Feb 28, 2023, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.