ETV Bharat / state

రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పోలీసులు ఎంట్రీతో సీన్ రివర్స్..

author img

By

Published : Apr 11, 2023, 3:38 PM IST

A Family Tried To Commit Suicide: జీవితం మీద విరక్తి కలిగిన ఓ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని కాపాడేందుకు యత్నించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి చేయి విరగ్గా.. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే?..

family tried to commit suicide falling under train
రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం

A Family Tried To Commit Suicide: కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించారు. జీవితం మీద విరక్తి చెంది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కలిసి మంగళవారం ఉదయం ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని రైల్వే పోలీసులు గమనించి.. వెంటనే వారిని కాపాడేందుకు యత్నించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి చేయి విరగ్గా.. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని పోలీసులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తెరమన్​ బట్టు తాలూకా సాదగర్ గ్రామానికి చెందిన పద్మనాభం, సెల్వి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె కరోనా మహమ్మారి సమయంలో చనిపోయింది. చిన్న కుమార్తె జీవితకు పెళ్లైంది. అయితే జీవిత భర్త తరచుగా ఆ కుటుంబాన్ని వేధించేవాడు. అందుకుగాను జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వారు బెంగళూరులో రైలు ఎక్కారు. అయితే వారు ఆత్మహత్య చేసుకునేందుకు ఎక్కడా వీలు పడలేదు. దీంతో ఆదోని ప్రాంతంలో రైలు దిగారు. వారు దిగిన రైలు కిందే పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఆ కుటుంబం ప్రయత్నించింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు.

పురుగులమందు తాగిన కానిస్టేబుల్ మృతి.. చేనేత కార్మికుడి ఆత్మహత్య..

మరోవైపు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పురుగులమందు తాగిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ నెల ఒకటో తేదీన పురుగులమందు తాగి హరిప్రసాద్ నాయక్ ఆత్మహత్యకు యత్నించారు. అప్పట్నుంచి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన ములకలచెరువులో ఎక్సైజ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తించేవారు.

ఇంకోవైపు అదే జిల్లాలోని అదే ప్రాంతానికి చెందిన అయోధ్యానగర్​లో ఓ చేనేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన వ్యక్తిని ములకలచెరువు మండలం బలకవారిపల్లె వాసి ఆనంద్​రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతడు నాలుగేళ్ల క్రితం మదనపల్లె వచ్చి చేనేత కార్మికుడిగా స్థిరపడ్డాడు. కాగా.. ఆర్థిక ఇబ్బందులతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.